కోహ్లీ బుట్టలో పడని కైల్‌ జేమీసన్‌ 

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయితే, ఇక్కడ కూడా ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ‌(డబ్ల్యూటీసీ) గురించి ఆలోచిస్తున్నాడని తెలిసింది...

Published : 29 Apr 2021 20:46 IST

ఐపీఎల్‌లో టెస్టు ఛాంపియన్‌షిప్‌ మాటలు.

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయితే, ఇక్కడ కూడా ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ‌(డబ్ల్యూటీసీ) గురించి ఆలోచిస్తున్నాడని తెలిసింది. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ మ్యాచ్‌లో డ్యూక్‌ బాల్స్‌ను వినియోగించనున్నారు. ఈ క్రమంలోనే అక్కడ రాణించడానికి కోహ్లీ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అందుకు సంబంధించిన ఓ ఉదాహరణను ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ డానియల్‌ క్రిస్టియన్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్లో పంచుకున్నాడు.

‘విరాట్‌ చాలా తెలివైన వాడు. ఐపీఎల్‌ ప్రారంభమైన తొలి వారంలో నేనూ, అతడు, కైల్‌ జేమీసన్‌ నెట్స్‌లో సాధన చేసి ఓ చోట కూర్చున్నాం. ఆ సమయంలో వాళ్లిద్దరూ టెస్టు క్రికెట్‌ గురించి మాట్లాడుకున్నారు. అప్పుడే జేమీసన్‌ తన వద్ద డ్యూక్‌ బాల్స్‌ ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ ప్రాక్టీస్‌ చేసేందుకు వాటిని తీసుకొచ్చానని అన్నాడు. దాంతో కోహ్లీ.. జేమీని తన బుట్టలో వేసుకోవాలని చూశాడు. ప్రాక్టీస్‌ చేసేటప్పుడు ఆ బంతులను తనకు వేయమని కోహ్లీ అడిగాడు. కానీ, అలా చేయనని న్యూజిలాండ్‌ పేసర్ జవాబిచ్చాడు’ అని క్రిస్టియన్‌ పేర్కొన్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగిందన్నాడు.

కోహ్లీ: జేమీ నువ్వు డ్యూక్‌ బాల్స్‌తో ఎక్కువగా బౌలింగ్‌ చేశావా?

జేమీ: అవును చేశాను. ఇక్కడ కూడా ప్రాక్టీస్‌ చేసేందుకు కొన్ని బంతులు తీసుకొచ్చాను. టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లేముందు ఇక్కడ ప్రాక్టీస్‌ చేస్తా.

కోహ్లీ: కావాలంటే ఇక్కడ నెట్స్‌లో ఆ బంతులతో నువ్వు నాకు బౌలింగ్‌ చేయొచ్చు. వాటితో నీ బౌలింగ్‌ను ఎదుర్కోడానికి చాలా సంతోషిస్తా.

జేమీ: అలాంటి అవకాశమే లేదు. నేను నీకు బౌలింగ్‌ చేయను.

జేమీసన్‌ బౌలింగ్‌ చేసి ఉంటే డ్యూక్‌ బాల్స్‌తో అతడి బౌలింగ్‌ శైలిని కోహ్లీ గమనించేవాడని క్రిస్టియన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా, గతేడాది టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌ పర్యటనలో అద్భుత బౌలింగ్‌ చేసిన జేమీసన్‌.. కోహ్లీతో సహా పలువురు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో ఆర్సీబీ కివీస్‌ పేసర్‌ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇక్కడ అతడు అనుకున్నంత మేర రాణించలేకపోతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని