సశస్త్ర సీమా బల్‌లో కానిస్టేబుల్‌ అవుతారా?

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో 272 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), గ్రూప్‌-సి, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 30 Oct 2023 03:37 IST

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో 272 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), గ్రూప్‌-సి, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదోతరగతి పాసై.. నిర్దేశించిన క్రీడల్లో పాల్గొన్న పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినప్పటికీ పర్మనెంట్‌ చేసే అవకాశం ఉంది.

భ్యర్థుల వయసు 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు పదేళ్లు, ఓబీసీలకు ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.  

ఏ క్రీడలు: ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, బాడీ బిల్డింగ్‌, బాస్కెట్‌బాల్‌, సైక్లింగ్‌, ఈక్వెస్ట్రియన్‌, ఫెన్సింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, పెన్‌కాక్‌ సిలాట్‌, పవర్‌లిఫ్టింగ్‌, షూటింగ్‌ స్పోర్ట్స్‌, స్విమ్మింగ్‌, తైక్వాండో, వాలీబాల్‌, రెజ్లింగ్‌, ఉషూ, వాటర్‌ స్పోర్ట్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌.  

ఎంపిక: క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్‌ ట్రయల్‌, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, రివ్యూ మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా లేదా భారత భూభాగం వెలుపలా సేవలు అందించాలి.

అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొని దేశం తరపున ప్రాతినిథ్యం వహించినవారికి మొదటి ప్రాధాన్యమిస్తారు. బంగారు పతకం సాధించినవారికి 30 మార్కులు, వెండి పతకానికి 29, కాంస్య పతకానికి 28, పాల్గొన్నవారికి 26 మార్కులు కేటాయిస్తారు.

రెండో ప్రాధాన్యం జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్నవారికి ఇస్తారు. రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల తరపున జాతీయ క్రీడల్లో జూనియర్‌ లేదా సీనియర్‌ స్థాయిలో పాల్గొని.. బంగారు పతకం సాధిస్తే 25 మార్కులు, వెండి పతకం సాధిస్తే 24, కాంస్య పతకానికి 23 మార్కులు కేటాయిస్తారు. ముందుగా అభ్యర్థుల విద్యార్హతలు, వయసు, కులం, క్రీడల్లో సాధించిన విజయాలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. దీంట్లో అర్హత సాధించినవారికి ఫీల్డ్‌ ట్రయల్‌/ స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. అన్ని కేటగిరీల అభ్యర్థులూ 60 శాతం మార్కులు సాధించాలి. దీంట్లో గెలుపొందిన అభ్యర్థులకు ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌డీ) నిర్వహిస్తారు.

పీఎస్‌టీ: జనరల్‌ పురుష అభ్యర్థులు 170 సెం.మీ. ఎత్తు, చాతీ 80 సెం.మీ. ఉండి గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. వరకూ వ్యాకోచించాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎస్టీ పురుష అభ్యర్థుల ఎత్తు 162.5 సెం.మీ., చాతీ 76-81 సెం.మీ. ఉండాలి. ఎస్టీ మహిళల ఎత్తు 150 సెం.మీ. ఉండాలి. అభ్యర్థులు ఎత్తూ, వయసుకు సరిపడినట్టుగా ఎంత బరువు ఉండాలనేది నోటిఫికేషన్‌లో వివరంగా తెలియజేశారు. పీఎస్‌టీలో అర్హత సాధించినవారికి వైద్య పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

గుర్తుంచుకోవాల్సినవి  

  • డాక్యుమెంటేషన్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌, మెడికల్‌ టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్‌ కార్డ్‌ను తీసుకెళ్లాలి.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి దివ్యాంగులు అర్హులు కారు.
  • దరఖాస్తు ప్రింటవుట్‌ను అభ్యర్థులు భద్రపరుచుకోవాలి.
  • గవర్నమెంట్‌/ సెమీ గవర్నమెంట్‌, పబ్లిక్‌ సెక్టర్‌ అండర్‌ టేకింగ్స్‌లో పనిచేసే అభ్యర్థులు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు. 21.10.2023 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

వెబ్‌సైట్‌: www.ssbrectt.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని