వాయుసేనలో చేరతారా?

రక్షణ రంగంలో ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగాలు ప్రత్యేకమైనవి. ఈ విభాగంలో విశిష్ట ఉద్యోగాలు ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైంది.. ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌). సాధారణ డిగ్రీ లేదా బీటెక్‌ అర్హతతో పోటీ పడవచ్చు.

Updated : 05 Jun 2023 04:35 IST

ఏఎఫ్‌క్యాట్‌

రక్షణ రంగంలో ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగాలు ప్రత్యేకమైనవి. ఈ విభాగంలో విశిష్ట ఉద్యోగాలు ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైంది.. ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌). సాధారణ డిగ్రీ లేదా బీటెక్‌ అర్హతతో పోటీ పడవచ్చు. మహిళలూ అర్హులే. పరీక్ష, మెడికల్‌ టెస్టులు, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. వీటిలో విజయవంతమైనవారిని శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. వీరు పైలట్‌ కావచ్చు, టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో అత్యున్నత హోదాతో సేవలు అందించవచ్చు. లెవెల్‌-10 వేతన శ్రేణితో రూ.లక్షకుపైగా జీతం పొందొచ్చు. ఇటీవలే ఏఎఫ్‌ క్యాట్‌ ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు..

ప్రతి ఆరు నెలలకోసారి ఏఎఫ్‌ క్యాట్‌ ప్రకటన వెలువడుతుంది. దేశంలోని ముఖ్యమైన పరీక్షల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సాధారణ డిగ్రీతో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు అందించడమే దీనికి కారణం. ఈ పరీక్షను లక్ష్యంగా చేసుకున్నవారు గరిష్ఠ వయసు ప్రకారం ఆరేడు సార్లు రాసుకోవచ్చు. ముందునుంచీ సన్నద్ధమైతే తక్కువ ప్రయత్నాల్లోనే విజయవంతం కావచ్చు. పరీక్ష ఉమ్మడిగా ఉంటుంది. టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) అదనం. ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించినవారికి స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు వారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) ఉంటుంది. వీటన్నింటిలో విజయవంతమైతే మెడికల్‌ పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. ఆ తర్వాత వీరిని శాశ్వత, 14 ఏళ్లపాటు కొనసాగే తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగానికి అవకాశమిస్తారు. వీరు తక్కువ వ్యవధిలోనే అత్యున్నత హోదాలకు చేరుకుంటారు.

పరీక్ష ఇలా..

ఆన్‌లైన్‌లో 300 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి దానికీ మూడు మార్కుల చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్‌ అవేర్‌నెస్‌, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ల్లో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే వస్తాయి మిగిలినవి డిగ్రీ స్థాయిలో ఉంటాయి. వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాలు ఉన్నాయి. పరీక్షకు ముందు ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్టు అందుబాటులో ఉంచుతారు. గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) రాయాలి. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున వీటికి 150 మార్కులు కేటాయించారు.

ఏ అంశాల్లో ?

జనరల్‌ అవేర్‌నెస్‌: చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమిక స్థాయిలోనే ప్రశ్నలుంటాయి. ఎక్కువ ప్రశ్నలు సాధారణ అవగాహనతో జవాబు గుర్తించగలిగేలా ఉంటాయి. హైస్కూల్‌ సోషల్‌, సైన్స్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమానాంశాల్లో .. నియామకాలు, అవార్డులు, క్రీడలు, ఎన్నికల ఫలితాలు, పుస్తకాలు- రచయితలు, రక్షణ రంగంలోని తాజా పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. పరీక్ష తేదీకి 9 నెలల వెనుక వరకు జరిగిన ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి.

వెర్బల్‌ ఎబిలిటీ: కాంప్రహెన్షన్‌, ఎర్రర్‌ డిటెక్షన్‌, సెంటెన్స్‌ కంప్ల్లీషన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, ఒకాబ్యులరీల నుంచి ప్రశ్నలుంటాయి. ఆంగ్ల భాషలో అభ్యర్థికి ఏ మేరకు అవగాహన ఉందో పరిశీలిస్తారు. హైస్కూల్‌, ఇంటర్మీడియట్‌ స్థాయిలోని ఆంగ్ల వ్యాకరణాంశాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

న్యూమరికల్‌ ఎబిలిటీ: సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, నిష్పత్తులు, సాధారణ వడ్డీ అంశాల్లో ప్రశ్నలుంటాయి. హైస్కూల్‌ గణిత పాఠ్యపుస్తకాల్లోని ఈ అధ్యాయాలు బాగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఈ విభాగంలో విజయవంతం కావచ్చు.

రీజనింగ్‌, మిలటరీ ఆప్టిట్యూడ్‌: వెర్బల్‌ స్కిల్స్‌, స్పేషియల్‌ ఎబిలిటీ (మెంటల్‌ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ తర్కంతో ముడిపడే ఉంటాయి. బాగా ఆలోచించి సమాధానం గుర్తించవచ్చు. పాత ప్రశ్నపత్రాలను సాధన చేసి, ఈ విభాగంలో రాణించవచ్చు.

ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్టులో సంబంధిత బ్రాంచ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. బీటెక్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదివితే సరిపోతుంది.

శిక్షణ.. వేతనం

జులై, 2024 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ విభాగాల్లో 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగాలకు 52 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి ముందుగా ఆరు నెలల ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం.. ఫైటర్‌ పైలట్‌, ట్రాన్స్‌పోర్ట్‌ పైలట్‌, హెలికాప్టర్‌ పైలట్లుగా విడదీసి రెండు దశల్లో శిక్షణ నిర్వహిస్తారు. దుండిగల్‌, హకీంపేట, బీదర్‌, ఎలహంకల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. శిక్షణలో నెలకు రూ.56,100 చొప్పున   స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరినవారికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పలు అలవెన్సులు ఉంటాయి. అలాగే మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు రూ.పాతిక వేల ఫ్లయింగ్‌ అలవెన్సు, టెక్నికల్‌ బ్రాంచీలవారికి టెక్నికల్‌ అలవెన్సు అదనంగా అందుతాయి. అన్నీ కలిపి రూ.లక్షకు పైగా వేతనం లభిస్తుంది. ఇతర సౌకర్యాలూ ఉంటాయి.   

ఖాళీలు: అన్ని విభాగాల్లోనూ కలిపి 276  
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: జూన్‌ 30 సాయంత్రం 5 వరకు  
ఫీజు: రూ.250
పరీక్షలు: ఆగస్టు 25, 26, 27 తేదీల్లో నిర్వహిస్తారు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం.

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/


విజయానికి...

నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాలు పరిశీలించాలి. అన్ని విభాగాల్లోనూ ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి.

* పాత ప్రశ్నపత్రాలు గమనించాలి. వీటి నుంచి ప్రశ్నల స్థాయి, అంశాల వారీ లభిస్తున్న ప్రాధాన్యాన్ని గ్రహించి, సన్నద్ధతను పరీక్షకు అనుగుణంగా మలచుకోవాలి.
* పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు సాధించాలి. ఫలితాలు విశ్లేషించుకోవాలి. చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెనుకబడుతోన్న అంశాల్లో ఎక్కువ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. నిలకడగా 60 శాతం మార్కులు పొందగలిగితే అధ్యయనం బాగున్నట్లే లెక్క. విజయం దిశగా అడుగులేస్తున్నారని భావించవచ్చు.  
* పరీక్ష రాస్తున్నప్పుడు ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరలోనే ప్రయత్నించాలి. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివాటిని వదిలేస్తేనే ప్రయోజనం.


స్టేజ్‌ 1, 2 ఇలా...

రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్‌ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డు (ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ టెస్టు. ఇందులో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రాటింగ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్‌మెంట్లు, పజిల్స్‌ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపుతారు. దాన్ని విశ్లేషించాలి. ఇందులో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్‌, అవుట్‌ డోర్‌ ఇంటరాక్టివ్‌ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటి ద్వారా మానసిక, శారీరక సామర్థ్యాలను గమనిస్తారు. అనంతరం ముఖాముఖి ఉంటుంది. ఈ దశలన్నీ దాటినవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఏ సమస్యలూ లేనివారిని శిక్షణకు పిలుస్తారు.


ఎవరు అర్హులు?

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌/ప్లస్‌ 2లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల్లో 50 శాతం చొప్పున మార్కులు తప్పనిసరి. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగం పోస్టులకు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉండాలి.  
వయసు: జులై 1, 2024 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జులై 2, 2000 - జులై 1, 2004 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉంటే మరో రెండేళ్లు మినహాయింపు పొందవచ్చు. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి.


గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎల‌్రక్టానిక్స్‌/ మెకానికల్‌) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. ఇంటర్‌/+2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ల్లో 50 శాతం మార్కులు తప్పనిసరి.


గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో.. విపన్‌ సిస్టం, అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌, అకౌంట్స్‌, ఎడ్యుకేషన్‌, మెటియొరాలజీ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విపన్‌ సిస్టం ఖాళీలకు ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల్లో 50 శాతం మార్కులతోపాటు ఏదైనా డిగ్రీలో 60 శాతం ఉండాలి. అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. అకౌంట్స్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో బీకాం/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్‌/ సీఎఫ్‌ఏ/ బీఎస్సీ (ఫైనాన్స్‌) కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌ ఖాళీలకు ఏదైనా పీజీలో 50, యూజీలో 60 శాతం ఉండాలి. మెటియొరాలజీ విభాగానికి బీఎస్సీ ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లతో 60 శాతం మార్కులు లేదా నిర్దేశిత బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/బీఈ అవసరం. అన్ని విభాగాలకూ ఇంటర్మీడియట్‌ చదివుండటం తప్పనిసరి. అన్ని పోస్టులకూ ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు జులై 1, 2024 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. జులై 2, 1998 - జులై 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ రెండు పోస్టులకు పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ.ఎత్తు తప్పనిసరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని