పల్లె గళం.. పార్లమెంటులో!

నలుగురిలో మాట్లాడాలంటేనే చాలా మందికి బిడియం. అలాంటిది డిగ్రీ అమ్మాయి.. దేశ పార్లమెంట్‌లో ప్రసంగించడమంటే మాటలా! మిద్దె రూప ఆ అవకాశాన్ని దక్కించుకుంది.

Published : 04 Oct 2022 00:59 IST

నలుగురిలో మాట్లాడాలంటేనే చాలా మందికి బిడియం. అలాంటిది డిగ్రీ అమ్మాయి.. దేశ పార్లమెంట్‌లో ప్రసంగించడమంటే మాటలా! మిద్దె రూప ఆ అవకాశాన్ని దక్కించుకుంది. ఆ అవకాశం ఎలా వచ్చింది.. అక్కడేం మాట్లాడిందన్న అంశాల్ని వసుంధరతో పంచుకుందిలా.. 

నేను ఎనిమిదో తరగతిలో ఉండగా.. ‘అమ్మాయిలైతేనేం.. వాళ్లూ బాగా చదువుకుని పేరు తెస్తారు’ అని బంధువులతో నాన్న చెప్పడం విన్నా. అప్పటివరకూ నాకెలాంటి లక్ష్యాల్లేవ్‌. నాన్న మాటలు విన్నాక నాలో మార్పు వచ్చింది. మాది వైఎస్సార్‌ కడప జిల్లా టి.కోడూరు. నాన్న సత్యనారాయణ, అమ్మ రమాదేవి. రైతు కుటుంబం. కారు డ్రైవర్‌గానూ చేస్తారు నాన్న. నాకో చెల్లి.. అపర్ణ. మా ఊరికి బస్సు కూడా రాదు. అయిదో తరగతి వరకూ తాడిపత్రిలోని ప్రైవేటు స్కూల్లో, ఆరో తరగతిలో నవోదయ స్కూల్‌కి ఎంపికై హిందూపురంలో చదివా. అప్పుడే ఇంగ్లిష్‌ మీడియానికి మారడంతో చదువు భారంగా అనిపించేది. ముభావంగా ఉండేదాన్ని. నాన్న మాటలు విన్నప్పట్నుంచీ నన్ను నేను మార్చుకోవాలనున్నా. వక్తృత్వ పోటీలూ, పాటలు, చిత్రలేఖనం.. అన్నింటిలోనూ భాగమయ్యేదాన్ని. ఇంటర్‌.. కర్ణాటకలోని తుముకూరు, సిద్ధగంగ ఆశ్రమ కాలేజీలో చదివా. అక్కడే సమాజసేవపై అవగాహన ఏర్పడింది. కడప మహిళా కాలేజీలో బీఏ చదువుతూ ‘స్ప్రెడింగ్‌ స్మైల్స్‌ టు ది సొసైటీ’ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల్లో భాగమవుతూ వచ్చా. డిగ్రీ ఫస్టియర్లో నెహ్రూ యువ కేంద్రం వక్తృతృ పోటీల్లో జిల్లాలో ఫస్ట్‌ వచ్చా. సెకెండియర్‌లోనూ పాల్గొన్నా, కరోనా కారణంగా అవి ముందుకు వెళ్లలేదు. అప్పుడు యునిసెఫ్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ సదస్సులోనూ ప్రసంగించా. మూడో ఏడాదిలో నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నా. జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో వేర్వేరు అంశాలపైన మాట్లాడించారు. పలు స్క్రీనింగ్‌ టెస్టుల్లో పాసై రాష్ట్ర స్థాయి విజేతగా నిలవడంతో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ప్రసంగించే అవకాశం వచ్చింది. ‘స్వతంత్ర సమరయోధులకు నివాళి’ అంశం.. నేను గాంధీజీ ఆలోచనలు నేటి సమాజానికి ఎందుకు అవసరమో వివరిస్తూ మాట్లాడా. ‘మార్పు రావాలి. అది మన నుంచి మొదలవ్వాలి’ అంటూ నా ఆలోచనల్ని పంచుకున్నా. గ్రామీణ, మహిళాభివృద్ధి గురించి ప్రత్యేకించి చెప్పా. స్పీకర్‌ ఓం బిర్లా, చాలా మంది ఎంపీలూ, అధికారులూ శ్రోతల్లో ఉన్నారు. కలాం, ఇందిరాగాంధీ నాకు ఆదర్శం. లక్ష్యం పెట్టుకోవాలే కానీ సాధించడం కష్టమేమీ కాదన్నది నా ఉద్దేశం. హైదరాబాద్‌లో సివిల్స్‌కు సిద్ధమవుతున్నా. నా చదువుకి మా గ్రామానికి చెందిన జానకిరామయ్యశర్మ, హర్షవర్ధనశర్మ ఆర్థిక చేయూతనిస్తునారు. ప్రభుత్వాధికారిగా సమాజానికి సేవ చేయాలనేది నా లక్ష్యం.

  - బోగెం శ్రీనివాసులు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్