సంక్షిప్త వార్తలు(4)

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. తొలి వన్డేలో 27 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 298/7 స్కోరు చేసింది.

Published : 29 Jan 2023 02:34 IST

దక్షిణాఫ్రికా బోణీ

బ్లూమ్‌ఫౌంటీన్‌: ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. తొలి వన్డేలో 27 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 298/7 స్కోరు చేసింది. వాండర్‌డసెన్‌ (111; 117 బంతుల్లో 6×4, 1×6)) సెంచరీతో మెరిశాడు. మిల్లర్‌ (53) కూడా రాణించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో సామ్‌ కరన్‌ (3/35) సత్తా చాటాడు. ఛేదనలో ఇంగ్లాండ్‌కు మెరుపు ఆరంభం లభించింది. సెంచరీ వీరుడు జేసన్‌ రాయ్‌ (113; 91 బంతుల్లో 11×4 4×6).. డేవిడ్‌ మలన్‌ (59; 55 బంతుల్లో 9×4)తో తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు గట్టిపునాది వేశాడు. రాయ్‌, మలన్‌ ఔటైనా.. ఇంగ్లాండ్‌ 33.4 ఓవర్లలో 222/4తో మెరుగ్గానే కనిపించింది. కానీ నోకియా (4/62), సిసాండా (3/46) విజృంభించడంతో క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుని 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. చివరి 6 వికెట్లను ఇంగ్లాండ్‌ 49 పరుగుల తేడాతో కోల్పోయింది.


క్లబ్‌ సంస్కృతి లేకపోవడం వల్లే ఓటమి: వోల్ట్‌మన్స్‌

భువనేశ్వర్‌: క్లబ్‌ సంస్కృతి లేకపోవడం, వ్యూహాలపై అవగాహన లోపించడం వల్లే   హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ త్వరగా నిష్క్రమించిందని మాజీ కోచ్‌ రొలెంట్‌ వోల్ట్‌మన్స్‌ విశ్లేషించాడు. హాకీ ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌కు ముందే భారత్‌ ఓడిన నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘భారత హాకీలో క్లబ్‌ సంస్కృతి లేదు. ఎప్పుడూ టచ్‌లో ఉండాలంటే ఆటగాళ్లు తరుచూ మ్యాచ్‌లు ఆడాలి. భారత ఆటగాళ్లలో ప్రతిభకు కొదువ లేదు. కానీ మ్యాచ్‌లో ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలో తెలుసుకోవాలి. ప్రపంచకప్‌ కీలక మ్యాచ్‌లో మరో అయిదు నిమిషాల్లో ఆట పూర్తవుతుందనగా న్యూజిలాండ్‌ పది మందితోనే ఆడింది. ఇలాంటి సమయంలో భారత్‌ ఏం చేసింది? వ్యూహం చాలా కీలకం. మరోవైపు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో జర్మనీ చివరి మూడు నిమిషాల్లో 2 గోల్స్‌ కొట్టింది. ప్రణాళికలను అప్పటికప్పుడు మార్చడం అంటే అదే. ఈ విషయంలో భారత్‌ ఇంకా మెరుగుపడాలి. జట్టుకు మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌ లేకపోవడం కూడా ఆశ్చర్యమే’’ అని వోల్ట్‌మన్స్‌ అన్నాడు.


భారత్‌తో సిరీస్‌ పెద్ద సవాల్‌: వార్నర్‌

మెల్‌బోర్న్‌: ఊపిరి సలపని క్రికెట్‌ ఆడి అలిసిపోయానని భారత్‌తో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్‌ పెద్ద సవాలేనని ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. గతేడాది జింబాబ్వే, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లు ఆడిన 36 ఏళ్ల వార్నర్‌.. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌లోనూ పాల్గొన్నాడు. స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌లో ఆడడంతో పాటు బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్‌ తరఫున బరిలో దిగాడు. ‘‘ఊపిరి సలపని క్రికెట్‌తో బాగా అలసిపోయా. భారత్‌తో త్వరలో జరిగే టెస్టు సిరీస్‌ పెద్ద సవాల్‌. వీలైనంత తాజాగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న 2023 వన్డే ప్రపంచకప్‌పై కూడా దృష్టి సారించా’’ అని వార్నర్‌ చెప్పాడు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ఫిబ్రవరి 9న ఆరంభం కానుంది.


రింకీ జోడీకి డబుల్స్‌ ట్రోఫీ

స్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ ట్రోఫీని రింకీ హిజికత- జేసన్‌ కుబ్లెర్‌ (ఆస్ట్రేలియా) జోడీ దక్కించుకుంది. శనివారం ఫైనల్లో ఈ జంట 6-4, 7-6 (7-4)తో హూగో నీస్‌ (మొనాకో)- జెలిన్‌స్కీ (పోలెండ్‌)పై గెలిచింది. తొలిసారి జత కట్టిన రింకీ- జేసన్‌ ద్వయం ఈ టోర్నీలో వైల్డ్‌కార్డు ప్రవేశం పొందింది. వీళ్లిద్దరికీ ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని