WTC Final: తొలి క్రికెటర్‌గా ట్రావిస్‌ హెడ్‌ ఘనత.. మొదటి రోజు ఆటలో రికార్డుల జోరు!

డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final 2023) తొలి రోజు ఆటలో ఆసీస్‌ అదరగొట్టేసింది. ఆరంభంలో భారత్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించినా.. చివరికి ఆసీస్‌ పైచేయి సాధించింది. ట్రావిస్‌ హెడ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు.

Updated : 08 Jun 2023 11:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా - భారత్‌ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final 2023) తొలి రోజు ఆటలో రికార్డులు నమోదయ్యాయి. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రావిస్‌ హెడ్‌ (146*: 156 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్స్‌) సెంచరీ బాదేశాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా హెడ్ అవతరించాడు. ప్రస్తుతం ఇది రెండో డబ్ల్యూటీసీ ఫైనల్‌ అనే విషయం తెలిసిందే. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను స్టీవ్‌ స్మిత్‌తో (95*:227 బంతుల్లో 14 ఫోర్లు) కలిసి హెడ్ ఆదుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి 76 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసేసమయానికి 327/3 స్కోరు సాధించింది. స్మిత్‌ - హెడ్ నాలుగో వికెట్‌కు 251 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్‌ తన కెరీర్‌లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. 

ఆ వార్మప్‌ గేమ్స్‌ ఫలితమే: ట్రావిస్ హెడ్

‘‘తొలుత టాస్‌ ఓడిపోయినప్పటికీ.. ఆట ముగిసేసమయానికి పైచేయి సాధించాం. ఆరంభంలో కాస్త శ్రమించాల్సి వచ్చింది. కుదురుకోవడంతో దూకుడుగా ఆడేయగలిగా. విపరీతంగా ప్రాక్టీస్‌ చేయడం వల్లే ఇదంతా సాధ్యమైంది. నా ఇన్నింగ్స్‌తో ఎంతో సంతృప్తిగా ఉన్నా. మరో ఎండ్‌లో మద్దతుగా నిలిచే బ్యాటర్ ఉంటే స్వేచ్ఛగా ఆడొచ్చు. స్టీవ్‌ స్మిత్ సహకారం మరువలేనిది. అతడి బ్యాటింగ్‌ అంటే చాలా ఇష్టం. పిచ్‌ కూడా మొదట్లో కఠినంగా అనిపించింది’’ అని ట్రావిస్ హెడ్ తెలిపాడు. 

తొలి రోజు ఆట విశేషాలు.. 

  • గత 57 టెస్టుల్లో తొలుత బౌలింగ్‌ ఎంచుకుని ఆడిన భారత్‌ కేవలం 9 మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరో 20 టెస్టుల్లో ఓటమి చెందగా.. 28 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 
  • ఇంగ్లాండ్‌లో పర్యాటక బ్యాటర్ అత్యధిక టెస్టు పరుగులు చేసిన జాబితాలో స్టీవ్‌ స్మిత్ (1822* పరుగులు) నాలుగో ఆటగాడు. గ్యారీఫీల్డ్‌ సోబెర్స్ (1820 పరుగులు)ను స్మిత్ అధిగమించాడు. ఈ లిస్ట్‌లో డాన్ బ్రాడ్‌మన్‌ (2674 పరుగులు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఓవల్‌లో స్మిత్ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 486 పరుగులు సాధించాడు. 
  • ఆస్ట్రేలియా తరఫున ఇంగ్లాండ్‌లో నాలుగో వికెట్‌కు ఇది రెండో అత్యధిక పరుగుల భాగస్వామ్యం. స్మిత్ - హెడ్ 251 పరుగులతో కొనసాగుతున్నారు. అంతకుముందు 1934లో డాన్‌ బ్రాడ్‌మన్ - బిల్‌ పోన్స్‌ఫోర్డ్‌ ఇంగ్లాండ్‌ మీదనే 388 పరుగులు సాధించారు. 
  • ఇక భారత్‌పై ఆసీస్‌కు ఏ వికెట్‌కైనా నాలుగో అత్యధిక భాగస్వామ్యం ఇదే. స్మిత్ -హెడ్ కలిసి 251 పరుగులు చేయగా.. 2012లో అడిలైడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై పాంటింగ్ - మైకెల్ క్లార్క్‌ కలిసి 386 పరుగులు జోడించారు. 
  • డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో హెడ్ - స్మిత్‌ కలిసి ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్‌ల్లో 99.28 సగటుతో 695 పరుగులు జోడించారు. ఇక ట్రావిస్ హెడ్ ఈ సీజన్‌లోనే అత్యధిక బ్యాటింగ్‌ స్ట్రైక్‌రేట్‌ కలిగిన ఆటగాడిగా మారాడు. ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్న రిషభ్‌ పంత్ (80.81)ను హెడ్‌ అధిగమించాడు. ప్రస్తుతం ట్రావిస్‌ హెడ్ 81.91తో కొనసాగుతున్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని