
Justice NV Ramana: ప్రభుత్వాలే అతిపెద్ద కక్షిదార్లు
కార్యనిర్వాహక వ్యవస్థ సక్రమంగా పని చేస్తే జనం కోర్టులకు రావాల్సిన అవసరమే ఉండదు
చట్టాలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలి
జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు తక్షణావసరం
సీఎంలు-హైకోర్టు సీజేల సదస్సులో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యలు
ప్రభుత్వాలు చట్టాలకు కట్టుబడి వ్యవహరిస్తే న్యాయవ్యవస్థ ఎప్పుడూ వాటికి అడ్డురాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో 50% ప్రభుత్వాలకు సంబంధించినవేనని, అతిపెద్ద కక్షిదార్లు ప్రభుత్వాలేనని వెల్లడించారు.
దేశంలో కోర్టు కేసుల విస్ఫోటానికి దారితీస్తున్న కొన్ని కారణాలను చెప్పదలచుకున్నా. భూసర్వే, రేషన్ కార్డులాంటి అంశాల్లో వచ్చిన విజ్ఞప్తులపై తహసీల్దార్లు వెంటనే స్పందిస్తే కోర్టులకు వెళ్లే ఆలోచన ప్రజల మనసుల్లోకే రాదు. మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులు తమ విధులను సరిగా నిర్వర్తిస్తే ప్రజలు న్యాయస్థానాల వైపు చూడాల్సిన అవసరమే ఉండదు. రెవెన్యూ అధికారులు నిబంధనలను అనుసరించి భూసేకరణ చేపడితే కోర్టులపై భూవివాదాల కేసుల భారం పెరిగి ఉండేదే కాదు. పోలీసు దర్యాప్తులు నిజాయతీగా సాగితే అక్రమ అరెస్టులు, చిత్రహింసలు ఉండవు. బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరమే రాదు. సీనియారిటీ, పింఛను లాంటి విషయాల్లో నిబంధనల్ని సక్రమంగా అమలుచేస్తే ఏ ఉద్యోగీ కోర్టును ఆశ్రయించాల్సిన అగత్యం ఉండదు.
కార్యనిర్వాహక వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా నిర్ణయాధికార భారాన్ని న్యాయవ్యవస్థకు బదిలీచేస్తున్నందున దాన్నికూడా కోర్టులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విధాన రూపకల్పన మా పరిధిలోని అంశంకానప్పటికీ వివాదాలను పరిష్కరించమని ప్రార్థిస్తూ ప్రజలు ఆశ్రయిస్తే కోర్టులు కాదనలేవు.
- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
ఈనాడు, దిల్లీ: రాజ్య వ్యవస్థలో మూడు కీలక విభాగాలైన....శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ విధుల నిర్వహణలో ‘లక్ష్మణ రేఖ’లను దృష్టిలో ఉంచుకునే పనిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పిలుపునిచ్చారు. కోర్టుల్లో ఉన్న కేసుల్లో 50% ప్రభుత్వాలకు సంబంధించినవేనని, అతిపెద్ద కక్షిదారులు ప్రభుత్వాలేనని అన్నారు. దిల్లీలోని విజ్ఞాన్భవన్లో శనివారం నిర్వహించిన ముఖ్యమంత్రులు-హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 11వ సదస్సును ఉద్దేశించి జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడారు. చట్టసభలు బిల్లులపై పూర్తిస్థాయిలో చర్చించి, ప్రజాకాంక్షలకు అనుగుణంగా చట్టాలుచేస్తే వివాదాలకు తావుండదని, ప్రజలు కోర్టులకు రావాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. కోర్టుల్లో అపరిష్కృత కేసులు పెరిగిపోవడానికి తరచూ న్యాయవ్యవస్థను నిందిస్తున్నారని, కానీ అందుకు విభిన్నమైన కారణాలున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం దేశంలో ప్రతి 10 లక్షల మందికి 20 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని, ఇది అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ఆయన పలు సమకాలీన అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయకక్షలు తీర్చుకోవడానికి పిల్స్!
‘న్యాయస్థానాల్లో పనికిమాలిన కేసులు పెరిగిపోవడం ఆందోళనకర అంశం. సదుద్దేశంతో కూడిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యంగా మారిపోతోంది. ఇప్పటివరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విస్తృత ప్రజా ప్రయోజనాలకు మేలు చేశాయనడంలో సందేహంలేదు. కానీ, కొన్నిసార్లు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి, ప్రభుత్వాధికారులపై ఒత్తిడి తేవడానికి దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ, కార్పొరేట్ కక్షలు తీర్చుకోవాలనుకున్న వారికి ఈ రోజుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఒక సాధనంగా మారాయి. అ దుర్వినియోగాన్ని గుర్తించి కోర్టులు ఇలాంటి కేసుల స్వీకరణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి’ అని జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు.
న్యాయవ్యవస్థ భారతీయీకరణ
‘ఆత్మపరిశీలన చేసుకొని న్యాయవ్యవస్థలోని సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి ఈ సదస్సు ఒక వేదిక. న్యాయమందించే వ్యవస్థను భారతీయీకరించాలని బలంగా కోరుకునేవారిలో నేనూ ఒకడిని. భారతీయీకరణ ద్వారానే ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టు వ్యవస్థను తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుంది. అందరినీ కలుపుకొనిపోవటం, అందరికీ న్యాయం అందించడం, భాషాపరమైన అడ్డంకులు తొలగించడం, నియమ, నిబంధనలను సంస్కరించడం, మౌలికవసతులను అభివృద్ధిచేయడం, ఖాళీలను భర్తీ చేయడం, న్యాయవ్యవస్థ బలాన్ని మరింత పెంచడం లాంటి బహుముఖ కోణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి’.
వసతుల కల్పనపై దృష్టి సారించాలి
‘ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తుండడం, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో కోర్టులపై కేసుల భారం కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ప్రజావసరాలు, ప్రస్తుత మౌలికవసతుల మధ్య తీవ్రమైన అంతరం ఉంది. కోర్టు గదుల్లోకి మహిళా న్యాయవాదులు ప్రవేశించడానికి, మహిళా కక్షిదారులను ఒంటరిగా వదిలిపెట్టడానికి జంకే వాతావరణం కొన్ని జిల్లా కోర్టుల్లో ఉంది. కోర్టులంటే న్యాయాలయాలు కాబట్టి వాటికి అవసరమైన గౌరవం, సౌరభం కల్పించాలి. న్యాయమౌలికవసతులను మెరుగుపరిచి ప్రామాణీకరించడానికి జాతీయ, రాష్ట్రాల స్థాయిల్లో జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీలను ఏర్పాటు చేయడంపై నేను తొలి నుంచీ దృష్టి సారించా. ఇది నిధులకు సంబంధించిన అంశం కాదు. మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా హేతుబద్థమైన రీతిలో నిధులు కేటాయిస్తూనే వస్తోంది. 1993-94లో ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి జరిపిన కేటాయింపులు నిబంధనాపరమైన ఇబ్బందుల కారణంగా ఆశించిన స్థాయిలో ఖర్చు కాలేదు. అందువల్ల ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కమిటీల విధానం నుంచి బయటపడి సంస్థాగతమైన, బాధ్యతాయుతమైన శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. నేను చేసిన ప్రతిపాదనలపై కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అపోహలను తొలగించాలనుకుంటున్నా. ఈ ప్రతిపాదిత ప్రాధికార సంస్థలేవీ ప్రభుత్వ అధికారాలను చేజిక్కించుకోవడానికి ఉద్దేశించినవి కావు. అందులో అన్ని వ్యవస్థలకు చెందిన ప్రతినిధులు భాగస్వాములుగా ఉంటారు. అయితే స్వీయ అవసరాల గురించి మిగతా అందరి కంటే న్యాయవ్యవస్థకే ఎక్కువ అవగాహన ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. మౌలిక వసతుల అభివృద్ధి కోసం సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక ప్రయోజన వాహకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులకూ భాగస్వామ్యం ఉంటుంది.’
ఖాళీల భర్తీ...పోస్టుల సంఖ్య పెంపు..
‘ప్రజలకు వేగంగా న్యాయం అందించాలంటే న్యాయవ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీచేయడంతో పాటు, ఇప్పుడున్న పోస్టుల సంఖ్యనూ పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైకోర్టులకు మంజూరుచేసిన 1104 న్యాయమూర్తుల పోస్టుల్లో 388 ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచీ శ్రమిస్తున్నాను. గత ఏడాది కాలంలో వివిధ హైకోర్టుల్లో పోస్టుల భర్తీ కోసం మేం 180 సిఫార్సులు చేశాం. అందులో 126 నియామకాలు జరిగాయి. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నా. ఇంకా 50 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టులు మరో 100 సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. అవి ఇంతవరకూ మాకు చేరలేదు. జిల్లా న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేస్తున్న ప్రయత్నాలకు ముఖ్యమంత్రులు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుతున్నా. 2016లో మనం చివరిసారిగా కలుసుకున్నప్పుడు దేశంలో న్యాయాధికారుల పోస్టుల సంఖ్య 20,811 ఉంటే ఇప్పుడు అది 24,112కి చేరింది. ఆరేళ్లలో 16% పోస్టులు పెరిగాయి. ఇదే సమయంలో జిల్లా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 2.65 కోట్ల నుంచి 4.11 కోట్లకు చేరింది. ఇందులో 54.64% వృద్ధి నమోదైంది. దీన్నిబట్టి కేసులకు తగ్గట్టు న్యాయాధికారుల పోస్టులు పెరగలేదన్న విషయం అర్థమవుతుంది. పునాది గట్టిగా ఉంటేనే నిర్మాణం సుస్థిరంగా ఉండటం సాధ్యమవుతుంది. అందువల్ల విశాల హృదయంతో మరిన్ని పోస్టులు మంజూరు చేసి, వాటిని భర్తీచేయాలి. అప్పుడే న్యాయమూర్తులు-జనాభా నిష్పత్తి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడున్న పోస్టుల ప్రకారం దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 20 మంది న్యాయమూర్తులున్నారు. ఇది అత్యంత ఆందోళనకరమ’ని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.
పరిపాలించాల్సింది చట్టాలే..
వ్యవస్థలో ప్రతికూలంగా ఉన్నది న్యాయ ప్రక్రియ తప్పితే న్యాయమూర్తులు, తీర్పులు కాదన్నది గుర్తుంచుకోవాలని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. న్యాయమూర్తులు విధులను మాత్రమే నిర్వర్తిస్తున్నారని, తీర్పులను.. న్యాయం అందించేందుకు వెలువరించిన ఉత్తర్వులుగానే చూడాలని సూచించారు. ‘అరిస్టాటిల్ చెప్పినట్లు చట్టాలే పరిపాలించాలి. అధికారంలో ఉన్నవారు ఆ చట్టాలకు సేవకులుగా ఉండాలి’ అని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయ అవగాహన పెంచి, ప్రజలకు దాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తున్నందుకు ప్రధానమంత్రి మోదీకి జస్టిస్ ఎన్.వి.రమణ కృతజ్ఞతలు తెలిపారు.
హైకోర్టుల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమివ్వాలి
న్యాయవ్యవస్థలో అందరికీ అవకాశం కల్పించడం అత్యంత ముఖ్యం. న్యాయ వ్యవస్థ కానీ, ప్రజాస్వామ్యంలోని మిగతా వ్యవస్థలు కానీ దేశ సామాజిక, భౌగోళిక వైవిధ్యానికి అద్దం పట్టేలా ఉండాలి. హైకోర్టు కార్యకలాపాల్లో భారతీయ భాషలను ప్రవేశపెట్టాలని కోరుతూ నాకు ఎన్నో విజ్ఞాపనలు వస్తున్నాయి. ఆ డిమాండ్ను పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. కోర్టుల ముందు వాదనలు వినిపించడం అన్నది తెలివితేటలు, చట్టాలను అర్థం చేసుకొనే శక్తిపై ఆధారపడి ఉండాలి తప్పితే కేవలం భాషాప్రావీణ్యంపై ఉండకూడదు.
అమలుకు నోచుకోని కోర్టు తీర్పులు
జస్టిస్ ఎన్.వి.రమణ
చట్టం, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయడమే సుపరిపాలనకు కీలకం. అయితే తరచూ ఇవి విస్మరణకు గురవుతున్నాయి. కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలుచేసే తొందరలో న్యాయవిభాగం సలహాలు తీసుకోవడంలేదు. ప్రత్యేక ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్ కౌన్సిళ్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. దాన్ని తక్షణం పరిష్కరించాలి. కోర్టు తీర్పులను ప్రభుత్వాలు ఏళ్ల తరబడి అమలు చేయడంలేదు. ఫలితంగా ఇప్పుడు కొత్తగా కోర్టు ధిక్కరణ కేసులు కూడా న్యాయస్థానాలకు భారంగా మారుతున్నాయి. న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా నిష్క్రియాపరత్వంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి మంచిది కాదు.
చట్టాల రూపకల్పనలో ప్రజాభిప్రాయానికి చోటేది?
జస్టిస్ ఎన్.వి.రమణ
చట్టాల్లో ఉన్న సందిగ్ధతలు ఇప్పటికే ఉన్న సమస్యలకు జత కలుస్తున్నాయి. చట్టసభలు స్పష్టమైన ఆలోచన, ముందుచూపు, ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చట్టాలు చేస్తే వివాదాలు రేకెత్తే అవకాశాలు తగ్గిపోతాయి. చట్టాలను ఆమోదించడానికి ముందే ప్రజాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని చట్టసభలు బిల్లులపై క్లాజుల వారీగా క్షుణ్ణంగా చర్చిస్తాయని అనుకుంటాం. పెద్దగా పరిశీలన లేకుండానే చట్టసభల్లో బిల్లులు పాస్చేయడం గురించి గత ఏడాది ఆగస్టు 15వ తేదీన నేను వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు. అయితే ఆ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరంలేదు. చట్టసభలు, ప్రజాప్రతినిధులపై నాకు అత్యంత గౌరవం ఉంది. నేను కేవలం కొన్ని లోపాలను మాత్రమే ప్రస్తావించాను. ఆసక్తికరంగా నా అభిప్రాయాలతో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఏకీభవిస్తూ కొన్ని వారాల క్రితం మాట్లాడారు. పూర్తిస్థాయిలో చర్చించి, అన్నివర్గాల ప్రజల అవసరాలు, ఆకాంక్షలను చేర్చిన తర్వాతే చట్టాలను ఆమోదించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten news @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Telangana News: టీచర్ల ఆస్తులపై విద్యాశాఖ ఉత్తర్వులు రద్దు చేసిన ప్రభుత్వం
-
Crime News
Crime News: ఇద్దరిని మింగిసేసిన సెల్లార్ గుంత... మృతులు శ్రీకాకుళం జిల్లా వాసులు
-
Politics News
Maharashtra crisis: తేలని ‘మహా’ ఉత్కంఠ.. టాప్-10 అప్డేట్స్
-
Politics News
Andhra News: ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించొద్దు: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Movies News
Prithviraj Sukumaran: ‘సలార్’లో రెండేళ్ల కిందటే అవకాశం వచ్చింది.. కానీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Super Tax: పాక్లో ‘సూపర్’ పన్ను!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు