టీ20 ప్రపంచకప్‌ కన్నా టెస్టు క్రికెటే ముఖ్యం

టెస్టు క్రికెటే తనకు తొలి ప్రాధాన్యమని, అందుకోసం టీ20 ప్రపంచకప్‌ను కూడా వదులుకుంటానని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. ఇటీవల మోచేతికి గాయమైన అతడు నెమ్మదిగా కోలుకుంటున్నాడు...

Updated : 03 Jul 2021 16:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్టు క్రికెటే తనకు తొలి ప్రాధాన్యమని, అందుకోసం టీ20 ప్రపంచకప్‌ను కూడా వదులుకుంటానని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. ఇటీవల మోచేతికి గాయమైన అతడు నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమయ్యాడు. అయితే, తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం నేను బాగా కోలుకుంటున్నా. అయితే అది నిదానంగా జరుగుతోంది. ఇప్పుడైతే బాగున్నా. నేను కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండాలని అనుకుంటున్నా. కానీ, నా వ్యక్తిగత కోణంలో ఆలోచిస్తే టెస్టు క్రికెట్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తాను. అలా యాషెస్‌ సిరీస్‌ వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధించి గతంలో ఈ సిరీస్‌లో ఎలా ఆడానో ఇప్పుడూ అలానే ఆడాలని అనుకుంటున్నా. అలాంటి ప్రదర్శనతో నన్ను నేను అత్యున్నత స్థాయిలో చూడాలనుకుంటున్నా. ఈ నేపథ్యంలో ఒక వేళ నేను ప్రపంచకప్‌లో ఆడలేకపోయినా ఫర్వాలేదు. కానీ, పరిస్థితులు అంతవరకూ రావనే అనుకుంటున్నా’ అని స్మిత్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఈ ఆస్ట్రేలియన్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ తర్వాత ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. అనంతరం జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఏకంగా 774 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. ఇప్పుడు గాయం నుంచి త్వరగా కోలుకొని ఈసారి కూడా డిసెంబర్‌లో జరిగే యాషెస్‌ సిరీస్‌లో బ్యాట్‌ ఝుళిపించాలని అనుకుంటున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని