On This Day: ఆ ఓటమికి సరిగ్గా 20 ఏళ్లు.. ప్రతి భారతీయుడి గుండె పగిలిన రోజు

2003 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ జరిగి నేటికి సరిగ్గా 20 ఏళ్లు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ టైటిల్‌ పోరులో భారత్‌ 125 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

Updated : 23 Mar 2023 14:58 IST

ఇంటర్నెట్ డెస్క్: అది 2003.. మార్చి 23. జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌. 20 సంవత్సరాల తర్వాత రెండోసారి కప్‌ని దక్కించుకోవడానికి భారత్‌కు వచ్చిన అవకాశమది. ఇంకేముంది.. స్టేడియం మొత్తం టీమ్ఇండియా (Team India) అభిమానులతో నిండిపోయింది. మ్యాచ్‌ ప్రారంభం కావడానికి ముందు జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియా అభిమానులు.. మ్యాచ్‌ ముగిసాక తీవ్ర నిస్తేజంలో మునిగిపోయారు. అందుక్కారణం ఫైనల్‌లో కంగారులను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందనుకుంటే అనుహ్యంగా ఘోర ఓటమిపాలైంది. ఈ ఓటమితో ప్రతి భారతీయుడి గుండె పగిలింది! మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ వీక్షించిన ప్రేక్షకులతోపాటు టీవీల్లో చూసిన లక్షలాది అభిమానులు పరాజయాన్ని జీర్ణించుకోలేక కన్నీరు పెట్టారు. 2003 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ జరిగి నేటికీ సరిగ్గా 20 ఏళ్లు. ఈ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా (Australia) 125 పరుగుల తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. రికీ పాంటింగ్ (140*; 121 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసానికితోడు.. డామియన్ మార్టిన్ (88*; 84 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధ శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు సాధించింది. గిల్‌క్రిస్ట్ (57), మాథ్యూ హెడెన్‌ (37) కూడా రాణించారు. టోర్నీలో అత్యధిక పరుగులు (673) చేసిన సచిన్‌ తెందూల్కర్‌ కీలకమైన టైటిల్‌ పోరులో నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. వీరేంద్ర సెహ్వాగ్ (82; 81 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ద్రవిడ్‌ (47) రాణించారు. కెప్టెన్‌ గంగూలీ (24)తోపాటు యువ బ్యాటర్‌గా ఉన్న యువరాజ్‌ సింగ్ (24) మహమ్మద్‌ కైఫ్‌ (0) విఫలమయ్యారు. ఆఖరుకు టీమ్‌ఇండియా 234 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లలో గ్లెన్‌ మెక్‌గ్రాత్ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రెట్ లీ, సైమండ్స్‌ రెండేసి వికెట్లు తీశారు. బ్రాడ్ హాగ్‌, ఆండీ బిచెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని