MS Dhoni: ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతం

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) ఎడమ మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. రెండ్రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయొచ్చని సీఎస్‌కే సీఈవో విశ్వనాథన్‌ తెలిపాడు.

Updated : 01 Jun 2023 21:34 IST

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) ఎడమ మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ సీజన్‌లో మహీ మోకాలి సమస్యతో బాధపడ్డ విషయం తెలిసిందే. కప్‌ గెలిచిన 48 గంటల్లోనే శస్త్రచికిత్స కోసం అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి వెళ్లాడు. గురువారం బీసీసీఐ మెడికల్‌ ప్యానెల్‌లో సభ్యుడైన డాక్టర్‌ దిన్‌షా పార్ధివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ధోని మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించింది. డాక్టర్‌ దిన్‌షా గతంలో రిషబ్‌ పంత్‌, నీరజ్‌ చోప్రాలకు ఆపరేషన్లు చేశారు. 

‘‘ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో ధోని మోకాలికి శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం ఆయన బానే ఉన్నారు. రెండ్రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయొచ్చు. తర్వాత కొంత కాలంపాటు ధోని విశ్రాంతి తీసుకుంటారు. మరో ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యేందుకు ఇప్పుడు ధోనికి మరింత సమయం దొరుకుతుంది’’ అని సీఎస్‌కే (CSK) సీఈవో విశ్వనాథన్‌ తెలిపారు. ఈ ఐపీఎల్‌లో మోకాలి గాయంతో ధోని ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఒకానొక సందర్భంలో తనను వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తించ వద్దని సహచర బ్యాటర్లను కోరాడు. మరోవైపు ధోనీ ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించేస్తాడేమో అన్న చర్చ కూడా జరిగింది. కానీ చెన్నైకి అయిదో ట్రోఫీ అందించిన అనంతరం ధోని మాట్లాడుతూ.. కష్టమైనప్పటికీ అభిమానుల కోసం ఇంకో సీజన్‌ ఆడేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని