పదునైన న్యాయం!

పౌరహక్కులు ప్రమాదంలో పడినప్పుడు, సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగినప్పుడు, రాజ్యాంగ ఔన్నత్యానికి అవరోధం ఏర్పడినప్పుడు, అర్హులైన వారికి సామాజిక న్యాయం అందనప్పుడు న్యాయవ్యవస్థ అనివార్యంగా జోక్యం చేసుకుంటుంది.

Updated : 15 Oct 2022 07:11 IST

భారత రాజ్యాంగం, రాజకీయాలు

పౌరహక్కులు ప్రమాదంలో పడినప్పుడు, సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగినప్పుడు, రాజ్యాంగ ఔన్నత్యానికి అవరోధం ఏర్పడినప్పుడు, అర్హులైన వారికి సామాజిక న్యాయం అందనప్పుడు న్యాయవ్యవస్థ అనివార్యంగా జోక్యం చేసుకుంటుంది. ప్రజా పాలనలో ప్రధానమైన శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల రాజ్యాంగ అతిక్రమణలను, అలసత్వాన్ని  నిరోధిస్తుంది. జవాబుదారీతనాన్ని పెంచుతుంది. రాజ్యాంగ పరిమితుల్లో పరిధులు విస్తరించుకొని చురుగ్గా వ్యవహరించి, పదునైన న్యాయాన్ని పంచుతుంది.

న్యాయవ్యవస్థ క్రియాశీలత
దేశ పరిపాలన రాజ్యాంగబద్ధంగా కొనసాగాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు తమ విధులను సమర్థంగా నిర్వహించాలి. వాటిలో ఎలాంటి లోపాలు ఏర్పడినా న్యాయవ్యవస్థ క్రియాశీలకం అవుతుంది. పరిపాలనను సరిచేస్తుంది.

అర్థ వివరణ
సాధారణంగా న్యాయవ్యవస్థ క్రియాశీలతను శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల అధికార పరిధిలో జోక్యం చేసుకోవడంగా పరిగణిస్తుంటారు. వాస్తవానికి న్యాయవ్యవస్థ సాధారణ విధుల కంటే క్రియాశీలత భిన్నమైంది కాదు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే క్రియాశీలత అంటే చురుగ్గా ఉండటం. ‘ప్రతి న్యాయమూర్తి పురోగమన దృక్పథంతో విధులను నిర్వహించడాన్ని క్రియాశీలతగా చెప్పవచ్చు’ అని జస్టిస్‌ కృష్ణయ్యర్‌ పేర్కొన్నారు. ఆ ప్రకారం చూస్తే న్యాయవ్యవస్థ క్రియాశీలత అనేది దృఢమైన చర్యలతో నిర్మాణాత్మకంగా మౌలిక చట్టాన్ని రూపొందించడమే అని అర్థం చేసుకోవచ్చు. న్యాయవ్యవస్థ క్రియాత్మక వైఖరి వల్ల శాసన వ్యవస్థ సజీవంగా ఉండటంతోపాటు సామాజిక, ఆర్థిక మార్పుల ప్రక్రియల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం లాంటి భావనలను ప్రోత్సహిస్తుంది. సామాజిక పరివర్తనకు కృషి చేస్తుంది. కేవలం న్యాయనిర్ణేతగా ఉండాలనే సంప్రదాయ భావనను దాటి, అందుకు భిన్నంగా రాజ్యాంగ సంవిధానంలో చోదకశక్తిగా వ్యవహరించడమే న్యాయవ్యవస్థ క్రియాశీలత అంతిమ లక్ష్యం.

క్రియాశీలతకు కారణాలు:
*
భారత సమాఖ్య వ్యవస్థలో తలెత్తే సమస్యలు.
* రాజ్యాంగ ఔన్నత్యానికి అవరోధం ఏర్పడటం.
* మానవ, పౌర హక్కులకు భంగం కలగడం.
* సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాల వారికి న్యాయం అందకపోవడం.
* సమన్యాయ పాలనకు ఇబ్బందులు ఎదురవడం.
* పాలనా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం.
పౌరహక్కుల కార్యకర్తలు, పర్యావరణ పరిరక్షణ వాదులు, బాలల హక్కుల పరిరక్షణ బృందాలు, సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పోరాడేవారు, మహిళాభ్యుదయ బృందాల్లాంటివి న్యాయవ్యవస్థ క్రియాశీలతకు దోహదపడుతున్నాయి. ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 21లో పేర్కొన్న జీవించే హక్కు పరిధిని క్రియాశీలత ద్వారా పెంచారు. దానిలో అంతర్భాగంగానే ఆర్టికల్‌ 21(తి) ద్వారా 14 సంవత్సరాల్లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కును నిర్దేశించారు.

ప్రయోజనాలు:
* ప్రాథమిక హక్కులపై విధించే ఆంక్షలను న్యాయవ్యవస్థ నివారిస్తుంది.
* శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల వైఫల్యాలను ప్రశ్నిస్తుంది.
* ప్రాథమిక హక్కులకు విస్తృతమైన వివరణను ఇస్తుంది.
* పరిపాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది.
* కేవలం వ్యక్తులకే పరిమితం కాకుండా సమూహాలకు న్యాయం అందుతుంది.
* ఎన్నికల ప్రక్రియను మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా మార్చడానికి తోడ్పడుతుంది.  
* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోర్టు ఆదేశాన్ని అను    సరించి తమ ఆస్తులు, ఆదాయం, విద్యార్హతలు, నేరచరిత్ర లాంటి అంశాలతో కూడిన ‘అఫిడవిట్‌’ను సమర్పిస్తున్నారు. దీనిద్వారా ఉత్తమ ప్రతినిధిని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం లభిస్తోంది.

ప్రతికూల ఫలితాలు:
* శాసన, కార్య   నిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచే అవకాశం ఉంది.        
* ప్రభుత్వ కార్యకలాపాలను నియంత్రిస్తుంది.
* రాజ్యాంగపర ఉల్లంఘనలు జరిగే ప్రమాదం ఉంది.
* ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగే వీలుంది.

సుప్రీంకోర్టు కేసులు
బెన్నెట్‌ కోల్‌మన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే సమాచార స్వేచ్ఛాహక్కు అనేది ఆర్టికల్‌
19s1z(A) లో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
నందినీ శతపతి వర్సెస్‌ పి.ఎల్‌.దాని కేసు: ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా హింసించి లేదా ఒత్తిడికి గురిచేసి సమాచారాన్ని రాబడితే అది బలవంతపు సాక్ష్యం అవుతుందని, ఈ విధానం ఆర్టికల్‌ 20(3)కి వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
అబ్దుల్‌ కరీం వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసు: ఒక వ్యక్తి నుంచి సమాచారం రాబట్టడం కోసం అతడి ఆరోగ్యం దెబ్బతినే విధంగా ‘నార్కో అనాలసిస్‌ పరీక్ష’ను వినియోగించకూడదు.
ఖ్వాజా అహ్మద్‌ అబ్బాస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: సినిమాలు భావోద్రేకాలను రెచ్చగొట్టే అవకాశం ఉండటం వల్ల, వాటిపై ముందస్తుగానే సెన్సార్‌షిప్‌ విధించడం భావవ్యక్తీ  కరణ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు.
లతాసింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు: ఒక మహిళ తనకు నచ్చిన పురుషుడిని భర్తగా ఎంచుకోవడం (వివాహం) ఆర్టికల్‌ 21లో పేర్కొన్న జీవించే హక్కులో అంతర్భాగం.
పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: ఆకలి, పోషకాహార లోపాలను అధిగమించడానికి ఆహార హక్కును చట్టబద్ధంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అపర్ణాభట్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ కేసు: అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ నిందితులు, బాధితురాలి మధ్య రాజీ సాధ్యపడదు.
సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: న్యాయమూర్తుల నియామకం కోసం 99వ రాజ్యాంగ సవరణ చట్టం-2014 ద్వారా ఏర్పాటు చేసిన ‘నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ యాక్ట్‌’ చెల్లుబాటు కాదు.

ప్రజాప్రయోజన వ్యాజ్యం
ప్రజాప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌ - పిల్‌) భావన 1960వ దశకంలో అమెరికాలో ఆవిర్భవించింది. న్యాయవ్యవస్థ గుర్తించిన స్థాయి (Locus-Standi)కి సంబంధించిన సరళీకృత నియమాల నుంచి పుట్టుకొచ్చిందే ప్రజాప్రయోజన వ్యాజ్యం లేదా సామాజిక చర్యా వ్యాజ్యం (సోషల్‌ యాక్షన్‌ లిటిగేషన్‌). ప్రభుత్వ అధికారం వల్ల ఒక వ్యక్తి తన చట్టబద్ధమైన హక్కులకు భంగం కలిగి నష్టపోయి గాయపడినప్పుడు ఆ వ్యక్తి మాత్రమే న్యాయపరిహారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాలి అనే సూత్రం సంప్రదాయ ‘గుర్తించిన స్థాయి’ నియమంపై ఆధారపడి ఉంటుంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఈ సంప్రదాయ నియమాన్ని న్యాయవ్యవస్థ క్రియాశీలతలో భాగంగా సరళీకరించింది. ఆ సరళీకృత నియమం ప్రకారం చట్టబద్ధమైన హక్కులను నష్టపోయిన లేదా అన్యాయానికి గురైన వ్యక్తి స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేనప్పుడు, సామాజిక స్పృహ, చైతన్యం కలిగిన వ్యక్తుల సహాయంతో కోర్టు నుంచి న్యాయాన్ని పొందే ప్రక్రియనే ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటారు. మన దేశంలో 1980వ దశకంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి, జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌లు దీనికి విస్తృత ప్రాచుర్యం కల్పించారు. న్యాయ ఆదేశాలు, చట్టం, రాజ్యాంగ లక్ష్యాలు సక్రమంగా, సమర్థంగా అమలయ్యేలా చూడటం ప్రజాప్రయోజన వ్యాజ్యం లక్ష్యం.

‘పిల్‌’లోని మౌలికాంశాలు:
* సాధారణ, సంప్రదాయ వ్యాజ్యాలకు ఇది భిన్నమైంది. ప్రజల సమష్టి ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి.
* సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారు, పేదలు నిర్లక్ష్యానికి గురైన వారికి రాజ్యాంగ హక్కులు, న్యాయం అందించడానికి పిల్‌ తోడ్పడుతుంది.
* అన్యాయానికి గురై, న్యాయస్థానాలను ఆశ్రయించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజల తరఫున ఎవరైనా న్యాయస్థానంలో దీన్ని వేయవచ్చు.
* న్యాయ సహాయం కోసం సాగే ఉద్యమానికి సామాజిక అస్త్రంగా దీన్ని పరిగణించవచ్చు.
* దీని ప్రభావం పిటిషనర్‌తో పాటు ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు, న్యాయస్థానాల మీద పడుతుంది. అది వెనుకబడిన వర్గాల వారికి సామాజిక న్యాయాన్ని అందిస్తుంది.  
* ప్రజల ప్రయోజనార్థం ఆదేశాలు వెలువరించే సమయంలో అప్పటికే నిర్ణయించి అమలవుతున్న విధానాల మార్పుల విషయంలో న్యాయస్థానం ఆచితూచి వ్యవహరిస్తుంది. అత్యంత జాగ్రత్తతో ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా తీర్పును వెలువరిస్తుంది.


‘శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల అశ్రద్ధ, అలసత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో సామాజిక దోపిడికీ గురయ్యే వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించడానికి పౌర సేచ్ఛా సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా ముందుకొస్తున్నాయి. ఆ వ్యాజ్యాలు న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికార పరిధిని, న్యాయ పరిమితులను ఎప్పటికప్పుడు విస్తృతపరిచాయి. న్యాయస్థానాలు పోషిస్తున్న ఈ పాత్రను విమర్శించేవారు దానికి న్యాయశాఖ క్రియాశీలత అని పేరు పెట్టారు.

- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎస్‌.ఆనంద్‌


‘భారత న్యాయవ్యవస్థపై న్యాయ క్రియాశీలత ఒక ఒత్తిడితో కూడిన కుదుపు లాంటిది. సరైన నిర్ణయాలను తీసుకోవడంలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు ప్రదర్శించే అలసత్వం వల్ల న్యాయశాఖ క్రియాశీలకంగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సున్నితమైన సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోయినప్పుడు ప్రజల్లో అసహనం, అసంతృప్తి పెరిగి, తగిన పరిష్కారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు.’

- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎం.అహ్మది


‘క్రమపద్ధతిలో కోర్టు ఆదేశాలను ఇవ్వడం, మారిన పరిస్థితులకు అనుగుణంగా శాసనాలను రూపొందించడానికి తగిన సూచనలు చేయడం, సమన్యాయాన్ని అందించడమే న్యాయ వ్యవస్థ క్రియాశీలత’ 

- ప్రముఖ న్యాయ నిపుణులు రాజీవ్‌ ధావన్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని