కీరన్‌ పొలార్డ్‌ మెరుపులు‌.. 6 X 6 

అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి ఆరు బంతుల్లో ఆరు సిక్సులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ హర్ష్‌లీగిబ్స్‌, టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తర్వాత...

Updated : 04 Mar 2021 08:53 IST

టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై విండీస్‌ విజయం

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి ఆరు బంతుల్లో ఆరు సిక్సులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ హర్ష్‌లీగిబ్స్‌, టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తర్వాత వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ఆ ఘనత సాధించాడు. గతరాత్రి శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మన్‌ ఈ రికార్డు సృష్టించాడు. అఖిల ధనంజయ వేసిన ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది తర్వాతి ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఈ క్రమంలోనే విండీస్‌ 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లకు 131/9 స్కోర్‌ సాధించింది. పాతుమ్‌ నిస్సంక(39; 34 బంతుల్లో 4x4), డిక్‌విల్లా(33; 29 బంతుల్లో 3x4, 1x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఛేదనకు దిగిన విండీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి 13.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. పొలార్డ్‌(38; 11 బంతుల్లో 6x6) ఒకే ఓవర్‌లో సిక్సుల వర్షం కురిపించడంతో విండీస్‌ ఏడు ఓవర్లు మిగిలుండగానే విజయం సాధించింది. ధనంజయ వేసిన ఆరో ఓవర్‌లో పొలార్డ్‌ మైదానం నలువైపులా బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. అయితే, తర్వాతి ఓవర్‌లోనే అతడు.. హసరంగా బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. చివర్లో జేసన్‌ హోల్డర్‌(29; 24 బంతుల్లో 1x4, 2x6) విన్నింగ్‌ సిక్సర్‌ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు హర్ష్‌లీ గిబ్స్‌(72; 40 బంతుల్లో 4x4,  7x6).. 2007 వన్డే ప్రపంచకప్‌లో నెదర్‌లాండ్స్‌పై తొలిసారి ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు సాధించి కొత్త రికార్డు సృష్టించాడు. ఆపై అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌(58; 16 బంతుల్లో 3x4, 7x6) ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాదాడు. ఈ క్రమంలోనే పొలార్డ్‌ ఆ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా, రెండో టీ20 క్రికెటర్‌గా నిలిచాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని