Pregnant Women: చికిత్సలో ప్రమాణాలు ముఖ్యం

కరోనా పరిస్థితుల నేపథ్యంలో గర్భిణులకు వైద్య పరీక్షలు, చికిత్సలు చేసేందుకు, ప్రసవాల సమయంలో తగిన ప్రమాణాలను పాటించాలని... అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ ఆదేశాలు జారీచేశారు. పీపీఈ కిట్‌, ఫేస్‌ మాస్కు, ఫేస్‌ షీల్డ్‌ ధరించి చికిత్స అందించాలని అధికారులు, వైద్యులు, ఇతర సిబ్బందికి సూచించారు

Updated : 02 May 2021 07:47 IST

కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వైద్య పరీక్షలు, ప్రసవాలు
పీపీఈ, ర్యాట్‌ కిట్లు అందుబాటులో ఉంచుకోండి
సిబ్బందికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల నేపథ్యంలో గర్భిణులకు వైద్య పరీక్షలు, చికిత్సలు చేసేందుకు, ప్రసవాల సమయంలో తగిన ప్రమాణాలను పాటించాలని... అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ ఆదేశాలు జారీచేశారు. పీపీఈ కిట్‌, ఫేస్‌ మాస్కు, ఫేస్‌ షీల్డ్‌ ధరించి చికిత్స అందించాలని అధికారులు, వైద్యులు, ఇతర సిబ్బందికి సూచించారు. ఈమేరకు ఎయిమ్స్‌, భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తదితర సంస్థలు కలిసి రూపొందించిన ప్రమాణాలపై చర్చించి తాజాగా మార్గదర్శకాలు జారీచేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు (డీఎంహెచ్‌వో), ఆసుపత్రుల సూపరింటెండెంట్లు బాధ్యత తీసుకొని వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలని, గర్భస్థ శిశు, ప్రసవం, ప్రసవం తర్వాత అనే మూడు దశల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మార్గదర్శకాల్లో కీలకమైనవి..

* గర్భస్థ శిశు దశలో చెకప్‌నకు రెండు రోజుల ముందు ఏబీఎం, ఆశా కార్యకర్త గర్భిణిని కలిసి ఎంసీపీ కార్డులో వివరాలు నింపాలి. ఆరోగ్య ఉప కేంద్రానికి వచ్చి పరీక్షించుకునేలా చూడాలి. వారు మిగిలిన రోగుల్లో కలవకుండా, ఎక్కువ సమయం వేచి ఉండకుండా టోకెన్లు ఇచ్చి సమయానికి వైద్య పరీక్షలు చేయించాలి. భౌతికదూరం పాటించేలా ఉపకేంద్రంలో కుర్చీలు ఏర్పాటుచేయాలి. వైద్యాధికారులు అన్ని మందుల్ని, అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలి.
 

* ప్రసవానికి 5-7 రోజుల ముందు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు (ర్యాట్‌) చేయాలి. నెగెటివ్‌, అనుమానాస్పద, పాజిటివ్‌గా గర్భిణులను విభజించి వారికి వైద్య పరీక్షలు జరపాలి. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉంటే అవసరమైతే ఫిజీషియన్‌ అభిప్రాయాన్ని తీసుకొని ఆరోగ్య కేంద్రం, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో ప్రసవం చేయాలి. ఓ మోతాదు లక్షణాలుంటే గాంధీ ఆసుపత్రికి తరలించాలి. తీవ్రంగా ఉంటే ప్రత్యేకంగా కేటాయించిన 108 అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించాలి. ప్రసూతి కేసులను పర్యవేక్షించేందుకు వరంగల్‌ ఎంజీఎం, నిలోఫర్‌, హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌, హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో ఫోన్‌ ద్వారా సేవలు అందించేందుకు ఒక ఫిజీషియన్‌ను ప్రత్యేకంగా ఉంచాలి.
 

* తల్లి పాలలో కరోనా వైరస్‌ ఉంటున్నట్లు  వెల్లడికాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలిచ్చే సమయంలో శిశువులకు సోకకుండా కరోనా ఉన్న తల్లులు శిశువులకు పాలు ఇచ్చే సమయంలో మాస్కు ధరించాలి. దగ్గడం, తుమ్మడం చేయరాదు. శిశువును పట్టుకునే ముందు, తర్వాత తల్లులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని