ఇషాన్‌ కిషన్‌కు ఆ అవకాశం ఉందా?

రాబోయే రోజుల్లో టీమ్‌ఇండియా కీపింగ్‌, బ్యాటింగ్‌ స్లాట్‌కు ముంబయి బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ ప్రధాన పోటీదారుడని మాజీ ఛీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. ఈ ఏడాది టీ20 లీగ్‌లో ఇషాన్‌...

Published : 14 Nov 2020 23:52 IST

కీపింగ్‌, బ్యాటింగ్‌ స్లాట్‌కు ప్రధాన పోటీదారుడు

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే రోజుల్లో టీమ్‌ఇండియా కీపింగ్‌, బ్యాటింగ్‌ స్లాట్‌కు ముంబయి బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ ప్రధాన పోటీదారుడని మాజీ ఛీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. ఈ ఏడాది టీ20 లీగ్‌లో ఇషాన్‌ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. టోర్నీలో అతడు నాలుగు అర్ధ శతకాలతో మొత్తం 516 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ముంబయి తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెస్కే ఇలా పేర్కొన్నాడు. 

‘ఈ పాకెట్‌ సైజ్‌ డైనమైట్‌ ఇలా ఆడటం చాలా బాగుంది. ఈ సీజన్‌ అతడికి గుర్తుండిపోతుంది. జట్టు అవసరాలను బట్టి ఓపెనర్‌గా, నాలుగో నంబర్‌ ఆటగాడిగా బరిలోకి దిగాడు. పరిస్థితులకు తగ్గట్టు రాణించాడు. ఈ కారణాలతోనే అతడు త్వరలో టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌ స్లాట్‌కు ప్రధాన పోటీదారుడిగా నిలుస్తాడు. అతడిలాగే ఆడుతుంటే జాతీయ జట్టులో అవకాశం దొరుకుతుంది’ అని ప్రసాద్‌ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా రిషభ్‌ పంత్‌ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. అయితే, కొద్ది కాలంగా అతడు ఆశించినంత మేరకు రాణించలేకపోతున్నాడు. మరోవైపు కేఎల్‌ రాహుల్‌ సైతం ఈ ఏడాది ఆరంభంలో కివీస్‌ పర్యటనలో మెరిశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒకవైపు బ్యాట్స్‌మన్‌గా రాణిస్తూనే వికెట్లు కాచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్‌ ఎలా నెట్టుకొస్తాడో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని