విశాఖ స్టీల్‌, సింగరేణికి తగ్గిన కేటాయింపులు

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో పెద్దగా ప్రయోజనమేమీ దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమైన పోలవరం, దక్షిణ కోస్తా రైల్వేలకు కేటాయింపుల ప్రస్తావన లేదు.

Published : 02 Feb 2023 03:39 IST

కనిపించని కొత్త రైల్వే జోన్‌ప్రస్తావన
ఈనాడు - దిల్లీ

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో పెద్దగా ప్రయోజనమేమీ దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమైన పోలవరం, దక్షిణ కోస్తా రైల్వేలకు కేటాయింపుల ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్‌, సింగరేణి బొగ్గు గనులకు గతేడాదికంటే కేటాయింపులు తగ్గాయి. ప్రస్తుతం ప్రైవేటు జాబితాలో చేరిన విశాఖ స్టీల్‌కు 2022-23లో రూ.910 కోట్లు కేటాయించి అంచనాల సవరణనాటికి రూ.603 కోట్లకు తగ్గించారు. ఇప్పుడు 2023-24లో కేటాయింపులను రూ.683 కోట్లకు పరిమితం చేశారు. సింగరేణికి రూ.2వేల కోట్లు కేటాయించి అంచనాల సవరణనాటికి రూ.1,600 కోట్లు మాత్రమే వెచ్చించిన బొగ్గు శాఖ తాజా బడ్జెట్‌లో కేటాయింపులను రూ.1,650 కోట్లకే పరిమితం చేసింది. విశాఖపట్నం పోర్టుకు ఇదివరకు రూ.207.99 కోట్లు కేటాయించిన నౌకాయానశాఖ అంచనాల సవరణనాటికి దాన్ని రూ.155.39 కోట్లకు తగ్గించింది. తాజా బడ్జెట్‌లో రూ.337.69 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. 2016 తర్వాత ఈ ప్రాజెక్టుకు నిధులను నాబార్డు నుంచి తీసుకున్న రుణం ద్వారా అందిస్తామని కేంద్రం చెబుతూ వస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది రూ.3,875 కోట్లను కేటాయించింది. ఇందులో పోలవరానికి ఎంతిస్తారన్నది ఎక్కడా చెప్పలేదు. 2022-23లో ఈ పద్దు కింద రూ.4,585 కోట్లు కేటాయించిన జల్‌శక్తి శాఖ అంచనాల సవరణ నాటికి దాన్ని రూ.3,875 కోట్లకు కుదించింది. రైల్వే మంత్రిత్వశాఖ పద్దుల్లో విశాఖ కేంద్రంగా ఏర్పాటుచేసే దక్షిణ కోస్తా రైల్వే ప్రస్తావన లేదు. ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఏపీ, తెలంగాణల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు, వైజాగ్‌ పెట్రోలియం వర్సిటీ, హైదరాబాద్‌ ఐఐటీలకు మాత్రమే ప్రత్యేక కేటాయింపులు జరిపింది. మిగిలిన ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్‌ఈ, ఎన్‌ఐటీ, ఎయిమ్స్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లాంటి సంస్థలకు దేశంలోని అన్ని విద్యాలయాలతోపాటు కేటాయింపులు జరిపింది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఆయా సంస్థలకు ప్రత్యేకంగా ఎంత మొత్తం లభించాయన్న వివరాలు కనిపించ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని