శ్రేష్ఠమైన విద్యకు చిరునామా!
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, వారిలో సామాజిక స్పృహ పెంపొందేలా అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది.
అజీం ప్రేమ్జీ విద్యాసంస్థలో యూజీ, పీజీ ప్రవేశాలు
దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్య అందిస్తున్నా విశిష్ట సంస్థలు మాత్రం కొన్నే. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం వాటిలో ఒకటి. మేటి విద్యను సామాజిక దృక్పథంతో, లాభాపేక్ష లేకుండా అందిస్తోందీ సంస్థ. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్, బీఏ, బీఎస్సీ, ఎంఏ కోర్సులు దాదాపు ఉచితంగా చదువుకోవచ్చు. వచ్చే విద్యా సంవత్సరంలో వీటిలో ముందస్తు ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూలతో సీటు కేటాయిస్తారు.
ఇక్కడ పీజీ, ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్ కోర్సులు చదివిన వారికి రూ.30 నుంచి 40 వేల నెల వేతనంతో పలు సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.
సైన్సెస్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, బోధన రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సంస్థలో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అన్ని కోర్సులూ ఫుల్ టైం రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, వారిలో సామాజిక స్పృహ పెంపొందేలా అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. నిష్ణాతులైన బోధన సిబ్బంది, ఆధునిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం అన్నింటి మేళవింపుతో బెంగళూరులో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. భోపాల్లోనూ మరో క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. సామాజిక అవసరాలు నెరవేరేలా, సమాజానికి నాణ్యమైన మానవ వనరులు అందించే లక్ష్యంతో ఇక్కడి చదువులు రూపొందించారు. సైన్సెస్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, బోధన రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సంస్థలో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అన్ని కోర్సుల విద్యార్థులకూ ఉమ్మడి కరిక్యులమ్తోపాటు, ప్రతి కోర్సులోనూ మేజర్ (కంపల్సరీ), ఎలెక్టివ్లు ఉంటాయి. అన్ని కోర్సులూ ఫుల్ టైం రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్నారు.
ఫీజు, రాయితీ
బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్.. ఏ కోర్సులో చేరినా తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4 లక్షలలోపు ఉంటే పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది. వసతి కూడా దాదాపు ఉచితమే. రూ.4-8 లక్షల లోపు ఉంటే 75 శాతం, 8-10 లక్షల మధ్య 50 శాతం, 10-12 లక్షల మధ్య ఉన్నవారికి 25 శాతం ఫీజు, వసతిలో రాయితీ లభిస్తుంది.
పీజీ అన్ని కోర్సులకూ రూ.2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు పూర్తి మినహాయింపు లభిస్తుంది. 2 లక్షల నుంచి 4 లక్షల లోపు ఉంటే 75 శాతం, 4-6 లక్షల మధ్య ఉన్నవారికి 50 శాతం, 6-7 లక్షల మధ్య ఉంటే 25 శాతం ఫీజు తగ్గిస్తారు. రుణ సౌకర్యం ఉంది.
యూజీ కోర్సులకు ట్యూషన్, వసతి మొత్తం ఫీజు సుమారు రూ.16 లక్షలు. రెండేళ్ల పీజీ కోర్సులకు.. ఫీజు, వసతి నిమిత్తం మొత్తం రూ.4 లక్షలు చెల్లించాలి. అన్ని కోర్సులకు ఆహారానికి నెలకు రూ.5000 నుంచి రూ.6000 వరకు వెచ్చించాలి.
ప్రాంగణ నియామకాలు
కోర్సులు పూర్తిచేసుకున్నవారికి క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా అవకాశాలు లభిస్తున్నాయి. ఎన్జీవోలు, పరిశోధన సంస్థలు, సీఎస్ఆర్ విభాగాలు, ఆంత్రప్రెన్యూర్, విద్యా సంస్థలు వీరిని ఎంపిక చేస్తున్నాయి. పలు కంపెనీలు కోర్సు చివర్లో ప్రాంగణ నియామకాలూ చేపడుతున్నాయి. ఇక్కడ పీజీ, ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్ కోర్సులు చదివినవారికి రూ.30 నుంచి 40 వేల నెల వేతనంతో పలు సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. అనుభవం ఉన్నవారికి ఇంతకంటే పెద్దమొత్తమే వెచ్చిస్తున్నాయి.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 22
పరీక్ష తేదీ: డిసెంబరు 24
వెబ్సైట్: https://azimpremjiuniversity.edu.in
ఆన్లైన్లోనూ..
ఈ సంస్థ ఆన్లైన్లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులూ అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు వీటిలో ప్రవేశానికీ దరఖాస్తు చేసుకోవచ్చు.
డిప్లొమా: ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ డిజేబిలిటీ.
పీజీ డిప్లొమా: రిసెర్చ్ ఫర్ సోషల్ యాక్షన్, డెవలప్మెంట్ లీడర్షిప్.
ఇవీ కోర్సులు
యూజీలో...
బీఏ: ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిస్టరీ, సోషల్ సైన్స్.
బీఎస్సీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ సస్ట్టెయినబిలిటీ.
బీఎస్సీ బీఎడ్: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్.
అర్హత: సంబంధిత గ్రూప్లో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారై ఉండాలి. వయసు 21 ఏళ్లలోపు ఉండాలి.
పీజీలో...
ఎంఏ: ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్, ఎకనామిక్స్ (రెండేళ్లు)
అర్హత: ఎకనామిక్స్ కోర్సుకు డిగ్రీలో ఆ సబ్జెక్టును చదివుండాలి. మిగిలిన వాటికి ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్, యూజీ చివరి ఏడాది కోర్సులవారూ అర్హులే.
బెంగళూరు క్యాంపస్లో ఎంఏ పబ్లిక్ హెల్త్ తప్ప అన్ని కోర్సులూ అందిస్తున్నారు. భోపాల్ క్యాంపస్లో.. బీఎస్సీ బయాలజీ, బీఏ ఎకనామిక్స్, బీఏ ఇంగ్లిష్, బీఏ హిస్టరీ, ఎంఏ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సులు ఉన్నాయి. పీజీ కోర్సుల ఎంపికలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. యూజీ, పీజీ పరీక్షల మాదిరి ప్రశ్నలు సంస్థ వెబ్సైట్లో ఉన్నాయి.
యూజీ ప్రవేశపరీక్ష
బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్ అన్ని కోర్సులకూ ఉమ్మడిగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విభాగంలో రీడింగ్ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ రీజనింగ్ విభాగాల్లో ఒక్కో దాంట్లో 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 5 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన జవాబుకూ 2 మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించినదానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. మరో విభాగంలో ఒక వ్యాసరూప ప్రశ్నకు 200 పదాల్లో ప్రభావవంతంగా సమాధానం రాయాలి. మొత్తం పరీక్ష వ్యవధి 3 గంటలు.
పీజీ ప్రవేశ పరీక్ష
ఎకనామిక్స్ మినహా మిగిలిన ఎంఏ కోర్సులు అన్నింటికీ పరీక్ష ఉమ్మడిగానే ఉంటుంది. ఇందులో 2 విభాగాలుంటాయి. పార్ట్-1లో బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. రీడింగ్ కాంప్రహెన్షన్ 15, జనరల్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ ఎబిలిటీ 15, సోషల్ అవేర్నెస్ 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పార్ట్-2లో అభ్యర్థి ఎంచుకున్న కోర్సుకు సంబంధించి ఒక వ్యాసానికి 400 పదాల్లో వివరంగా సమాధానం రాయాలి. ఈ విభాగం వ్యవధి ఒక గంట.
యూజీ, పీజీ పరీక్షల్లో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి కోర్సుల్లోకి తీసుకుంటారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!