బ్రహ్మయ్య అండ్‌ కొ పిటిషన్‌పై యథాతథస్థితి ఉత్తర్వుల పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శిపై నమోదైన కేసులో భాగంగా బ్రహ్మయ్య అండ్‌ కొ ఆడిట్‌ కంపెనీలో సీఐడీ నిర్వహించిన సోదాలు, స్వాధీనం చేసుకున్న సమాచారానికి సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలంటూ మార్చి 29న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏప్రిల్‌ 13 దాకా పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 01 Apr 2023 06:28 IST

మార్గదర్శి కేసులన్నింటిలోనూ కౌంటర్లు దాఖలు చేయండి
ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం
ఈనెల 13కు విచారణ వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శిపై నమోదైన కేసులో భాగంగా బ్రహ్మయ్య అండ్‌ కొ ఆడిట్‌ కంపెనీలో సీఐడీ నిర్వహించిన సోదాలు, స్వాధీనం చేసుకున్న సమాచారానికి సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలంటూ మార్చి 29న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏప్రిల్‌ 13 దాకా పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బ్రహ్మయ్య అండ్‌ కొ దాఖలుచేసిన మధ్యంతర పిటిషన్‌తో పాటు ప్రధాన పిటిషన్‌లోనూ కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌తో పాటు హైదరాబాద్‌ మార్గదర్శి కార్యాలయంలో సోదాలు, ఇతర అంశాలపై దాఖలుచేసిన నాలుగు పిటిషన్లలోనూ కౌంటర్లు దాఖలు చేయాలంది. వీటన్నింటిపైనా 13వ తేదీన విచారణ చేపడతామని పేర్కొంది. సోదాల నిమిత్తం మార్చి 28న ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ బ్రహ్మయ్య అండ్‌ కొ భాగస్వామి పి.చంద్రమౌళి దాఖలుచేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.నళిన్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ కంపెనీ నుంచి 7 డెస్క్‌టాప్‌లు, 12 ల్యాప్‌టాప్‌లు, 2 హార్డ్‌డిస్క్‌ల్లోని సమాచారాన్ని కాపీ చేసుకున్నారన్నారు. కేవలం మార్గదర్శికి చెందిన సమాచారమే కాకుండా, తమ ఖాతాదారులందరిదీ కాపీ చేసుకున్నారన్నారు. దీంతోపాటు కొన్ని పత్రాలనూ తీసుకెళ్లారన్నారు. పంచనామా కూడా ఇవ్వలేదన్నారు. తమ ఖాతాదారులందరికీ చెందిన సమాచారం ఉందని, దాన్ని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఏపీ తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి అభ్యంతరం చెబుతూ మార్గదర్శి, సంబంధిత కంపెనీల సమాచారాన్ని మాత్రమే తీసుకెళ్లామన్నారు. ఇతర కంపెనీల సమాచారం తమకు అవసరం లేదన్నారు. పంచనామా నిర్వహించామని, ఏం స్వాధీనం చేసుకున్నామన్న సమాచారాన్ని మేజిస్ట్రేట్‌కు ఇచ్చామన్నారు. ఆడిట్‌ కంపెనీ కొన్ని పత్రాలను దాచిపెడుతుండటంతో సోదాలు చేయాల్సి వచ్చిందన్నారు. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేస్తూ పంచనామాలో పూర్తి వివరాలను పేర్కొనకపోవడంతో సంతకం చేయలేదన్నారు. కాగితాలు, డిస్క్‌లు అన్నారు తప్ప అందులో ఏం వివరాలు ఉన్నాయో చెప్పలేదన్నారు. ప్రస్తుతం వారి వాదనను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తే సమాచారమంతా బయటపెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి సమాచారాన్ని విభజన చేసి తీసుకోవాలని, అది పిటిషనర్ల ముందు జరగాల్సి ఉందన్నారు. మిగిలిన పిటిషన్ల గురించి ఆరా తీయగా... సోదాలకు సంబంధించి మార్గదర్శి పిటిషన్లు దాఖలు చేసిందని, దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎం.వి.దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఏపీ ప్రభుత్వం నమోదుచేసిన కేసులను కొట్టేయాలంటూ మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన తెలంగాణ హైకోర్టు... కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసినట్లు వారి తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌, న్యాయవాది విమల్‌ వాసిరెడ్డి తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి మార్చి 29న బ్రహ్మయ్య అండ్‌ కొ అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్‌పై సమయం లేక పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేదని, ప్రస్తుతం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ప్రధాన పిటిషన్‌తో పాటు శుక్రవారం దాఖలుచేసిన మధ్యంతర పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటామని, దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 13వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని