SRH vs LSG: క్లాసెన్, అమిత్ మిశ్రాకు జరిమానా.. క్లారిటీ ఇచ్చిన ఐపీఎల్ కమిటీ

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో (IPL 2023) హైదరాబాద్ చేజేతులా ఓటమిని చవిచూసింది. లఖ్‌నవూపై దాదాపు 15 ఓవర్లపాటు ఆధిక్యం ప్రదర్శించిన హైదరాబాద్‌ కేవలం ఒక్క ఓవర్‌తో తమ విజయాన్ని దూరం చేసుకుంది.

Updated : 14 May 2023 11:17 IST

ఇంటర్నెట్ డెస్క్: ఉప్పల్‌ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH) ఓటమిని చవిచూసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లఖ్‌నవూపై కీలక ఇన్నింగ్స్‌ ఆడిన హెన్రిచ్‌ క్లాసెన్‌కు జరిమానా పడింది. అలాగే లఖ్‌నవూ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో వీరిద్దరిపై 10 శాతం జరిమానా విధిస్తున్నట్లు కమిటీ పేర్కొంది. నో బాల్‌ వ్యవహారం తర్వాత థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

‘‘ఐపీఎల్ కోడ్‌ ఆఫ్ కండక్ట్ అండర్ 2.7 ఆర్టికల్ లెవెల్‌ 1 నేరం కింద సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌కు పది శాతం జరిమానా విధించడం జరిగింది. బహిరంగ విమర్శలు చేయడం, అంపైర్‌ నిర్ణయంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విచారణలో తేలింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ బౌలర్‌ అమిత్ మిశ్రా కూడా ఐపీఎల్ కోడ్‌ ఆఫ్ కండక్ట్ 2.2 ఆర్టికల్‌ లెవల్ 1 ప్రకారం మ్యాచ్‌ సందర్భంగా క్రీడా పరికరాలను అవమానించినందుకు పదిశాతం జరిమానా విధించాం’’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది. 

అభిషేక్ శర్మ చెత్త రికార్డు

అభిషేక్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు పడింది. ఒకే ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చిన బౌలర్‌గా మారాడు. ఐదు సిక్స్‌లు, ఒక వైడ్‌ సహా 31 పరుగులు ఇచ్చాడు. కీలకమైన స్టాయినిస్‌ వికెట్‌ తీసినప్పటికీ.. ఈ ఓవర్‌తోనే లఖ్‌నవూ గెలుపు బాట పట్టింది. ఇలా ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టించిన ఐదో బౌలర్‌ కూడా అభిషేక్‌ కావడం విశేషం. యశ్ దయాల్,  శివమ్‌ మావి, హర్షల్‌ పటేల్, షెల్డన్‌ కాట్రెల్, రాహుల్ శర్మ ఈ జాబితాలో ఉన్నారు.

హెచ్‌సీఏ తీరుపై సునీల్‌ గావస్కర్ అసహనం

లఖ్‌నవూ డగౌట్‌లోని సిబ్బంది, ఆటగాళ్లపై అభిమానులు బోల్డులు, నట్టులు విసిరిన ఘటనపై టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అసహనం వ్యక్తం చేశాడు. అలాగే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఏర్పాట్లపైనా విమర్శలు గుప్పించాడు. డగౌట్‌ను కేవలం గొడుగులతో ఏర్పాటు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ప్రతి చోటా ఫ్లెక్సీ గ్లాస్‌తో ఏర్పాటు చేస్తుంటే.. ఇక్కడ మాత్రం ఇలా పెట్టడంపై హెచ్‌సీఏను ప్రశ్నించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని