బెల్‌లో కొలువులు

బెంగళూరులోని నవరత్న సంస్థ అయిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 63 పోస్టుల భర్తీకి  ప్రకటన విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఐటీఐ, బీకాం, బీబీఎం, పదోతరగతి పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 22 Aug 2023 00:36 IST

బెంగళూరులోని నవరత్న సంస్థ అయిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 63 పోస్టుల భర్తీకి  ప్రకటన విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఐటీఐ, బీకాం, బీబీఎం, పదోతరగతి పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 63 పోస్టుల్లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ (కంప్యూటర్‌ సైన్స్‌)-10, సివిల్‌-6; టెక్నీషియన్‌ సి (ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌)-27, ఫిట్టర్‌-12, ఎలక్ట్రికల్‌-3, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్‌)-2; జూనియర్‌ అసిస్టెంట్‌-3 ఉన్నాయి.

అన్ని పోస్టులకూ గరిష్ఠ వయసు 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250. ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

1. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ: సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి. జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో డిప్లొమా పాసవ్వాలి. ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కాలంలో నెలకు రూ.10,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని.. గ్రెడేషన్‌ టెస్ట్‌ పాసైనవారిని రెగ్యులర్‌ పే స్కేల్‌తో ఉద్యోగంలోకి తీసుకుంటారు.

2. టెక్నీషియన్‌-సి: పదోతరగతితోపాటు ఐటీఐ పాసవ్వాలి. ఏడాది అప్రెంటిస్‌ ట్రెయినింగ్‌ పూర్తిచేయాలి. సంబంధిత విభాగంలో నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా పదో తరగతి పాసై సంబంధిత విభాగంలో మూడేళ్ల నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలి. జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి.

3. జూనియర్‌ అసిస్టెంట్‌: మూడేళ్ల బీకామ్‌/బీబీఎం పాసవ్వాలి. జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి.

ఈ మూడు పోస్టులకూ దరఖాస్తు చేసేవాళ్లు కర్ణాటక ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్చ్సేంజ్‌లో పేరును రిజిష్టర్‌ చేసుకోవడం తప్పనిసరి. ఈ పోస్టులకు అనుభవం అవసరం లేదు.

ఎంపిక: అర్హతల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి.. రాతపరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షకు 150 మార్కులు. పార్ట్‌-1లోని జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు 50 మార్కులు. జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌, కాంప్రహెన్షన్‌, న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, జనరల్‌ నాలెడ్జ్‌ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.

  • పార్ట్‌-2లో టెక్నికల్‌ ఆప్టిట్యూడ్‌కు 100 మార్కులు. సంబంధిత విభాగానికి చెందిన టెక్నికల్‌/ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ను పరీక్షించే 100 ప్రశ్నలు ఇస్తారు. ఈ రాత పరీక్షలో జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రెండు పార్టుల్లోనూ 35 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రెండు పార్టుల్లోనూ 30 శాతం సంపాదించాలి.  

ఎంపికైన అభ్యర్థులకు మూలవేతనంతోపాటు డియర్‌నెస్‌, హౌస్‌రెంట్‌ అలవెన్స్‌, యాన్యువల్‌ బేసిక్‌ పే మీద 30 శాతం పెర్క్స్‌, రీఇంబర్స్‌మెంట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎక్స్‌పెన్‌సెస్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, పీఎఫ్‌, పెన్షన్‌, గ్రాట్యుటీ.. మొదలైన సౌకర్యాలూ ఉంటాయి.


సన్నద్ధత 

నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌లోని అంశాలనే చదివి, సాధన చేయాలి. పార్ట్‌-1లో 50 ప్రశ్నలే ఉన్నప్పటికీ.. దీన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దీంట్లోనూ 35 శాతం కనీసార్హత మార్కులు సాధించడం తప్పనిసరి. ఈ పార్ట్‌లోని ప్రశ్నలు అభ్యర్థి తార్కిక, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి.

  • పార్ట్‌-2లో సంబంధిత విభాగానికి చెందిన.. టెక్నికల్‌/ ప్రొఫెషనల్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించే 100 ప్రశ్నలు అడుగుతారు. చదివిన సబ్జెక్టుల నుంచే ఈ ప్రశ్నలు వస్తాయి కాబట్టి వాటి మీద గట్టిపట్టు సాధించాలి. ప్రధానాంశాలను పునశ్చరణ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
  • బ్యాంక్‌, రైల్వే పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
  • మాక్‌టెస్ట్‌లు రాయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. జవాబులను సరిచూసుకోవాలి. వెనకబడిన అంశాలపై దృష్టిని కేంద్రీకరించి వాటిని ఎక్కువగా సాధన చేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 05.09.2023

వెబ్‌సైట్‌: www.bel-india.in

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని