INDvsSL: శ్రీలంక ఆటగాళ్లపై మురళీధరన్‌ ఫైర్‌

శ్రీలంక సీనియర్‌ ఆటగాళ్లపై ఆ జట్టు స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ విషయంలో పలువురు లంక ఆటగాళ్లకు, ఆ దేశ క్రికెట్‌ బోర్డుకు చాలా రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే...

Published : 14 Jul 2021 01:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంక సీనియర్‌ ఆటగాళ్లపై ఆ జట్టు స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ విషయంలో పలువురు లంక ఆటగాళ్లకు, ఆ దేశ క్రికెట్‌ బోర్డుకు చాలా రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు ‘టూర్‌ కాంట్రాక్ట్‌’ లెక్కన ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు ‘సెంట్రల్‌ కాంట్రాక్ట్‌’కు ససేమిరా అన్నారు. చెల్లింపుల విషయంలో స్పష్టత లేదనే కారణంగా చాలా మంది ఆటగాళ్లు నిరాకరించినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన మురళీధరన్‌ తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ సీనియర్లపై మండిపడ్డాడు.

యువ క్రికెటర్లు ‘సెంట్రల్‌ కాంట్రాక్ట్‌’ చేసుకోకపోవడానికి సీనియర్లే కారణమన్నాడు. అందరికీ బోర్డు అవకాశం కల్పించిందని, అయినా పలువురు సీనియర్లు ఎవరినీ ఒప్పందం చేసుకోనివ్వలేదని మురళీధరన్‌ అన్నాడు. ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లకు చెల్లింపులు జరిపే నూతన విధానం తీసుకురావడంతో ఇటీవల కొందరు సీనియర్లకు తక్కువ మొత్తం అందిందని, అందువల్లే ‘సెంట్రల్‌ కాంట్రాక్ట్‌’కు ఎవరినీ ఒప్పుకోనివ్వలేదని చెప్పాడు. మరోవైపు కొందరు ఆటగాళ్లు ‘సెంట్రల్‌ కాంట్రాక్ట్‌’కు ఒప్పుకున్నా ఇప్పుడు బోర్డు ‘టూర్‌’ ప్రాతిపదకన మాత్రమే చెల్లింపులు జరపాలని నిర్ణయించినట్లు వివరించాడు. దాంతో టెస్టు క్రికెట్‌ మాత్రమే ఆడే సీనియర్లు నష్టపోతున్నారన్నాడు. ఇక ఈనెల 18 నుంచి టీమ్‌ఇండియాతో ఆడే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు లంక ఆటగాళ్లు టూర్‌ ప్రాతిపదికన ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని