ఇదేం కక్ష!
వేల మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలు రాష్ట్రంనుంచి వెళ్లిపోయినా ఫర్వాలేదు.. ఉపాధి, ఉద్యోగాల్లేక యువత పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా మాకేమీ నష్టం లేదు.. నైపుణ్యమున్న మానవ వనరులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్థిరపడిపోయినా పట్టించుకునేదే లేదు..
పరిశ్రమలపై పగ
కొత్తవి రానివ్వరు
ఉన్నవాటిని బతకనివ్వరు
ఇదీ వైకాపా ప్రభుత్వ తీరు
మానవ వనరులు తరలిపోతున్నా పట్టదు
వేల కోట్ల ఆదాయం కోల్పోతున్నా చింతలేదు
ఈనాడు - అమరావతి
వేల మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలు రాష్ట్రంనుంచి వెళ్లిపోయినా ఫర్వాలేదు..
ఉపాధి, ఉద్యోగాల్లేక యువత పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా మాకేమీ నష్టం లేదు..
నైపుణ్యమున్న మానవ వనరులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్థిరపడిపోయినా పట్టించుకునేదే లేదు..
వారి నైపుణ్యాన్ని, మేధాశక్తిని ఆ రాష్ట్రాభివృద్ధికి ధారపోసినా మాకేమీ పట్టదు..
వారి సేవల్ని వాడుకుని ఆ రాష్ట్రాలు ఆర్థికంగా ఎదుగుతున్నా బెంగపడం..
మాకు కావలసిందల్లా ఒకటే.. గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమేదీ రాష్ట్రానికి రావడానికి వీల్లేదు. పెట్టుబడులు, పరిశ్రమల్లేక రాష్ట్రం నష్టపోయినా పర్వాలేదుగానీ.. గత ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి ఘనతా దక్కకూడదు!
ప్రతిపక్ష పార్టీ వారి పరిశ్రమలనయితే ముందే తరిమికొట్టేయాలి... వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేయాలి.. రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ వచ్చినా అది మనోళ్లదే అయిఉండాలి.. ఇదీ మూడున్నరేళ్లుగా వైకాపా ప్రభుత్వ వైఖరి. అదే ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి శాపంగా మారింది. పొరుగు రాష్ట్రాలన్నీ పారిశ్రామిక, సేవా రంగాల్లో శరవేగంగా దూసుకుపోతుంటే... ఆంధ్రప్రదేశ్ మాత్రం రాన్రానూ తిరోగమనంలోకి జారిపోతోంది. కొత్త పరిశ్రమల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయకపోగా, గతంలో వచ్చిన పరిశ్రమలను కక్షసాధింపుతో తరిమికొడుతుండటంతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. రాష్ట్రంలో 14 ఏళ్లలోపు పిల్లల సంఖ్య ఏటికేడాది తగ్గిపోతోందన్న కేంద్ర సర్వేల లెక్కలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల్లేక యువత వలసపోవడమే దీనికి కారణమని, ఇదే ధోరణి కొనసాగితే రాబోయే ఒకటి రెండు దశాబ్దాల్లో ఏపీ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టూ లేదు!
ఒక భారీ పరిశ్రమ వచ్చిందంటే దానికి అనుబంధంగా అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. వాటిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఆ చుట్టుపక్కలే ఆవాసం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడో పట్టణమే అవతరిస్తుంది. క్రమంగా అదో నగరంగా ఎదుగుతుంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. ఆ డబ్బుతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు! రాష్ట్ర భవిష్యత్తుపై నిజమైన అక్కర, శ్రద్ధ, నిబద్ధత ఉన్న ఏ ప్రభుత్వమైనా పరిశ్రమల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. వైకాపా ప్రభుత్వం మాత్రం.. పచ్చటి చెట్లలా ఎదిగి, వేల మందికి నీడనిస్తున్న పరిశ్రమల్ని కూకటివేళ్లతో పెకిలించేయాలని చూస్తోంది. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు.. కక్ష తీరడమే తమకు ముఖ్యమని పదేపదే నిరూపిస్తోంది. తాజాగా అమరరాజా పరిశ్రమ రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులను తెలంగాణకు తరలించడానికీ ఈ వైఖరే కారణమైంది.
పాడికుండను కాలదన్నడమే!
ఒక భారీ పరిశ్రమతో కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. ఉదాహరణకు రూ.10 వేల కోట్లతో ఒక పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 8 వేల మందికి ఉపాధి లభిస్తుంది. అంటే 8 వేల కుటుంబాల్లోని సుమారు 25 వేల మంది నేరుగా ఆ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నట్టే. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసేవారు, వారిపై ఆధారపడి బతికే వివిధ వృత్తులవారు లక్షల్లో ఉంటారు. అలాంటి పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడమంటే పాడికుండను కాలదన్నినట్టేనని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. వారి విశ్లేషణ ప్రకారం.. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటైతే వార్షిక టర్నోవర్పై ఆ పరిశ్రమ చెల్లించే జీఎస్టీ, ఉద్యోగులు వారి వేతనాల్ని వివిధ అవసరాల కోసం ఖర్చు చేసినప్పుడు చెల్లించే పన్నులు, పరిశ్రమ, ఉద్యోగులు చెల్లించే ఆదాయపన్ను, ఇతర పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఏటా రూ.800 కోట్లకుపైనే ఆదాయం వస్తుందని అంచనా. మొదటి అయిదేళ్లలో ప్రభుత్వం ఇచ్చే రాయితీలను బట్టి ఈ ఆదాయంలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు. అయితే ప్రభుత్వానికి పరోక్షంగా మరింత ఆదాయం సమకూరుతుంది.
ఐటీ కంపెనీలొస్తే.. మూడు పువ్వులు ఆరు కాయలే
తయారీ రంగంతో పోలిస్తే సేవారంగంలో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. ముఖ్యంగా ఐటీ వంటి రంగాల్లో వేతనాలూ ఎక్కువగా ఉంటాయి. అలాంటి రంగాలు అభివృద్ధి చెందే కొద్దీ ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు పెడుతుంది. రూ.100 కోట్ల పెట్టుబడితో ఒక ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా. వారిపై ఆధారపడిన మరో 3-4 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. సగటున ఒక్కో ఐటీ ఉద్యోగికి సంవత్సరానికి కనీసం రూ.4 లక్షల జీతం ఇస్తారనుకున్నా.. రూ.40 కోట్లు అవుతుంది. ఓ మాదిరి ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఓ స్థాయి ఉద్యోగికి ఏడాదికి రూ.15 లక్షలు చెల్లిస్తున్నాయి. ఆ లెక్కన వేసుకుంటే వారికిచ్చే జీతం రూ.150 కోట్లవుతుంది.
* ఐటీ రంగంలో ఒక ఉద్యోగిపై కంపెనీ సగటున రూ.40 లక్షల వరకు టర్నోవర్ చేస్తుందని అంచనా. దానిపై కట్టే జీఎస్టీ, లాభాలపై చెల్లించే ఆదాయపన్ను రూపంలో ప్రభుత్వానికి డబ్బే డబ్బు.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఉన్న పరిశ్రమల్నే వెళ్లగొడుతోంది. పారిశ్రామికవేత్తల్ని భయపెడుతోంది. రాజకీయ ప్రత్యర్థుల కర్మాగారాలపై కక్ష సాధిస్తోంది. ఫలితంగా.. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. తాజాగా అమరరాజా సంస్థ చిత్తూరు జిల్లాలో పెట్టాల్సిన రూ.9,500 కోట్లను తెలంగాణలో పెడుతోంది. జాకీ దుస్తుల తయారీ పరిశ్రమా తెలంగాణకే తరలిపోయింది. రిలయన్స్ గుడ్బై చెప్పేసింది. ఇలా ఒకటా రెండా.. పెద్ద పెద్ద కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఐటీ రంగాన్నీ వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. విశాఖలోని స్టార్టప్ విలేజ్ ఖాళీ అయిపోయింది. డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ విధానంలో ఇచ్చే 50 శాతం రాయితీని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల్ని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాల్లో ఇచ్చిన రాయితీల్ని తొలగించింది. ఇక్కడి వాతావరణం చూసి.. రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి నెలకొంది.
* తెలంగాణలోని ఐటీ, ఐటీఈఎస్... కంపెనీల్లో ప్రస్తుతం సుమారు 8 లక్షల మంది పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టుమని పాతిక వేల మంది కూడా లేరు. వారిలోనూ అత్యధిక మందికి నెల జీతం రూ.15 వేల నుంచి రూ.20 వేల లోపే.
మిగిలేది వృద్ధులే..
రాష్ట్రంలో ఉపాధినిచ్చే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు లేకపోవడంతో మెజారిటీ యువతంతా విదేశాలకు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలసపోతున్నారు. అక్కడే వివాహాలు చేసుకుని, స్థిరపడి పోతున్నారు. వారి సంపాదనంతా ఆయా నగరాల్లోనే ఖర్చు పెడుతున్నారు. అక్కడే ఇళ్లు కొనుక్కుంటున్నారు. రాబోయే రోజుల్లో యువతరం వలసలు ఇంకా పెరిగితే, రాష్ట్రంలో మిగిలేది వృద్ధులేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* కేంద్ర గణాంకశాఖ 2019 గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో నాలుగేళ్లలోపు పిల్లలు 5.5 శాతం. జాతీయ సగటు 7.8 శాతం. పద్నాలుగేళ్లలోపు పిల్లలు జాతీయ సగటు 25.4% కాగా రాష్ట్రంలో 19.4 శాతమే ఉంది.
* 2020లో నాలుగేళ్లలోపు పిల్లల జాతీయ సగటు 7.5 శాతం ఉంటే రాష్ట్ర జనాభాలో 5.3 శాతమే. 0-14 సంవత్సరాల పిల్లల సంఖ్య జాతీయ సగటు 24.8 శాతం ఉంటే రాష్ట్రంలో 19 శాతమే ఉండటం గమనార్హం.
* రాష్ట్రంలో ప్రతి వెయ్యి జనాభాలో నాలుగేళ్లు, ఆలోపు పిల్లలు 53 మంది మాత్రమే ఉంటే, బిహార్ 110, ఉత్తరాఖండ్లో 101గా ఉండటం విశేషం. మనకంటే వెనుకబడ్డ రాష్ట్రాలతో పోల్చినా మన రాష్ట్రంలో జనాభాలో సమతౌల్యం లోపిస్తోందని అర్థ్ధమవుతోంది. ఇక్కడ తగినన్ని ఉపాధి అవకాశాలు లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
వెళ్లేవారే తప్ప వచ్చేవారేరీ?
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో 30-40 శాతం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన అత్యంత నైపుణ్యంగలవారు (హైలీ స్కిల్డ్ మైగ్రెంట్) ఉంటారు. అత్యంత నైపుణ్యమున్నవారు బయటి ప్రాంతాల నుంచి వచ్చి పనిచేయడాన్ని అక్కడ ఆ రంగ పురోభివృద్ధికి ఒక సూచీగా పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దానికి పూర్తి భిన్నం. నిపుణులు బయటి నుంచి రావడం దేవుడెరుగు.. ఇక్కడ చదువుకున్న పిల్లలకే ఉపాధిలేక తరలిపోతున్నారు. ఏపీలో ఐటీ కంపెనీల్లో రూ.15 వేలు వచ్చేవారికి కూడా హైదరాబాద్ వంటి చోట్ల కనీసం రూ.30 వేల వేతనం దొరుకుతోంది. దీంతో అందరూ అటే పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి ఐటీ కంపెనీల్లోనూ అత్యంత నిపుణులైన సిబ్బంది లేక అంత విలువైన ప్రాజెక్టులు రావడం లేదు.
రూ.10 వేల కోట్లతో అద్భుతాలు చేయొచ్చు..!
రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసక ధోరణిని వీడి.. కనీసం గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు జరిగిన పరిశ్రమలైనా ప్రారంభమయ్యేలా చేయగలిగితే, వాటి నుంచి వివిధ రూపాల్లో ఇప్పటికే ఏటా రూ.10 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం లభించేది. రాజధాని నిర్మాణ పనులు కొనసాగించి ఉంటే అక్కడ జరిగే నిర్మాణాల వల్లే ప్రభుత్వానికి ఏటా కనీసం రూ.5-6 వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారి, అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల ఆదాయం అదనంగా వస్తే చాలా అద్భుతాలు చేయొచ్చు. మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచొచ్చు. నిధుల కొరత పేరుతో ప్రభుత్వం నిలిపివేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించొచ్చు.
* ప్రైవేటు కళాశాలల్లో పోస్ట్గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం 2020-21 నుంచి బోధన రుసుముల చెల్లింపు నిలిపివేసింది. పాత బకాయిలు రూ.400 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వారందరికీ నిక్షేపంగా బోధన రుసుములు చెల్లించొచ్చు.
* 2020-21లో కరోనాతో కళాశాలలు సరిగా నిర్వహించలేదంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నాలుగో త్రైమాసిక ఫీజు దాదాపు రూ.650 కోట్లను ప్రభుత్వం చెల్లించలేదు. వీటిని విద్యార్థుల నుంచి కళాశాలలు వసూలు చేసుకున్నాయి. విద్యార్థులకు ఆ ఫీజు ప్రభుత్వమే చెల్లించొచ్చు. నాడు-నేడు వంటి కార్యక్రమాల్ని జాప్యం లేకుండా పూర్తి చేయొచ్చు.
* రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులకు మరమ్మతులు చేయొచ్చు.
* వెనుకబడిన ప్రాంతాల్లోని వెలుగొండ, ఉత్తరాంధ్రలోని వంశధార రెండో భాగం రెండో దశ, వంశధార-నాగావళి అనుసంధానం, చింతలపూడి ఎత్తిపోతలు వంటి పథకాల్ని పూర్తి చేయొచ్చు.
* ఏటా రూ.3 వేల కోట్లు ఖర్చు పెడితే.. రైతులకు రాయితీపై ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందించవచ్చు. బిందు, తుంపర సేద్య పరికరాలను రాయితీపై పెద్దఎత్తున అందించడం ద్వారా నీటి సంరక్షణతోపాటు రైతులకు పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంపొందించవచ్చు. ఏడాదికి రూ.50 కోట్లతో సూక్ష్మపోషకాలను ఉచితంగా అందిస్తే రైతులు అధిక దిగుబడులు సాధించే వీలుంటుంది.
* రూ.5 వేల కోట్లు ఖర్చుపెడితే.. రాష్ట్రంలోని నిరుపేదల కుటుంబాలకు నెల నెలా నిత్యావసరాలను రాయితీపై అందించవచ్చు.
భారీ కర్మాగారం వస్తే.. ఒక నగరాన్ని నిర్మించినట్టే
ఒక భారీ కర్మాగారం ఏర్పాటైతే అక్కడో చిన్న పట్టణమైనా ఏర్పాటవుతుంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ వచ్చి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఏర్పాటయ్యాక సైబరాబాద్ ఆవిర్భవించింది. విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటయ్యాక ఉక్కునగరమే పురుడుపోసుకుంది.
* ఒక భారీ పరిశ్రమ ఏర్పాటై 3-4 వేల మందికి ఉపాధి లభిస్తే అన్ని వేల కుటుంబాలు అక్కడే ఉంటాయి. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, నిత్యావసరాల దుకాణాలు, సినిమా హాళ్లు.. ఇలా అనేకం వస్తాయి. అనేక వృత్తులవారికి ఉపాధి లభిస్తుంది.
* ఒక ఉద్యోగికి నెలకు రూ.లక్ష జీతం వస్తుందనుకుంటే.. దానిలో రూ.10-15 వేల పన్నులు, పీఎఫ్ రూపంలో పోయినా రూ.85 వేల వరకు చేతికి వస్తుంది. దానిలో రూ.25-30 వేలు మదుపు చేసినా... రూ.55-60 వేలు ఖర్చు చేస్తారు. ఎన్నో రంగాలవారికి ఉపాధి దొరుకుతుంది. వారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిపై ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వెళుతుంది.
* రూ.లక్ష వేతనం వచ్చేవారు..గూడు అమర్చుకోవాలని చూస్తారు. వారి కోసం ఇళ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతుంది. నిర్మాణరంగంపై ఆధారపడే 50-60 రకాల వ్యాపారాల వారికీ ఉపాధి లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు