డిపాజిట్లు తీసుకుని ఆస్తులను విడుదల చేయండి

అక్రమాస్తుల వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతితోపాటు జగన్‌కు చెందిన సంస్థల నుంచి జప్తుచేసిన స్థిర, చరాస్తులను విడుదల చేయాలని, ఇందుకోసం వాటికి సమాన విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్వీకరించాలని ఈడీకి తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది.

Updated : 29 Nov 2022 05:36 IST

ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
వై.ఎస్‌.భారతి, జగన్‌ కంపెనీల పిటిషన్లపై ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతితోపాటు జగన్‌కు చెందిన సంస్థల నుంచి జప్తుచేసిన స్థిర, చరాస్తులను విడుదల చేయాలని, ఇందుకోసం వాటికి సమాన విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్వీకరించాలని ఈడీకి తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఈ సంస్థల్లో సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రేవాన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉన్నాయి. అక్రమాస్తుల వ్యవహారంలో భారతి సిమెంట్స్‌ కేసులో రూ.746 కోట్ల విలువైన ఆస్తుల జప్తుపై దిల్లీలోని అప్పీలేట్‌ అథారిటీ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు... జప్తుపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో జప్తుచేసిన ఆస్తులకు సమాన విలువ ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్వీకరించి వాటిని విడుదల చేయాలంటూ వై.ఎస్‌.భారతితో పాటు, జగన్‌కు చెందిన సంస్థలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశాయి. వీటిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి సోమవారం తీర్పు వెలువరించింది. అభియోగాలతో జప్తుచేసిన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని 2,500 చదరపు గజాలు, సండూర్‌ పవర్‌ లిమిటెడ్‌లోని 61,38,937 వాటాలతోపాటు రూ.14.29 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని వై.ఎస్‌.భారతి కోరారు. రాయదుర్గంలోని 2,500 చదరపు గజాలకు సమానంగా రూ.1.37 కోట్లు, సండూర్‌ పవర్‌లోని వాటాలకు రూ.6.14 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తీసుకుని వాటిని విడుదల చేయాలని ఈడీని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే తన రూ.14.29 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను తిరిగి ఇప్పించాలన్న వై.ఎస్‌.భారతి అభ్యర్థనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వలేమని తోసిపుచ్చింది. బెంగళూరులో సిలికాన్‌ బిల్డర్స్‌కు ఉన్న 1.30 ఎకరాలు, భగవత్‌ సన్నిధికి చెందిన 59 వేల చదరపు అడుగుల భవనం, రేవాన్‌ ఇన్‌ఫ్రాకు చెందిన 9 ఎకరాల భూమిని కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్వీకరించి ఆస్తులను విడుదల చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని