Kate Middleton: కేట్‌ మిడిల్టన్‌ అదృశ్యం.. ఆమె సీనియర్‌ సిబ్బందికీ సమాచారం లేదు!

Kate Middleton: ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ అదృశ్యంపై న్యూయార్క్‌ పోస్ట్‌ తాజాగా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఆమెకు సంబంధించిన వివరాలు సీనియర్‌ సిబ్బందికి సైతం తెలియదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.

Updated : 17 Mar 2024 22:54 IST

లండన్‌: బ్రిటన్‌ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) అదృశ్యంపై రోజుకో ఊహాగానం తెరపైకి వస్తోంది. అనారోగ్యం వల్ల శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరిలో వెల్లడించినప్పటి నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించని విషయం తెలిసిందే. దీంతో ఆమె కోమాలో ఉన్నారని, మరొకరితో విలియం అఫైర్‌ పెట్టుకోడమే కారణమని.. ఇలా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ విడుదల చేసిన ఎడిటెడ్‌ ఫొటోతో అవి మరింత తీవ్రమయ్యాయి. ఈ తరుణంలో తాజాగా లండన్‌లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్‌ పోస్ట్‌ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

వారికీ ఏం తెలియదు..

ఆ కథనం ప్రకారం.. కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) వ్యవహారాలను చక్కబెట్టే చాలా మంది సీనియర్‌ సిబ్బందికి కొన్నిరోజులుగా ఆమె వివరాలేమీ తెలియడం లేదు. వారెవరూ ఇటీవల ఆమెను చూసిన, మాట్లాడిన సందర్భాలు లేవు. కెన్సింగ్టన్‌ రాజభవనం ప్రకటించే వరకు ఆమె శస్త్రచికిత్స గురించీ వారికి తెలియదు. అసలేం జరుగుతుందో కొంత మందికి మాత్రమే తెలుసు. వారు మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో అంతా అయోమయంగా ఉందని.. ఆందోళనకు గురిచేస్తోందని వారు చెప్పినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించింది. కింగ్‌ ఛార్లెస్‌-III, ఆయన సతీమణి క్యామిల్లా మాత్రమే కేట్‌ను కలుస్తున్నారని చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని చాలా రహస్యంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు.

కేట్‌ అదృశ్యం వేళ.. విలియం సంబంధంపై మళ్లీ కథనాలు

త్వరలో ప్రజల్లోకి..

మరోవైపు ఆమె త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని అధికారిక వర్గాల ద్వారా తమకు సమాచారం ఉందని ‘ది సండే టైమ్స్‌’ వెల్లడించింది. ఆ సమయంలోనే ఆమె తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను పంచుకునే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాజకుటుంబం త్వరలో ఆమె ఫొటోను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని