Vijayawada Metro: విజయవాడ మెట్రోకు ఉరి

అది రాజధాని అమరావతి కావొచ్చు... విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కావొచ్చు... రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే మరే ఇతర ప్రాజెక్టయినా కావొచ్చు... గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదిస్తే ఇక అంతే.. దానికి పాతరేసే వరకూ జగన్‌ ప్రభుత్వం నిద్రపోదు.

Updated : 31 May 2023 07:19 IST

భూసేకరణ ప్రతిపాదన రద్దుచేసిన ప్రభుత్వం
ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ప్రాజెక్టు ఇక పూర్తిగా అటకెక్కినట్లే
ఈనాడు - అమరావతి

ది రాజధాని అమరావతి కావొచ్చు... విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కావొచ్చు... రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే మరే ఇతర ప్రాజెక్టయినా కావొచ్చు... గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదిస్తే ఇక అంతే.. దానికి పాతరేసే వరకూ జగన్‌ ప్రభుత్వం నిద్రపోదు. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను ఆపేయడం, మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతీయడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడమే అందుకు తాజా నిదర్శనం. ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం ఈ ప్రభుత్వానికి సుతరామూ ఇష్టం లేదు.

దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి, ఎలా తొక్కిపెట్టాలన్నదానిపైనే మొదటి నుంచీ దృష్టిపెట్టింది. విభజన చట్టం ప్రకారం కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి హక్కుగా సాధించుకోవాల్సిన మెట్రోరైలు ప్రాజెక్టు ప్రతిపాదనలకు అంచెలంచెలుగా తూట్లు పొడుస్తూ వచ్చిన జగన్‌ ప్రభుత్వం... ఆ ప్రాజెక్టు నిర్మాణానికి విజయవాడ గ్రామీణ మండలంలోని ఎనికేపాడు గ్రామ పరిధిలో 3,272.55 చదరపు గజాల భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఇందుకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ విస్తీర్ణం చూడటానికి చిన్నదిగానే కనిపించినా.. ఈ భూసేకరణ ఇక లేదని చెప్పడం ద్వారా, అసలు మెట్రోరైలు ప్రాజెక్టును చేపట్టకూడదన్న ప్రభుత్వ ఉద్దేశం బయటపడుతోంది. దీంతో విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించినట్టే!

గత ప్రభుత్వం 2017లో మెట్రో రైలు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దానిలో భాగంగా ఎనికేపాడు పరిధిలోని వివిధ సర్వే నంబర్లలోని 3,272.55 చదరపు గజాల్ని తీసుకోవాలని నిర్ణయించింది. వాటిలో కొంత గ్రామకంఠం భూమితో పాటు, వివిధ వ్యక్తులకు చెందిన ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఆ భూసేకరణ ప్రతిపాదన రద్దుచేస్తూ కలెక్టర్‌ ఇప్పుడు ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన భూసేకరణ ముసాయిదా నోటిఫికేషన్‌ గడువు 2019లోనే ముగిసిందని, భవిష్యత్తులో రాష్ట్రప్రభుత్వం మెట్రోరైలు ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే... అప్పుడు మళ్లీ కొత్త నోటిఫికేషన్‌ జారీచేస్తామని కలెక్టర్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూసేకరణ నోటిఫికేషన్‌ పరిధిలో ఉండటంతో ఆయా స్థలాల యజమానులు ఇబ్బంది పడుతున్నారని, అందుకే రద్దు చేశామని తెలిపారు.

నోటిఫికేషన్‌ రద్దు చేస్తే తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్‌ మెట్రోరైలు కార్పొరేషన్‌ కూడా స్పష్టం చేసినట్టు తెలిపారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై జగన్‌ ప్రభుత్వం సానుకూల నిర్ణయమేదీ తీసుకునే ఆలోచనలో లేదని దీన్నిబట్టే అర్థమవుతుంది. ఎంతో అధ్యయనం, కసరత్తు చేసి విజయవాడ మెట్రోరైలు మార్గాన్ని గత ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే భూసేకరణకు ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ భూమిని భూసేకరణ నుంచి తప్పిస్తే... వాటి యజమానులు అక్కడ భవనాలు నిర్మించుకోవచ్చు. భవిష్యత్తులో మరో ప్రభుత్వం వచ్చి మెట్రోరైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అప్పుడు అక్కడ భూసేకరణ చేయగలదా? ఒకసారి భవనాలు నిర్మించుకున్నాక భూసేకరణ చాలా సంక్లిష్టం అవుతుంది. ఇవన్నీ ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు?

విజయవాడపై ఎందుకంత కక్ష?

విజయవాడలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది వైకాపా అధికారంలోకి వచ్చాకేనని కొన్ని నెలల క్రితం అసెంబ్లీలో జగన్‌ అలవోకగా అబద్ధాలు చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో విజయవాడలో చేసిన అభివృద్ధి ఏంటి? మెట్రో ప్రాజెక్టుకు తూట్లు పొడవడమా? ఇప్పటికే విజయవాడలో భాగంగా ఉన్న గొల్లపూడి, పెనమలూరు, గన్నవరం లాంటి ప్రాంతాల్ని కలిపి గ్రేటర్‌ విజయవాడగా చేయాల్సింది పోయి... నగరంలో భాగంగా ఉన్న ప్రాంతాల్ని ప్రత్యేక మున్సిపాలిటీలుగా చేయడమా? విజయవాడ నగరపాలక సంస్థలో భాగంగా ఉన్న ప్రాంతాల్ని, విజయవాడకు అత్యంత సమీపంలోని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్ని కలిపితే... జనాభా 25 లక్షలకు పైనే ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాలకు మెట్రో రైలు ప్రాజెక్టు అత్యవసరం. విజయవాడ బెంజి సర్కిల్‌లో పై వంతెనలు కట్టినా... ఇంకా ట్రాఫిక్‌ కష్టాలు తీరలేదు. రాబోయేరోజుల్లో నగరంలో ట్రాఫిక్‌ రద్దీ బాగా పెరగనున్నందున... ప్రజలు సౌకర్యవంతంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో రైలు లాంటి మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ తప్పనిసరిగా కావాలి. మెట్రో రైలును కేవలం ప్రజారవాణా సదుపాయంగా మాత్రమే చూడకూడదు.

మెట్రోరైలు లాంటి భారీ ప్రాజెక్టు వస్తే... నిర్మాణ వ్యయంలో సుమారు 38-40% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వెళుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేలమందికి ఉపాధి లభిస్తుంది. ఆ పరిసరాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. మెట్రో రైలులో ప్రయాణం అంటే విలాసం కాదు. ఉద్యోగులకో, ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగపడేదీ కాదు. చిరుద్యోగులు, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వెళ్లే పేద వర్గాలకూ మెట్రో రైలు ఎంతో ఉపయుక్తం. హైదరాబాద్‌ విషయంలో ఇది ఇప్పటికే రుజువైంది. విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లేందుకు అక్కడి మెట్రోరైలును విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలున్న మెట్రోరైలు ప్రాజెక్టుకు జగన్‌ ప్రభుత్వం పాతరేయడం విజయవాడపై కక్ష కాకపోతే మరేంటి?

31 మంది ఎంపీలుండి... ఏం ఉపయోగం?

రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలోగా, విజయవాడ, విశాఖల్లో మెట్రోరైళ్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ఆ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వం విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై విస్తృత కసరత్తు చేసి, కేంద్రానికి నివేదికలు పంపింది. కేంద్ర ప్రభుత్వం 2017 మెట్రోరైలు పాలసీ ప్రకారం మళ్లీ ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రానికి సూచించింది. దానిపై కసరత్తు జరుగుతుండగానే... వైకాపా అధికారంలోకి వచ్చింది. అక్కడితో విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఉరితాడు బిగించడం మొదలైంది. విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ఇంత వరకు కేంద్రానికి ప్రతిపాదన పంపలేదు.

‘‘మెట్రోరైలు ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, సమగ్ర రవాణా ప్రణాళిక, వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) వంటివి సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుకు... కొత్త మెట్రోరైలు పాలసీ-2017 ప్రకారం సవరించిన ప్రతిపాదనలు పంపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని 2017 సెప్టెంబరు 1న కోరాం. ఇంత వరకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదు’’ అని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి 2022 డిసెంబరు 12న రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సహా విభజన హామీలన్నీ సాధిస్తానని జబ్బలు చరిచిన జగన్‌... ఆయన పార్టీకి లోక్‌సభ, రాజ్యసభలో కలిపి 31 మంది ఎంపీలున్నా... విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం ఒత్తిడి తెచ్చిన దాఖలాల్లేవు. అసలు ప్రతిపాదన పంపడమే ఇష్టం లేని జగన్‌ ప్రభుత్వం ఇక ఒత్తిడేం తెస్తుంది.


ఝార్ఖండ్‌.. ఒడిశా.. ఏపీ..

ఇంతవరకు మెట్రోరైళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు, ఈశాన్య రాష్ట్రాలు, ఝార్ఖండ్‌, ఒడిశా వంటివి కొన్నే ఉన్నాయి. ఈ విషయంలో ఏపీని అత్యంత వెనుకబడిన రాష్ట్రాల సరసన నిలిపిన ఘనత జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. జమ్ము, శ్రీనగర్‌, ఠాణె, నాసిక్‌ లాంటి ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ మెట్రో రైళ్ల ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. గోరఖ్‌పూర్‌, దేహ్రాదూన్‌ లాంటి చిన్న నగరాలూ పోటీ పడుతున్నాయి. ఇక ఇప్పటికే మెట్రోరైలు ఉన్న నగరాల్లో దాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. దక్షిణాదినే ఉన్న హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లో మెట్రోను ఆయా నగరాల్లోని అన్ని ప్రాంతాలకూ మరింత చేరువ చేస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం వచ్చే మెట్రోకూ మోకాలడ్డుతున్న పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని