వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్‌

రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఉత్తర్వుల ప్రకారం వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్‌ తగిలింది. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ మొత్తంలో కోత పెట్టింది.

Updated : 22 Jan 2022 06:02 IST

సొమ్ములు వెనక్కివ్వాల్సిందే

భవిష్య డీఆర్‌ల నుంచి తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం

70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వారికి భారీ నష్టం

ఈనాడు - అమరావతి

రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఉత్తర్వుల ప్రకారం వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్‌ తగిలింది. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ మొత్తంలో కోత పెట్టింది. దీంతోపాటు ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించడంతో వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తం కన్నా ఇప్పటికే వారు అధికంగా తీసుకున్నారని ప్రభుత్వం లెక్క తేలుస్తోంది.  ఇలా తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్ముందు ఇచ్చే డియర్‌నెస్‌ రిలీఫ్‌ (డీఆర్‌ -కరవు సాయం) నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటామని తెలిపింది. ఈ కారణాలతో దాదాపు రూ.70,000 నుంచి రూ.1,00,000 వరకు నష్టపోతున్న పింఛనుదార్లు కూడా ఉన్నారు. అంటే వీరెవరికీ భవిష్యత్తులో డీఆర్‌ రూపంలో కొత్తగా ప్రయోజనం దక్కే అవకాశం లేదని విశదమవుతోందని విశ్లేషకులు, పింఛనుదార్లు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇవీ వివరాలు...

కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెలువరించింది. పింఛనుదార్లకు కొత్త స్కేళ్లు... ఎంత మొత్తం పింఛను అందుతుంది... ఇప్పటికే అధికంగా ఇచ్చిన మధ్యంతర భృతి మొత్తాన్ని, డీఆర్‌ నుంచి ఎలా మినహాయిస్తారు వంటి అంశాలను జీవోల్లో పేర్కొంది. పింఛనుదార్లకు ఉద్దేశించిన జీవో-2లో 19.3 నిబంధన ప్రకారం ఇప్పటికే అదనంగా చెల్లించిన మధ్యంతర భృతిని డీఆర్‌ బకాయిల మొత్తం నుంచి మినహాయిస్తామని స్పష్టంచేసింది. ఒకవేళ అలా మినహాయించినా ఇంకా సరిపోని పక్షంలో... ఆ పింఛనుదారు నుంచి ప్రభుత్వానికి ఇంకా జమ కావాల్సిన మొత్తం ఉంటే భవిష్యత్తులో ఇచ్చే డీఆర్‌ నుంచి మినహాయించుకుంటామని స్పష్టంచేసింది. అంటే 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న చాలామంది పింఛనుదార్లు కొత్త విధానంతో ప్రభుత్వానికే బకాయి పడే పరిస్థితి ఏర్పడుతోంది. వారెవరికీ భవిష్యత్తులో ప్రతి ఆరు నెలలకు ఇచ్చే డీఆర్‌ మొత్తాలు అందే అవకాశమే లేదని ఈ జీవోను పరిశీలించిన సీనియర్‌ పింఛనుదార్లు వాపోతున్నారు.

మినహాయింపులను లెక్కగట్టి...

కొత్త పింఛన్‌ ఎలా లెక్క కట్టాలి, అందులో నుంచి ఐఆర్‌ అదనపు మొత్తాన్ని ఎలా మినహాయిస్తారన్న విషయాన్ని ప్రభుత్వమే స్పష్టంగా పట్టిక రూపంలో విశదీకరించింది. 70 ఏళ్ల లోపు ఉన్న వారికి ఎలా ఉంటుంది? 70 నుంచి 75 ఏళ్లలోపు, 75 నుంచి 80 ఏళ్లలోపు వారికి ఎలా? ఆ తర్వాత వయసు వారికి ఎలా లెక్కగడతామన్న అంశాలను ఆయా జీవోలలో ఆర్థికశాఖ స్పష్టంగా వివరించింది. వాటిని పరిశీలిస్తే..

70 ఏళ్లు దాటిన పింఛనుదారుకు....

70 ఏళ్లు దాటిన పింఛనర్‌కు అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ రాదు. ప్రభుత్వం 2020 ఏప్రిల్‌ నుంచి మానిటరీ ప్రయోజనం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ ప్రకారమే వారి కొత్త పింఛను ఎలా లెక్కిస్తారో ఆర్థికశాఖ వివరించింది.

* పాత పేస్కేళ్ల ప్రకారం రూ.25,840 మూల పింఛను ఉన్న పింఛనుదారు 2021 డిసెంబరు వరకు అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌, 33.536 శాతం డీఏతో కలిపి, మధ్యంతర భృతితో కూడా లెక్క వేస్తే రూ.10,06,385 మొత్తం స్వీకరించారు. ఇందులో ఐఆర్‌గా స్వీకరించిన మొత్తం రూ.2,09,304గా తేల్చారు.
* ప్రస్తుతం ఆయనకు 2020 ఏప్రిల్‌ నుంచి కొత్త స్కేళ్లు లెక్కించారు. కొత్త మూల పింఛన్‌ను రూ.37,956గా లెక్కగట్టారు. అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ లేనందున పైసా కూడా ఆ కేటగిరీలో లెక్క కట్టలేదు. 2021 జూన్‌ వరకు 7.28% చొప్పున డీఆర్‌ లెక్కకట్టారు. 2021 నుంచి 20.02% చొప్పున డీఆర్‌ లెక్కగట్టారు. ఫిట్‌మెంట్‌ 23% చొప్పున, పాత డీఏ మొత్తం కలిపి కొత్త మూల పింఛన్‌గా తేల్చినందున ఇక మధ్యంతర భృతిని లెక్కించలేదు. ఆ రూపేణా మొత్తం కొత్త పింఛను స్కేలు ప్రకారం ఆ పింఛనుదారుకు రూ.9,23,261 వస్తుంది. డీఆర్‌ బకాయిలను రూ.12,186గా లెక్కించారు. ఈ మొత్తాన్ని కలిపి కొత్త పింఛను స్కేళ్లు, నిబంధనల ప్రకారం మొత్తం రూ.9,35,447 రావాల్సి ఉందని నిర్ణయిచారు.
* పాత స్కేళ్ల ప్రకారం అందుకున్న రూ.10,06,386 నుంచి కొత్త స్కేళ్ల ప్రకారం రావాల్సింది తక్కువే (రూ.9,35,447) ఉండటంతో మినహాయించారు. ఈ పింఛనుదారు ప్రభుత్వానికి ఇంకా రూ.70,939 బకాయి పడ్డారు. ఈ మొత్తాన్ని భవిష్యత్తులో ఇచ్చే డీఆర్‌ నుంచి మినహాయిస్తామని జీవోనే 19.3 నిబంధన స్పష్టంగా పేర్కొంది.

75 ఏళ్లు దాటిన వారికి ఇలా...

ఇదే జీవోలోని మరో పట్టికలో 75 ఏళ్లు దాటిన వారి పరిస్థితిని వివరించారు. పాత విధానంలో రూ.25,840 పాత మూల పింఛన్‌ ఉండి కొత్త మూల పింఛన్‌ రూ.39,682గా ఉన్న పింఛనుదారు రూ.1,07,170 ప్రభుత్వానికి బకాయి పడ్డారు. ఈయనకు భవిష్యత్తులో డీఆర్‌ అందదు.

* 70 ఏళ్ల వయసులోపు వారికి కొత్త లెక్కల ప్రకారం ఎంత బకాయి రానుందో లెక్కించారు. రూ.25,840 మూల పింఛన్‌ పొందేవారికి రూ.1,523 మేర బకాయిలు అందుతాయన్నారు.
* 80 నుంచి 85 ఏళ్ల మధ్య వారికీ ఇదే మూల పింఛన్‌ ఉంటే... వారికి రూ.41,251 పాత బకాయిల రూపంలో లభిస్తుంది.
* 85 నుంచి 90 ఏళ్ల మధ్య వారికి ఇదే మూల పింఛన్‌ ప్రకారం లెక్కిస్తే రూ.97,346 మేర బకాయిల రూపంలో అందుతుంది.
* 90 నుంచి 95 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఇదే మూల పింఛన్‌ ప్రకారం రూ.1,53,442 బకాయిగా అందుతుంది.
* 95-100 ఏళ్ల పైబడి వారికి ఇదే మూల పింఛన్‌ వద్ద 2,09,537 బకాయిగా అందుతుంది.
* అదే 100 ఏళ్లు దాటిన వారికి ఇది రూ.5,62,474 మేర బకాయిలు అందుతాయని పేర్కొంది.

అంత్యక్రియల ఖర్చుల్లోనూ కోత

పింఛనుదారు మరణిస్తే ప్రభుత్వం అంత్యక్రియల ఖర్చులు చెల్లిస్తోంది. ఇంతవరకు ఒక నెల పింఛను ఇస్తోంది. కనీస మొత్తం రూ.15 వేలు ఉండేలా చెల్లించేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం గరిష్ఠంగా రూ.20 వేలు మించకూడదని పేర్కొన్నారు. గతంలో నెల మొత్తం పింఛను ఎంత ఉంటే అంత పొందేవారు ఇకపై రూ.20 వేలకు మించి పొందరు. నెల పింఛను 25 వేలకు మించి ఉన్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారి కుటుంబాలు తాజా ఉత్తర్వులతో నష్టపోనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని