Donald Trump: ‘ఆమెకు రూ. 692 కోట్లు చెల్లించాల్సిందే’.. ట్రంప్‌నకు భారీ జరిమానా

Donald Trump: పరువు నష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ జరిమానా పడింది. రచయిత్రి జీన్‌ కరోల్‌కు ఆయన రూ. 692 కోట్లు చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది.

Updated : 27 Jan 2024 13:02 IST

న్యూయార్క్‌: అమెరికా (USA) అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసు (Defamation Case)లో న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రంప్‌ ఆమెకు 83.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకు పైమాటే) చెల్లించాలని ఆదేశించింది.

కొన్నేళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్‌.. ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కరోల్‌ ఇటీవల దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా ట్రంప్‌నకు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెకు నష్టపరిహారం కింద 18.3 మిలియన్‌ డాలర్లతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో 65 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుపై ఫెడరల్ కోర్టులో శుక్రవారం విచారణ జరుగుతుండగా.. ట్రంప్‌ అనూహ్యంగా కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

కాగా.. ఈ వ్యవహారంలో ట్రంప్‌నకు ఇప్పటికే మరో కోర్టు జరిమానా విధించింది. జీన్‌ కరోల్‌ను ట్రంప్‌ లైంగికంగా వేధించారని గతేడాది మే నెలలో కోర్టు నిర్ధారించింది. అందుకుగాను ఆమెకు 5 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే, కరోల్‌ తన రచనలను విక్రయించుకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్‌ విమర్శించడంతో పరువునష్టం కేసు దాఖలైంది. దీనిపైనే తాజాగా మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు విచారించి.. ఆమెకు అదనంగా మరో 83.3 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది.

ఈ జరిమానాపై ట్రంప్‌ స్పందిస్తూ బైడెన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఈ తీర్పు హాస్యాస్పదం. మన న్యాయ వ్యవస్థ నియంత్రణ కోల్పోయింది. దీన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు’’ అని మండిపడ్డారు. దీనిపై తాను పైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు తెలిపారు.

కోర్టు నుంచి అకస్మాత్తుగా బయటకు ట్రంప్‌

ఏంటీ కేసు వివాదం..

1996లో మాన్‌హటన్‌లోని ఓ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో కరోల్‌కు ట్రంప్‌ పరిచయమయ్యారు. అప్పుడు వేరే మహిళకు లోదుస్తులను బహుమతిగా ఇవ్వాలంటూ ట్రంప్‌ తనతో మాట కలిపారని ఆమె తెలిపారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాంతో తాను షాక్‌కు గురయ్యానని.. అత్యాచార బాధితురాలిగా తనను తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే, ఈ ఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత ఓ పుస్తకంలో ఆమె వెల్లడించిన వివరాలను న్యూయార్క్‌ మ్యాగజైన్‌ 2019లో ప్రచురించింది. వాటిపై ట్రంప్‌ స్పందిస్తూ.. ఆమెనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని