WPL: మహిళల ప్రీమియర్‌ లీగ్‌.. అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధికి మార్గం: బిన్నీ

మహిళా క్రికెటర్ల కోసం బీసీసీఐ (BCCI) నిర్వహించే మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL) ఆరంభంలోనే రికార్డు సృష్టించింది. ఫ్రాంచైజీల హక్కుల కోసం బిడ్డింగ్‌లను నిర్వహించగా.. భారీ ధరకు అమ్ముడు కావడం విశేషం.

Published : 27 Jan 2023 00:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్‌ చరిత్రలో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) చరిత్ర సృష్టించింది. ఐదు ఫ్రాంచైజీల కోసం నిర్వహించిన బిడ్డింగ్‌లను బీసీసీఐ (BCCI) ఇప్పటికే వెల్లడించింది. ఐదేళ్లపాటు హక్కుల కోసం రూ. 4,669.99 కోట్లతో ఐదు ఫ్రాంచైజీలను పలు సంస్థలు సొంతం చేసుకొన్నాయి. మొదటిసారి ఐపీఎల్ (IPL 2008) హక్కుల కోసం పోటీపడిన మొత్తం కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ క్రమంలో ఐదు ఫ్రాంచైజీల యాజమాన్యాలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ శుభాకాంక్షలు తెలిపాడు. భారత్‌లోని మహిళల క్రికెట్‌కు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకొనేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. 

‘‘ఐదు ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్న విజేతలకు శుభాకాంక్షలు. భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్లేయర్లు ఒకరినొకరు నేర్చుకొనేందుకు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ చక్కగా ఉపయోగపడుతుంది. అట్టడుగు స్థాయి నుంచి మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవడంతోపాటు ఎక్కువ మంది మహిళలను క్రికెట్‌ వైపు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. బిడ్డింగ్‌ ప్రక్రియ సాఫీగా సాగిపోవడానికి కృషి చేసిన బీసీసీఐ బృందం సభ్యులకు నా అభినందనలు. అంతర్జాతీయంగా మన మహిళా క్రికెటర్లు రాణించడానికి తప్పకుండా ఈ లీగ్‌ సాయపడుతుందని ఆశిస్తున్నా’’ అని రోజర్‌ బిన్నీ తెలిపాడు. మార్చి రెండో వారంలో మహిళా లీగ్‌ను నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్లకు సంబంధించిన వేలంను త్వరలోనే బీసీసీఐ నిర్వహించనుంది.

నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు: మిథాలీ రాజ్‌

ఫ్రాంచైజీలపై హక్కుల కోసం దాదాపు రూ. 4,700 కోట్లు వెచ్చించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. రికార్డు బ్రేక్‌ చేసిందని కొందరు సంబరపడుతుంటే.. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ మాత్రం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మేరకు ట్విటర్‌లో పేర్కొంది. ‘‘తొలి మహిళల ప్రీమియర్‌లీగ్‌ నిర్వహణ ప్రారంభంలోనే రికార్డు సాధించడం అద్భుతం. ఇంతకంటే తక్కువేమీ ఆశించలేదు. మహిళా క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం’’ అని మిథాలీ రాజ్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని