Updated : 07/03/2023 00:25 IST

ఆ టోల్‌ప్లాజాలో అందరూ మహిళలే..

టోల్‌ ప్లాజా దగ్గర కార్ల రద్దీ ఎంతగా ఉంటుందో తెలుసుగా! అక్కడ పని చేసేవారు ఏమాత్రం వేగం తగ్గించినా వాహనాల క్యూ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. అలాంటి చోట్ల అమ్మాయిలు పనిచేయడం ఎప్పుడైనా చూశారా? తిరుపతి జిల్లాలోని గాదంకి టోల్‌ప్లాజాకి వెళ్తే ఇటువంటి దృశ్యమే కనిపిస్తుంది..

పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై సి.మల్లవరం నుంచి కుక్కలపల్లి వరకు నిర్మించిన ఆరు వరసల రహదారికి గాదంకి సమీపంలో టోల్‌ప్లాజాను ఏర్పాటు చేశారు. ఇక్కడ 10 కౌంటర్లు ఉంటాయి. వీటిలో 11 మంది మహిళలు టోల్‌ వసూలు చేస్తుండగా వారిలో ఎవరికైనా ఇబ్బంది కలిగినపుడు ఆ స్థానంలో విధులు నిర్వహించేందుకు మరో ముగ్గురు అందుబాటులో ఉంటున్నారు. పాకాల, చంద్రగిరి మండలాలకు చెందిన 11 మంది మహిళలు ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు. వాహనాలకు ఏర్పాటు చేసిన ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేసి శరవేగంగా టోల్‌ వసూలు చేయడంలో ఈ మహిళలు ముందుంటున్నారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కౌంటర్లలో విధులు నిర్వహిస్తూ ఆ తరువాత ఇళ్లకు వెళుతున్నారు. పట్టపగలు కూడా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ వచ్చే డ్రైవర్లతో గొడవలు జరుగుతున్నా కౌంటర్లలోని మహిళలు ఏ మాత్రం తగ్గకుండా ఎంతటి వారైనా సరే టోల్‌ కట్టిన తరువాతే వాహనాన్ని ముందుకు పంపుతున్నారు. ‘మొదట్లో భయపడినా ఆ తర్వాత ధైర్యం వచ్చింది. అప్పగించిన విధులు సక్రమంగా నిర్వహిస్తే ఎందుకు భయపడాలన్న ఆత్మస్థైర్యం నింపుకొన్నా’ అంటోంది రవణప్పగారిపల్లెకు చెందిన లిఖిత. ‘అందరినీ గౌరవించి టోల్‌ వసూలు చేయడమే మా పని. కొంత మంది టోల్‌ కట్టకుండా గొడవకు దిగుతుంటారు. అలాంటప్పుడు భయపడితే అందరూ అలాగే జారుకుంటారు. అందుకే కఠినంగా ఉంటూ  వసూలు చేస్తాం’ అంటోంది పాకాలకి చెందిన సమియా!

 - ఆచారి జానకీరామాచారి, చంద్రగిరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి