ఫిబ్రవరిలోనే ముగింపు ఇదే తొలిసారి

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఫిబ్రవరి రెండోవారంలోనే బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నెల 12తో వాటిని ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 05 Feb 2023 04:27 IST

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలపై రాజకీయవర్గాల్లో చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఫిబ్రవరి రెండోవారంలోనే బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నెల 12తో వాటిని ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6న ఉభయసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా..తర్వాత ఆరు రోజుల్లోనే సమావేశాలు ముగియనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓటాన్‌అకౌంట్‌ మినహా ఇతర సందర్భాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలు మార్చి నెలలోనే జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావం దృష్ట్యా 2014లో నవంబరు అయిదో తేదీన బడ్జెట్‌ సమావేశం జరిగింది. 2018 డిసెంబరులో శాసనసభ ఎన్నికలు జరగగా... మరుసటి ఏడాది సెప్టెంబరు 9న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు మార్చిలో ఉంటాయని అంతా భావించినా.. కేసీఆర్‌ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 3న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్‌ ఆమోదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై బడ్జెట్‌ అమల్లోకి వస్తుంది. అందుకే అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్‌ ఆమోద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా.. ఈసారి ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ ముగుస్తోంది. బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక 47 రోజుల పాటు పాత బడ్జెట్‌ అమల్లోనే ఉంటుంది. ఇంత త్వరగా బడ్జెట్‌ సమావేశాల ముగింపుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

దేని కోసం?

సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి విస్తరించడానికి భారాసను ఏర్పాటు చేసి కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో భారాస ఆవిర్భావసభ జరగగా.. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో సభను నిర్వహించనున్నారు. తర్వాత ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లో సభలున్నాయి. పార్టీ రాష్ట్రశాఖల ఏర్పాటుతో పాటు రాష్ట్రాలవారీగా బహిరంగసభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను పెద్దఎత్తున ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారు. ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ప్రారంభించి, అదే రోజు పరేడ్‌ మైదానంలో భారీ సభను నిర్వహించనున్నారు. దీని కోసం జనసమీకరణ, కార్యక్రమానికి సీఎంలు, మాజీ సీఎంల ఆహ్వానం, బస ఇతర ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారు. తర్వాత అమరవీరుల స్మారక స్తూపం ప్రారంభించనున్నారు. ఈ నెల చివరి వారంలో బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు 18 జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవం జరిగింది. మరో ఎనిమిది ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పార్టీ జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే శాసనసభ సమావేశాలను త్వరగా ముగిస్తున్నారని భారాస పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని విపక్షాలు మాత్రం బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరిలో జరపడాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయి. ముందస్తు ఎన్నికల కోసమే ఫిబ్రవరిలోనే ముగిస్తున్నారని విమర్శిస్తున్నాయి. తమ పార్టీ శ్రేణులకు ఇదే సందేశాన్ని ఇస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని