Summer: ఈసారి.. మండే కాలం?

వరుస ఎన్నికలతో దేశంలో పెరుగుతున్న రాజకీయ వేడికి ఈసారి వాతావరణం కూడా తోడయ్యేలా ఉంది.

Updated : 05 Feb 2023 10:53 IST

2023లో ఎల్‌ నినో వస్తోందంటున్న శాస్త్రవేత్తలు
భారత్‌లో రుతుపవనాలపై ప్రభావం చూపేనా?

వరుస ఎన్నికలతో దేశంలో పెరుగుతున్న రాజకీయ వేడికి ఈసారి వాతావరణం కూడా తోడయ్యేలా ఉంది. 2023లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కారణం- ఎల్‌ నినో! గత రెండున్నరేళ్లుగా సాగుతున్న లా నినా పోయి... మళ్లీ ఎల్‌ నినో ఈఏడాది రాబోతుండటమే ఇందుకు కారణం.

వాతావరణంలో సంభవించే పరస్పర విరుద్ధ పరిణామాలే ఈ ఎల్‌ నినో, లా నినా! ఇవి రెండూ స్పానిష్‌పేర్లు. భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితలంపై అసాధారణ వేడి లేదా... చల్లదనం లాంటివి నమోదవుతుంటాయి. ఈ పరిణామాలను ఎల్‌ నినో సదరన్‌ ఆసిలేషన్‌ సిస్టమ్‌ (ఇఎన్‌ఎస్‌ఓ) అంటుంటారు. ఈ ఇఎన్‌ఎస్‌ఓ పరిస్థితులు... ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలను, వర్షపాతాలను ప్రభావితం చేస్తాయి. ఎల్‌ నినో అయితే విపరీతమైన వేడి, తక్కువ వర్షపాతం నమోదవుతుంటుంది. లా నినాలో వర్షాలు విపరీతంగా ఉంటాయి. ఈ రెండు పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటిగా... ప్రతి నాలుగైదేళ్ల భ్రమణంలో సంభవిస్తుంటాయి. సాధారణంగా ఎల్‌ నినో ఎక్కువగా సంభవిస్తుంటుంది. అయితే అందుకు భిన్నంగా గత మూడేళ్లుగా లా నినా ప్రభావం ఎక్కువ కనిపించింది. లా నినా ఇంత సుదీర్ఘంగా కొనసాగటం ఈ వందేళ్లలో ఇదే తొలిసారి అంటున్నారు శాస్త్రవేత్తలు! ఇప్పటికే పెరుగుతున్న భూతాపం, భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్‌ మహాసముద్రంలో వేడెక్కుతున్న సముద్ర ఉపరితలాన్ని ఈసారి ఎల్‌ నినో సంకేతాలుగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయార్ధానికి దీని ప్రభావం ఉంటుందని అంచనా.

భారత్‌లో ఎలా?: ద్వితీయార్ధానికి ఎల్‌ నినో అంటే... భారత్‌లో నైరుతి రుతుపవనాలపై ప్రభావం పడొచ్చన్నది అంచనా. గతంలో ఎల్‌ నినో కాలంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 80శాతం ఎల్‌ నినో పరిస్థితుల్లో దేశంలో వర్షపాతం సాధారణంకంటే తక్కువ నమోదై అనేక చోట్ల కరవు పరిస్థితులు తలెత్తాయి. 2009లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. తూర్పు, మధ్య, ఉత్తర భారత్‌ల్లో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరవు పరిస్థితులు తలెత్తాయి. అయితే భారతీయ వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం ఈసారి ఎల్‌ నినో ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమంటున్నారు. ‘కొన్ని పద్ధతుల ఆధారంగా ఈ ఏడాది ఎల్‌ నినో వస్తుందని అనుకుంటున్నారు. కానీ భారత్‌లో రుతుపవనాలపై దాని ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. ఇంత ముందుగా వేసే అంచనాలు గురి తప్పే అవకాశాలే ఎక్కువ. అయితే గతంలో ఎల్‌ నినో వచ్చిన సందర్భాల్లో చాలామటుకు భారత రుతుపవనాలపై ప్రభావం చూపింది. ఈసారి ఎలాంటి ప్రభావం ఉంటుందనేది మార్చినాటికి స్పష్టత రావొచ్చు’ అని భారత వాతావరణ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఎల్‌ నినో కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా సంభవించొచ్చని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఎల్‌ నినో విషయంలో అన్ని రాష్ట్రాలూ దీర్ఘ, స్వల్పకాల ప్రణాళికలతో సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు నొక్కిచెబుతున్నారు.


ఆ 1.5 దాటేస్తామా?

ప్రపంచ దేశాలన్నీ ప్రతిన పూనిన ‘1.5 డిగ్రీల సెల్సియస్‌ గీత’ కూడా ఈసారి దాటి పోతామేమోననే ఆందోళనా వ్యక్తమవుతోంది. పారిశ్రామిక విప్లవం నాటితో పోలిస్తే ఇప్పటికి భూతాపం ఒక డిగ్రీ సెంటిగ్రేడ్‌ పెరిగింది. కాలుష్యం, ప్రమాదకర ఉద్గారాలు ఇందుకు కారణం. ఈ మాత్రం దానికే అనేక పర్యావరణ దుష్ఫలితాలను ప్రపంచం చవిచూస్తోంది. ధ్రువాల వద్ద మంచు కరుగుతోంది, సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోకుండా, 1.5 దగ్గరే ఆపాలన్నది ప్రపంచ దేశాలన్నీ కలసి తీసుకున్న నిర్ణయం. ఆ దిశగా కర్బన ఉద్గారాలు తగ్గించాలని తీర్మానించాయి కూడా. కానీ ఆచరణలో అది నత్తనడకన సాగుతుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతూనే ఉన్నాయని శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తంజేస్తున్నారు. ఎల్‌ నినో ప్రభావంతో ఈసారే 1.5 లక్ష్మణరేఖను దాటినా దాటొచ్చనే వాదన వినిపిస్తున్నారు.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని