హెచ్‌ఏఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) డిజైన్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) 185 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 09 Aug 2023 00:14 IST

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) డిజైన్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) 185 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

డిజైన్‌ ట్రెయినీ పోస్టులు.. ఏరోనాటికల్‌-9, ఎలక్ట్రికల్‌-12, ఎలక్ట్రానిక్స్‌-44, మెకానికల్‌-30 ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) పోస్టులు.. కంప్యూటర్‌ సైన్స్‌-23, ఎలక్ట్రికల్‌-16, ఎలక్ట్రానిక్స్‌-13, మెకానికల్‌-30, ప్రొడక్షన్‌-5, మెటలర్జీ-3 పోస్టులు ఉన్నాయి. మొత్తం 185 పోస్టుల్లో ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులకు రిజర్వేషన్‌ ఉంటుంది.

జనరల్‌ అభ్యర్థులు 70 శాతం మార్కులతో .. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసవ్వాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 22.08.2023 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ లకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ హెచ్‌ఏఎల్‌ ఉద్యోగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

సన్నద్ధతకు..

ఈ పరీక్షలో ఇంజినీరింగ్‌ సంబంధిత సబ్జెక్టులకు 100 మార్కులు కేటాయించారు. ఈ సబ్జెక్టుల మీద గట్టి పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు సంపాదించొచ్చు. గతంలో చదివిన సబ్జెక్టులే కాబట్టి కొంతవరకూ అవగాహన ఉంటుంది. మరింత దృష్టి పెడితే ఎక్కువ మార్కులు పొందొచ్చు.
రీజనింగ్‌ విభాగంలో వెర్బల్‌, నాన్‌వెర్బల్‌, సింబల్స్‌, రిలేషన్‌షిప్స్‌, పోలికలు, భేదాలు మొదలైన వాటి మీద ప్రశ్నలు ఇస్తారు. ఇవన్నీ అభ్యర్థికి ఉండే తార్కిక పరిజ్ఞానం, అవగాహన, సమస్యా పరిష్కార నైపుణ్యాలను పరీక్షించేలా ఉంటాయి. అప్పటికప్పుడు చురుగ్గా, వేగంగా స్పందించి సమాధానాలు రాసే నేర్పు ఉంటే ఈ విభాగంలో మార్కులు సాధించవచ్చు.
* వర్తమాన వ్యవహారాల కోసం రోజూ వార్తాపత్రికను చదవాలి. ముఖ్యాంశాలను నోటుపుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. పరీక్ష ముందు వీటిని ఒకసారి పునశ్చరణ చేసుకుంటే సరిపోతుంది.  
* ప్రతి విభాగంలోనూ అంశాలవారీగా మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాల్లో ఏ తరహా ప్రశ్నలు వచ్చాయో గమనించాలి. ఆయా ప్రశ్నలను సాధన చేయాలి.
* వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయడం అలవాటు చేసుకోవాలి. దీంతో నిర్ణీత వ్యవధిలోనే సమాధానాలను గుర్తించగలుగుతారు. ఇలాచేయడం మొదట్లో వీలుకాకపోయినా.. సాధన వల్ల వేగంగా రాయగల నేర్పు అలవడుతుంది.
* బలాలు, బలహీనతలను సమీక్షించుకుని వెనకబడిన అంశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.
* నెగెటివ్‌ మార్కులు లేవు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు గుర్తించి.. తెలియనివాటికి చివర్లో రాస్తే సమయం వృథా కాకుండా ఉంటుంది.  
దరఖాస్తుకు చివరి తేదీ: 22.08.2023
వెబ్‌సైట్‌: http://www.hal-india.co.in/

ఎంపిక ఎలా?

ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులో పేర్కొన్న అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఆన్‌లైన్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. పరీక్ష తేదీ, సమయం, వేదిక వివరాలను ఈ-అడ్మిట్‌కార్డ్‌ ద్వారా తెలియజేస్తారు. దీన్ని అభ్యర్థులు హెచ్‌ఏఎల్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. ఏ భాషలో పరీక్ష రాస్తారనే విషయాన్ని దరఖాస్తు సమయంలోనే తెలియజేయాలి. ఆ తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు. పరీక్షలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, మూడు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్‌-1లో జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు, పార్ట్‌-2లో ఇంగ్లిష్‌ అండ్‌ రీజనింగ్‌ 40 ప్రశ్నలు, పార్ట్‌-3లో సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 100 ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున.. మొత్తం 160 ప్రశ్నలకు 160 మార్కులు ఉంటాయి. నెగెటివ్‌ మార్కులు లేవు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష మార్కులకు 85 శాతం, ఇంటర్వ్యూ మార్కులకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల్లో 50 శాతం మార్కులు పొందిన అభ్యర్థులు ఎంపికకు అర్హత సాధిస్తారు. వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు 52 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.40,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. వీడీఏ, క్యాంటీన్‌ అలవెన్స్‌తోపాటు వసతి సదుపాయం కూడా ఉంటుంది. శిక్షణను పూర్తిచేసుకున్నవారు గ్రేడ్‌-2 ఇంజినీర్స్‌గా నెలకు రూ.40,000 నుంచి 1,40,000 వరకూ వేతనంగా అందుకోవచ్చు. మూలవేతనంతోపాటు వీడీఏ, మెడికల్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ ఇతర ప్రోత్సాహకాలూ ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని