ప్రజల మాటలు వింటే సీఎం గుండె ఆగుతుంది

ముఖ్యమంత్రి తన ఇంట్లో కూర్చొని సొంత పత్రిక చదవడం మానేసి మారు వేషంలో ప్రజల్లో తిరిగినా.. ఇంటెలిజెన్స్‌ నుంచి వాస్తవాలు తెలుసుకున్నా... సామాజిక మాధ్యమాల్లో తిట్టే తిట్లు చూసుకున్నా ఆయన గుండె ఆగిపోతుందని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.

Published : 09 Apr 2022 04:51 IST

మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి, బొత్సలను మారిస్తే పార్టీకి సమస్యలు
సీఎంను చీవాట్లు పెట్టడానికే దిల్లీ పిలుపు
వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి తన ఇంట్లో కూర్చొని సొంత పత్రిక చదవడం మానేసి మారు వేషంలో ప్రజల్లో తిరిగినా.. ఇంటెలిజెన్స్‌ నుంచి వాస్తవాలు తెలుసుకున్నా... సామాజిక మాధ్యమాల్లో తిట్టే తిట్లు చూసుకున్నా ఆయన గుండె ఆగిపోతుందని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్‌ కోతలంటే ఊరుకునేదే లేదన్న అధికారి దిల్లీకి మారిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలో ఉందని... రాష్ట్రంలో చేతకాని, దద్దమ్మ, అసమర్థ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తమను చూసి ప్రతిపక్షాలు, పత్రికలు ఏడుస్తున్నాయని ముఖ్యమంత్రి అంటున్నారని, పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఇస్తున్నందుకా.. మరెందుకు వాళ్లు ఏడుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థే దరిద్రమంటే... వాళ్లకు సేవారత్న, సేవావజ్ర అంటూ రూ.కోట్లతో అవార్డులు, రివార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పింఛన్ల డబ్బు తీసుకొని ప్రియరాలితో వాలంటీరు వెళ్లిపోయాడనే వార్తలు వస్తున్నాయన్నారు. చిన్న పిల్లలు ఏడిస్తే బలమనే నానుడి ఒకటి ఉందని.. దానికోసం జగన్‌మోహన్‌రెడ్డి కరెంటు కోతలు పెట్టి పిల్లలను ఏడిపిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొంటున్నారని... దానికి జగనన్న బాలదీవెన అని పేరు పెట్టాలని ఆయన సూచించారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే విద్యుత్‌ సమస్యలు వచ్చాయని.. దిల్లీ వచ్చినప్పుడు బొగ్గుశాఖ మంత్రిని కలిశారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల తప్పులు.. కార్పొరేషన్ల పేరుతో దొంగ రుణాలు తీసుకుంటున్న తీరుపై తాను ప్రధానమంత్రికి, కేంద్ర ఆర్థికమంత్రికి లేఖలు రాసి కాగ్‌ నివేదికలు జతచేసి పంపడంతో ముఖ్యమంత్రిని ప్రధాని దిల్లీ పిలిపించారని ఆయన తెలిపారు. లేకుంటే అప్పుల కోసం ముఖ్యమంత్రి చెప్పే సోది కోసం నెల రోజుల్లోనే ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వరన్నారు. దిల్లీకి పిలిచి ముఖ్యమంత్రికి చీవాట్లు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి పదే పదే ప్రతిపక్ష నేతలను తిట్టి వారిద్దరినీ దగ్గర చేస్తున్నారని తమ పార్టీ వాళ్లు అనుకుంటున్నారని ఆయన చెప్పారు. పవన్‌ కల్యాణ్‌తో మనకు గొడవ ఎందుకని ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. ఏ కులం వారిని ఆ కులం వారితో తిట్టించాలనే విచిత్రమైన భావన ముఖ్యమంత్రికి ఉందని.. అందులో భాగంగా పేర్ని నానితో పవన్‌ కల్యాణ్‌ని తిట్టిస్తారని తెలిపారు. త్రీ ఇడియట్స్‌ సినిమాలో టార్చ్‌లైట్‌తో ఆమిర్‌ఖాన్‌ ఆపరేషన్‌ చేశారని.. అలాగే మన దగ్గర ఆసుపత్రుల్లో విద్యుత్‌ సరఫరా లేక కొవ్వొత్తులు, టార్చ్‌లైట్‌తో ప్రసవాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో ఆక్వా పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటోందన్నారు. వైద్యులు వేరే ఆసుపత్రుల్లో పని చేయకూడదనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ వ్యాపారాలు చేయకూడదని.. మారుపేర్లతో మీరు వ్యాపారాలు చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

వెంట్రుకలు కాదు.. మనల్ని పీకేస్తారు

తన వెంట్రుక కూడా పీకలేరని ముఖ్యమంత్రి అంటున్నారని, ఆయన వెంట్రుకలతో ఎవరికి ఏం పని అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ప్రజలు ఆగ్రహిస్తే మనల్ని పీకేస్తారని తెలిపారు. వెంట్రుకలు పరిరక్షించుకోవాలంటే ముఖ్యమంత్రి తన బాధ్యతలను తాత్కాలికంగా పెద్దిరెడ్డికి అప్పగించాలని సూచించారు. మంత్రులుగా పెద్దిరెడ్డి, కొడాలి, బొత్సలను మంత్రివర్గం నుంచి తొలగించినా మళ్లీ తీసుకుంటారని.. వారిని తొలగిస్తే పార్టీకి సమస్యలు ఎదురవుతాయన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ, బీసీలకు పదవులు అంటూనే ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన రవిచంద్రారెడ్డికి ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారని ఆయన విమర్శించారు. తిరుపతి జిల్లాలో అన్ని పదవుల్లో ముఖ్యమంత్రి సామాజికవర్గం వారే ఉన్నారంటూ వారి పేర్లు చదివి వినిపించారు. సామాజిక న్యాయం కోసం ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా ఇవ్వాలని ఆయన జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు.

రఘురామ అరెస్టు కేసులో కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు.. తదనంతర పరిణామాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తన తండ్రి రఘురామకృష్ణరాజు అరెస్టు.. కస్టడీలో ఆయనకు గాయాలైన తీరుపై సీబీఐ లేదా మరో స్వతంత్ర విచారణ సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆయన కుమారుడు భరత్‌ గతేడాది మే నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది మే 21, 25వ తేదీల్లో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆరు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. నాటి నుంచి కేసు విచారణకు రాకపోవడంతో ఈ నెల 1న పిటిషనర్‌ తరఫు న్యాయవాది బైరపునేని సుయోధన్‌ కేసు విషయాన్ని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ జె.కె.మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేసుకు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐ, కేంద్రం తరపు న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని