MS Dhoni: రిజర్వ్‌డే మ్యాచ్‌.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్‌కు (IPL 2023) వరుణుడి గండం పొంచి ఉంది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ నేటికి వాయిదా పడింది. రిజర్వ్‌ డే మ్యాచ్‌ కావడం సీఎస్‌కే అభిమానుల్లో కాస్త కలవరం రేగుతోంది. మరి అదేంటంటే..?

Published : 29 May 2023 10:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌  (IPL) చరిత్రలో తొలిసారి వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వెళ్లింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌ - గుజరాత్ టైటాన్స్‌ (CSK vs GT) జట్ల మధ్య ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్‌ పోరు ఆదివారం జరగాల్సి ఉంది. అయితే, వర్షం వల్ల నేటికి (సోమవారం) మ్యాచ్‌ వాయిదా పడింది. హార్దిక్‌ నాయకత్వంలోని గుజరాత్ వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని భావిస్తుండగా.. ముంబయితో సమంగా ఐదు టైటిళ్లను గెలవాలని ధోనీ సేన (MS Dhoni) ఉవ్విళ్లూరుతోంది. అయితే, రిజర్వ్‌ డే రోజున జరిగిన మ్యాచ్‌లో ధోనీకి ఎలాంటి ఫలితం వస్తుందోనని సీఎస్‌కే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రిజర్వ్‌ డే మ్యాచ్‌ అనగానే  2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ గుర్తుకురావడం సహజం. అప్పుడు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ రిజర్వ్‌డేకు వెళ్లింది. న్యూజిలాండ్‌పై ధోనీ (50) హాఫ్‌ సెంచరీ సాధించినా టీమ్‌ఇండియా మాత్రం ఓడిపోయింది. కీలక సమయంలో ధోనీ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. విజయానికి చేరువగా వచ్చి మరీ భారత్ ఓటమిపాలైంది. ధోనీకి అదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం గమనార్హం. మరుసటి ఏడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. ఆటగాడిగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌గా భావిస్తున్న తరుణంలో రిజర్వ్‌ డే మ్యాచ్‌లో విజయం సాధించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇలా జరగాలంటే మ్యాచ్‌ రద్దు కాకుండా కొన్ని ఓవర్లతోనైనా జరగాలి. ఈ క్రమంలో గత చరిత్రను ధోనీ తిరగరాసి ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

వరుణుడు అనుగ్రహించేనా..?

వర్షం కారణంగా వాయిదా పడిన మ్యాచ్‌కు నేడు కూడా వరుణుడి నుంచి గండం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయితే మాత్రం సీఎస్‌కేకు నిరాశే మిగులుతుంది. వర్షం కారణంగా రద్దు అయిన పక్షంలో విజేతగా గుజరాత్ టైటాన్స్‌ కప్‌ను సొంతం చేసుకుంటుంది. లీగ్ స్టేజ్‌లో పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. గుజరాత్ 10 విజయాలతో 20 పాయింట్లు సాధించింది. చెన్నై ఖాతాలో 17 పాయింట్లు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. దీంతో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా గుజరాత్‌ అవతరిస్తుంది. ఈ క్రమంలో వరుణుడు ఏం చేస్తాడో వేచి చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని