త్వరలో దేశంలో సంచలనం
‘వ్యాపారులు కలిసినప్పుడు వ్యాపారం గురించే మాట్లాడుకుంటారు.. రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలే మాట్లాడుకుంటారు.. త్వరలో దేశంలో సంచలనం జరగాలి.. జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్
దిల్లీలో పాఠశాల, మొహల్లా క్లినిక్ల పరిశీలన
అక్కడి విద్యావిధానం బాగుందని ప్రశంస
తెలంగాణ నుంచి తామూ నేర్చుకుంటామన్న కేజ్రీవాల్
ముఖ్యమంత్రిని కలిసిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్
ఈనాడు, దిల్లీ: ‘వ్యాపారులు కలిసినప్పుడు వ్యాపారం గురించే మాట్లాడుకుంటారు.. రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలే మాట్లాడుకుంటారు.. త్వరలో దేశంలో సంచలనం జరగాలి.. జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. దిల్లీలో సర్వోదయ పాఠశాల సందర్శన అనంతరం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుమందు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్.. కేసీఆర్ను ఆయన నివాసానికి వచ్చి కలిశారు. ఇదే విషయమై విలేకరులు ప్రస్తావించగా, కేసీఆర్ పై విధంగా స్పందించారు. మన దేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉందని... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కలుపుకొని వెళ్లకపోతే ఇబ్బందులు తప్పవని సీఎం వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరిన కేసీఆర్ శనివారం దిల్లీలో బస చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో దక్షిణ మోతీబాగ్లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అప్పటికే పాఠశాలలో వేచి ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు కేసీఆర్ను సాదరంగా స్వాగతించారు. పాఠశాల గదులు, వసతులను పరిశీలించిన కేసీఆర్.. విద్యాబోధన, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యావిధానాన్ని మెరుగుపర్చిన తీరును సిసోడియా, ఎమ్మెల్యే అతీశి మార్లేనాలు పవర్ పాయింట్ ద్వారా ఆయనకు వివరించారు. దిల్లీ పాఠశాలల్లో స్టారప్స్ను ప్రోత్సహించేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన బిజినెస్ బ్లాస్టర్స్లో పాలుపంచుకున్న విద్యార్థులతో కేసీఆర్ ముచ్చటించారు.
దిల్లీ విద్యావిధానంపై అధ్యయనం
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ దిల్లీలో విద్యావ్యవస్థ బాగుందని, దేశంలో మరెక్కడా ఇలాంటి విద్యావిధానం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఈ విధానం రావాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను ఉద్యోగాలు సృష్టించేవారిగా మార్చే విధానం బాగుందని కొనియడారు. కేంద్రం నూతన విద్యావిధానం తీసుకొస్తున్న సంగతి ప్రస్తావించగా, అందరినీ కలుపుకొని వెళ్తే ఆ విధానం పనికివస్తుందని, లేకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. దిల్లీ విద్యావిధానాన్ని కాపీ కొట్టబోమని.. తమ రాష్ట్ర ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాల నేతలను ఇక్కడికి పంపి అధ్యయనం చేయిస్తామని ఓ ప్రశ్నకు కేసీఆర్ బదులిచ్చారు. ‘దిల్లీ ప్రభుత్వం సిబ్బందిని విదేశాలకు పంపి విద్యా ప్రమాణాలు తయారు చేసింది. అందుకు వారు చాలా మొత్తం ఖర్చుపెట్టారు. మేం మా సిబ్బందిని దేశ రాజధానికి పంపించి తక్కువ వ్యయంతోనే జ్ఞానం సంపాదించుకుంటాం’ అని ఆయన అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడి పాఠశాల చూడడానికి రావడం తమకు గౌరవంగా ఉందన్నారు. విద్యావిధానంపై ఎన్నో ప్రశ్నలు అడిగారని, విద్యాశాఖపై ఆయనకు చాలా ఆసక్తి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తోందని.. వాటిని తాము తెలుసుకుంటామన్నారు. ఇలా ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడం వల్ల దేశానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇక్కడి క్లినిక్లను చూసే బస్తీ దవాఖానాలు: కేసీఆర్
అనంతరం కేసీఆర్ మహ్మద్పురలోని మొహల్లా క్లినిక్ను సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆ క్లినిక్లకు వచ్చే రోగులకు ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ అవసరమైతే ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా పరీక్షలు చేయిస్తున్నామని కేజ్రీవాల్ కేసీఆర్కు వివరించారు. మొత్తం వెయ్యి మొహల్లా క్లినిక్లు, 120 పాలి క్లినిక్లు, 35 సూపర్ స్పెషలైజ్డ్ క్లినిక్ల ఏర్పాటు తమ లక్ష్యమని కేజ్రీవాల్ వివరించారు. వీటికి ఔషధాలు ఎలా కొంటారని దిల్లీ ఆరోగ్య శాఖమంత్రి సత్యేంద్రజైన్ను కేసీఆర్ అడిగారు. కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయడంతో వ్యయం తగ్గుతోందని ఆయన బదులిచ్చారు. దిల్లీలోని మొహల్లా క్లినిక్లను చూసే.. హైదరాబాద్లో తాము బస్తీ దవాఖానాలు తెరిచామని కేసీఆర్ తెలిపారు. తమ దగ్గర దవాఖానాల్లో వేతనాల ప్రాతిపదికన వైద్యులను నియమిస్తున్నామని మంత్రి ప్రశాంత్రెడ్డి తెలిపారు. మీరు ఏ విధానం పాటిస్తున్నారని సత్యేంద్ర జైన్ను అడగగా తాము ఒక్కో రోగిని పరీక్షించినందుకు రూ.40 చొప్పున వైద్యులకు ఇస్తున్నామని జైన్ సమాధానమిచ్చారు. దిల్లీలోనూ, హైదరాబాద్లోనూ ఈ క్లినిక్ల ద్వారా మంచి సేవలు అందుతున్నాయని కేసీఆర్ అన్నారు. విద్యా, వైద్య రంగాల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం వినూత్నంగా పనిచేస్తూ పేదలకు అండగా నిలిచిందని ప్రశంసించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ సందర్శనలో ఆయన వెంట తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, బొర్లకుంట వెంకటేష్ నేత, జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఉన్నారు.
అఖిలేశ్తో చర్చలు
ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం 23, తుగ్లక్ రోడ్కు మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చిన అఖిలేశ్ 3.10 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆయనకు కేసీఆర్ స్వాగతం పలికి ఇంటి లోపలికి తీసుకెళ్లారు. వారిద్దరి చర్చల్లో మిగిలిన తెరాస నాయకులూ పాల్గొన్నారు. అంతా కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలపై వారి మధ్య చర్చ సాగింది. విపరీతమైన దౌర్జన్యం, ధన ప్రవాహం, కుల, మతపరమైన విభేదాలతో భాజపా విజయం సాధించిందని అఖిలేశ్ కేసీఆర్కు వివరించారు. విపక్ష పాలిత రాష్ట్రాలు, విపక్ష నేతల విషయంలో కేంద్రం తీరుపై వారు చర్చించారు. సీఎం కేసీఆర్ దిల్లీ పాఠశాల సందర్శన ముగించుకుని తన నివాసానికి చేరుకున్నాక.. ఎన్డీటీవీ కో ఛైర్పర్సన్లు ప్రణయ్రాయ్, రాధికారాయ్ వచ్చి ఆయనతో భేటీ అయ్యారు.
నేడు కేజ్రీవాల్ ఇంట భోజనం.. అనంతరం చండీగఢ్కు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు, వారి బృందాలతో కలిసి చండీగఢ్ వెళ్లనున్నారు. అక్కడ రైతు ఉద్యమ సమయంలో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిహారపు చెక్కులను అందించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.