T20 League : టీ20 లీగ్‌.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!

 దాదాపు సగం టోర్నీ ముగిసింది.  ఒక్కో జట్టు కనీసం ఏడేసి మ్యాచ్‌లను..

Published : 25 Apr 2022 02:13 IST

సగం టోర్నీ ముగిసేసరికి జట్ల పరిస్థితి ఇలా!

ఇంటర్నెట్ డెస్క్‌:  దాదాపు సగం టోర్నీ ముగిసింది.  ఒక్కో జట్టు కనీసం ఏడేసి మ్యాచ్‌లను ఆడేశాయి. ఇక పాయింట్ల పట్టికలో కొత్త జట్లు టాప్‌-4లో కొనసాగుతున్నాయి. ఛాంపియన్‌ జట్లు కుదేలై అట్టడుగున నిలిచాయి. ఇవేం ఆడతాయిలే అనుకున్న కొన్ని జట్లు అనూహ్యంగా విజయాలతో విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో పది టీమ్‌లు ఎలాంటి ప్రదర్శన చేశాయి.. ఎవరు ముందడుగు వేశారో తెలుసుకుందాం.. 

  1. గుజరాత్‌ (12): టీ20 లీగ్‌లో తొలిసారి హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌ (12)  చెలరేగుతోంది. ఏడు మ్యాచ్‌లకు గాను కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడి ఆరు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.  అదీనూ హైదరాబాద్‌ మీద ఓడిపోయింది. హార్దిక్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతోపాటు షమీ, తెవాతియా, డేవిడ్ మిల్లర్, లాకీ ఫెర్గూసన్‌, రషీద్‌ ఖాన్‌ వంటి ప్లేయర్లు అదరగొట్టేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉండటంతో గుజరాత్‌ను అడ్డుకోవడం ప్రత్యర్థులకు సవాల్‌గా మారింది.
  2. హైదరాబాద్‌ (10): పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టు హైదరాబాద్‌. ఆరంభంలో రెండు మ్యాచ్‌లను ఓడి విమర్శలపాలైన హైదరాబాద్‌ మూడో మ్యాచ్‌ నుంచి తన తడాఖా చూపించింది. హేమాహేమీ జట్లను ఓడించింది. ప్రస్తుతం పాయింట్ల పరంగా టాప్‌లో ఉన్న గుజరాత్‌ను మట్టికరిపించిన జట్టు కూడా హైదరాబాదే కావడం విశేషం. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లను ఆడిన హైదరాబాద్‌ వరుసగా ఐదు విజయాలను నమోదు చేసింది. బెంగళూరును తక్కువ పరుగులకే (68) కుప్పకూల్చి మిగతా జట్లకు హెచ్చరికలు పంపింది. 
  3. రాజస్థాన్‌ (10) : జోస్‌ బట్లర్‌ విజృంభణతోపాటు యుజ్వేంద్ర చాహల్‌ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రాజస్థాన్‌ విజయాల బాటలో నడుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక స్కోరు కూడా రాజస్థాన్‌ పేరు మీదనే ఉంది. దిల్లీపై 222 పరుగులు సాధించింది. అయితే దిల్లీ కూడా దీటుగా బదులిచ్చినా చివరికి రాజస్థాన్‌నే విజయం వరించింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లను ఆడిన రాజస్థాన్‌ (10) ఐదు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. బట్లర్‌ మూడు శతకాలు, చాహల్‌ హ్యాట్రిక్‌ వికెట్ల ప్రదర్శన చేశారు. ఇదే ప్రదర్శన ఆఖరి వరకూ చేస్తే కప్‌ కొట్టే జట్లలో రాజస్థాన్‌కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
  4. లఖ్‌నవూ (10): కేఎల్‌ రాహుల్‌ వ్యక్తిగతంగా రాణిస్తూ లఖ్‌నవూ జట్టును నడిపిస్తున్నాడు. ఆదివారం ముంబయితో జరిగిన మ్యాచులో కేఎల్‌ రాహుల్ శతకం చేశాడు. అయితే జట్టు నిండా ఆల్‌రౌండర్లు ఉన్నప్పటికీ కొన్ని మ్యాచుల్లో గెలుపు వాకిట బోల్తా పడుతోంది. ఎనిమిది మ్యాచులు ఆడిన లఖ్‌నవూ 5 విజయాలు సాధించింది. మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో లఖ్‌నవూ (10) నాలుగో స్థానంలో ఉంది.  ఇక నుంచి జట్టు సమష్ఠిగా రాణించాల్సిన అవసరం ఉంది. 
  5. బెంగళూరు (10): గత నాలుగేళ్లుగా ప్రతి సీజన్‌కు ముందు ఒకటే నినాదం.. ఈసాలా కప్‌ నమదే.. అయితే ఆ జట్టు పరిస్థితిలో మాత్రం మార్పులేదు. కానీ ఈసారి మాత్రం కొత్త కెప్టెన్‌ డుప్లెసిస్‌ నేతృత్వంలోని బెంగళూరు  విజృంభిస్తోంది. ఎనిమిది మ్యాచుల్లో ఐదు విజయాలు, మూడు ఓటములతో టాప్‌-5లో కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్ప (68) స్కోరును నమోదు చేసింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందో లేదోనని మరోసారి అనుమానాలు రేకెత్తిస్తోంది. 
  6. దిల్లీ (6): ఘన విజయాలను నమోదు చేసిన జట్టు.. స్వల్ప తేడాతో ఓటములను కొనితెచ్చుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయిన జట్టు దిల్లీ. మొదటి మ్యాచ్‌లోనే ఛాంపియన్‌ ముంబయిని ఓడించి సంచలనం సృష్టించిన దిల్లీ ఆ తర్వాత తడబాటుకు గురైంది. ప్రస్తుతం ఏడు మ్యాచులకుగాను కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసింది. నాలుగు మ్యాచుల్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటోంది. డేవిడ్ వార్నర్‌, రిషభ్ పంత్‌, పృథ్వీషా, పావెల్ ఫామ్‌లోకి రావడం దిల్లీకి కలిసొస్తుంది. మరి మిగతా మ్యాచుల్లోనైనా రాణించాలని ఆశిద్దాం..
  7.  కోల్‌కతా (6): కొత్త సారథి నేతృత్వంలో భారీ ఆశలతో టోర్నీలో అడుగు పెట్టిన కోల్‌కతా డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నైను చిత్తు చేసి మరీ బోణీ కొట్టింది. ఇక ఆ తర్వాత విజయాల కోసం నానా ఇబ్బందులు పడుతోంది. అడపాదడపా రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా అవి ప్రస్తుత సీజన్‌లో బలహీనంగా ఉన్న ముంబయి, పంజాబ్‌ మీద కావడ విశేషం. ఎనిమిది మ్యాచుల్లో ఐదు ఓటములు, మూడు విజయాలతో కోల్‌కతా (6) పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. 
  8. పంజాబ్‌ (6): పటిష్ఠమైన బెంగళూరునే తొలి మ్యాచ్‌లో మట్టికరిపించి సీజన్‌ను ప్రారంభించిన పంజాబ్ అటు తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయింది. ఫామ్‌లో లేని చెన్నై, ముంబయిపై మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం ఏడు మ్యాచ్‌లను ఆడిన పంజాబ్‌ కేవలం మూడు విజయాలతో ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. నాలుగు ఓటములను చవి చూసింది. మయాంక్‌, శిఖర్ ధావన్‌ , రాజపక్స, లివింగ్‌ స్టోన్‌, షారుఖ్‌ ఖాన్, ఓడియన్‌ స్మిత్ వంటి హార్డ్‌ హిట్టర్లు ఉన్నారు. అయినా ఓడిపోవడంపై జట్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 
  9. చెన్నై (4): ఈ సీజన్‌లో చెన్నై గురించి తక్కువ మాట్లాడుకుంటేనే మంచిదేమో. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై ఏడు మ్యాచుల్లో కేవలం రెండే మ్యాచ్‌లను గెలిచి, ఐదు మ్యాచుల్లో ఓడిపాలవుతుందని ఆ జట్టు అభిమానులు ఊహించి ఉండరు. మెగా వేలంలో దాదాపు పాత ఆటగాళ్లనే తీసుకున్నప్పటికీ.. భారీ స్కోర్లు చేసిన మ్యాచుల్లోనూ డీలాపడటం గమనార్హం. అయితే ఫాస్ట్‌ బౌలింగ్‌పరంగా భారీ మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేసిన దీపక్‌ చాహర్‌ సీజన్‌ మొత్తానికి అందుబాటులో లేకపోవడం మైనస్‌గా చెప్పుకోవాలి. సారథ్య బాధ్యతలు చేపట్టిన జడేజా ఫామ్‌లోకి రాలేదు. అయితే ఎంఎస్ ధోనీ మాత్రం బ్యాట్‌తో చెలరేగడం అద్భుతమనే చెప్పాలి. 
  10. ముంబయి (0): ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకు బోణీ కొట్టని జట్టు ఏదైనా ఉందంటే అది ముంబయి. ఎనిమిది మ్యాచులు ఆడినా ఒక్క విజయమూ నమోదు చేయలేకపోయింది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్‌లో మాత్రం తేలిపోతోంది. ఆదివారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఇక ప్లేఆఫ్స్‌ అవకాశాల సంగతి పక్కన పెడితే కనీసం ఒక్క విజయం సాధించైనా టోర్నీని ముగించాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. రోహిత్ శర్మ సారథిగానూ, వ్యక్తిగతంగానూ రాణించలేకపోతున్నాడు. ఇక మిగిలిన మ్యాచుల్లో ఎలాంటి ఫలితాలను చవిచూస్తుందో వేచి చూడాల్సిందే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని