Sunil Narine: అయ్యో నరైన్‌.. తృటిలో యువరాజ్‌ సింగ్‌ ప్రపంచ రికార్డు మిస్ చేసుకున్నావే!

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌ కీలక ఆటగాడు సునీల్‌ నరైన్‌ తృటిలో టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌కు చెందిన ప్రపంచ రికార్డును మిస్‌ అయ్యాడు...

Updated : 17 Feb 2022 13:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కీలక ఆటగాడు సునీల్‌ నరైన్‌ తృటిలో టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మిస్‌ అయ్యాడు. గత రాత్రి బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో జరిగిన ఓ కీలక పోరులో ఈ విండీస్‌ ఆటగాడు 13 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. దీంతో టీ20 క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక మార్కస్‌ ట్రెస్కోతిక్‌.. నరైన్‌ కన్నా ముందు 13 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ఉన్నాడు. అంతకుముందు యువరాజ్‌, క్రిస్‌గేల్‌, హజ్రతుల్లా జాజాయ్‌ 12 బంతుల్లోనే అర్ధశతకాలు సాధించి.. వీరికన్నా ముందున్నారు. దీంతో తక్కువ బంతుల్లో అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో నరైన్‌ ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచాడు.

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బుధవారం చట్టోగ్రామ్‌ ఛాలెంజర్స్‌, కోమిల్లా విక్టోరియన్స్‌ జట్లు నాకౌట్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ సందర్భంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన చట్టోగ్రామ్‌ టీమ్‌ 19.1 ఓవర్లలోనే 148 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కోమిల్లా విక్టోరియన్స్‌ 12.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా వచ్చిన నరైన్‌ (57; 16 బంతుల్లో 5x4, 6x6) దంచి కొట్టాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించాడు. దీంతో అతడి ఇన్నింగ్స్‌ (0, 6, 4, 4, 6, 4, 6, 4, 6, 0, 4, 6, 1, 6) ఇలా సాగింది. ఇక అతడు ఔటయ్యాక వచ్చిన డుప్లెసిస్‌ (30; 23 బంతుల్లో 2x4, 1x6), మొయిన్‌ అలీ (30; 13 బంతుల్లో 3x4, 2x6) నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను పూర్తి చేశారు. అలా చివరికి విక్టోరియన్స్‌ టీమ్‌ ఫైనల్‌ చేరింది. కాగా, నరైన్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అతడి ఇన్నింగ్స్‌ ఎలా సాగిందో మీరూ చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని