బీటెక్‌తో పాటు లెఫ్టినెంట్‌ కొలువు

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులకు.. ఉచితంగా బీటెక్‌ చదువుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది.

Updated : 25 Oct 2023 05:08 IST

 పురుష అభ్యర్థులకు మాత్రమే 

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులకు.. ఉచితంగా బీటెక్‌ చదువుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. ఇందుకోసం ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రకటన విడుదలైంది. జేఈఈ మెయిన్‌ స్కోరుతో నియామకాలుంటాయి.

ఆసక్తి ఉన్నవారు ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ముందుగా వచ్చిన దరఖాస్తులను వారి స్కోరు ప్రకారం వడపోస్తారు. వీరికి రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. ఈ అవకాశం వచ్చినవారికి బీటెక్‌ కోర్సు, లెఫ్టినెంట్‌ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ నాలుగేళ్లు కొనసాగుతుంది. జులై, 2024 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి.విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసుకున్నవారికి బీటెక్‌ పట్టా, ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఉద్యోగం సొంతమవుతుంది. విధుల్లో చేరినవారికి లెవెల్‌-10 ప్రకారం నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది.  

ఎంపిక

జేఈఈ మెయిన్‌ స్కోరుతో విద్యార్థులను కుదిస్తారు. ఇందులో నిలిచినవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో బెంగళూరులో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటలిజెన్స్‌) పరీక్షల్లో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు తీసుకుంటారు.

శిక్షణ

మొత్తం శిక్షణ నాలుగేళ్లు కొనసాగుతుంది. ఇందులో రెండు దశలు...ఫేజ్‌-1 మూడేళ్ల ప్రీ కమిషన్‌ ట్రైనింగ్‌. ఫేజ్‌-2 ఏడాది పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. మొదటి మూడేళ్లు బేసిక్‌ మిలటరీ ట్రైనింగ్‌, బీటెక్‌ టెక్నికల్‌ శిక్షణను.. పుణె, సికింద్రాబాద్‌, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒక చోట నిర్వహిస్తారు. తర్వాత ఏడాది పాటు ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ - దేహ్రాదూన్‌ లేదా ఏదైనా కేంద్రంలో ఈ శిక్షణ కొనసాగుతుంది. మూడేళ్ల ఫేజ్‌-1 శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. నాలుగేళ్ల శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదా సొంతమవుతుంది.

శిక్షణ, కోర్సు పూర్తయిన తర్వాత వీరికి ఇంజినీరింగ్‌ (బీటెక్‌) డిగ్రీని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) ప్రదానం చేస్తుంది. అనంతరం వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు.

లెవెల్‌-10 మూలవేతనం రూ.56,100తోపాటు మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 ప్రతి నెలా అందుతాయి. వీటికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ప్రోత్సాహకాలు దక్కుతాయి. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే వీరు అన్ని ప్రోత్సాహకాలూ కలిపి సీటీసీ రూపంలో నెలకు లక్ష రూపాయలకు పైగా అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్‌, ఆరేళ్ల సర్వీస్‌తో మేజర్‌, పదమూడేళ్ల అనుభవంతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలను చేరుకోవచ్చు. ఇవి శాశ్వత పోస్టులు. అందువల్ల పదవీ విరమణ వయసు వరకు కొనసాగవచ్చు. అనంతరం పింఛనూ అందుకోవచ్చు.  


ఖాళీలు: 90

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్‌-2023 స్కోరు తప్పనిసరి. పురుషులు మాత్రమే అర్హులు.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2005 - జనవరి 1, 2008 మధ్య జన్మించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: నవంబరు 12
వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/index.htm


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని