చివరి బంతికి సిక్స్‌ కొట్టినా మ్యాచ్‌ కోల్పోయాం

టీమ్‌ఇండియా క్రికెటర్‌, సన్‌ రైజర్స్‌ హైదారాబాద్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండేకు తన తండ్రే ఆదర్శమని చెప్పాడు. ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం దుబాయ్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్న అతడు...

Published : 28 Aug 2020 14:30 IST

మా నాన్నే నాకు ఆదర్శం: మనీశ్‌ పాండే

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెటర్‌, సన్‌ రైజర్స్‌ హైదారాబాద్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండేకు తన తండ్రే ఆదర్శమని చెప్పాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌ కోసం దుబాయ్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్న అతడు ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్నాడు. తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని అతడికి ఆదర్శమైన వ్యక్తి ఎవరని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. ‘మా నాన్నెప్పుడూ జీవితం గురించి చాలా విషయాలు నాతో పంచుకునేవారు. నేను కూడా ఆయన అడుగుజాడల్లోనే పెరిగాను. కాబట్టి, కచ్చితంగా ఆయనే నాకు ఆదర్శం’ అని పేర్కొన్నాడు. అలాగే ఇంకో అభిమాని అతడికి ఇష్టమైన మ్యాచ్‌ ఏదని అడగ్గా.. గతేడాది ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడిన 51వ మ్యాచ్‌ అని గుర్తుచేసుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో తాము 162 పరుగుల లక్ష్యం ఛేదించాల్సి వచ్చిందని, అప్పుడు చివరి బంతికి సిక్స్‌ బాదాల్సి రాగా, తానే బ్యాటింగ్‌ చేశానని చెప్పాడు. హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో దాన్ని సిక్స్‌గా మలిచినా మ్యాచ్‌ టైగా ముగిసిందని, తర్వాత సూపర్‌ ఓవర్‌లో ముంబయి గెలిచిందని సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ వివరించాడు. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవాలంటే పాండ్య వేసిన ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావాలి. అప్పుడు క్రీజులో మహ్మద్‌ నబీ(24), మనీశ్‌ పాండే(62) మ్యాచ్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. తొలి రెండు బంతులకు సింగిల్స్‌ రాగా, మూడో బంతిని నబీ సిక్స్‌గా మలిచాడు. నాలుగో బంతిని కూడా అలాగే ఆడబోయి క్యాచ్‌ ఔటయ్యాడు. ఇక రెండు బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా, మనీశ్‌ అయిదో బంతికి రెండు పరుగులు, ఆరో బంతికి సిక్స్‌ సాధించాడు. దీంతో మ్యాచ్‌ టైగా మారింది. ఇక సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ఏడు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం ముంబయి ఇండియన్స్ సునాయాస విజయం సాధించింది. ఇదే తనకు చాలా ఇష్టమైన మ్యాచ్‌ అని మనీశ్‌ పేర్కొన్నాడు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని