ఇళ్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పనులు అదానీకి

గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. అదానీకి పనులు అప్పగించడంపై అడుగులు ముందుకు వేసంది.

Published : 03 Jun 2023 05:41 IST

లెటర్‌ ఆఫ్‌ అవార్డు(ఎల్‌వోఏ)ను ఇచ్చిన డిస్కంలు
ఒక్కొక్క మీటర్‌కు నెలకు రూ.108.56 వంతున ధర ఖరారు
10 ఏళ్ల పాటు వినియోగదారులపై తప్పని భారం
వ్యతిరేకత వస్తున్నా.. వెనక్కు తగ్గని ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. అదానీకి పనులు అప్పగించడంపై అడుగులు ముందుకు వేసంది. ఈ సంస్థకు లెటర్‌ ఆఫ్‌ అవార్డును (ఎల్‌వోఏ) డిస్కంలు శుక్రవారం జారీ చేశాయి. దీంతో మొదటి విడత ప్రతిపాదించిన 27 లక్షల విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు పనులు ప్రారంభించడానికి అవకాశం ఏర్పడింది. ఒక్కొక్క మీటర్‌ ఏర్పాటు, నిర్వహణకు అదానీ సంస్థ బిడ్‌లో కోట్‌ చేసిన ధరలపై డిస్కంలు సంప్రదింపులు జరిపాయి. ఈ ప్రకారం ఒక్కొక్క గృహానికి స్మార్ట్‌ మీటరు, నిర్వహణకు నెలకు రూ.92 వంతున చెల్లించేలా డిస్కంలు అంగీకరించాయి. దీనికి 18 శాతం జీఎస్‌టీ రూ.16.56 కలిపి.. ఒక్కొక్క మీటర్‌కు నెలకు 108.56 వంతున వినియోగదారులు భరించాల్సి వస్తుంది. ఈ లెక్కన 10 ఏళ్లలో.. ఒక్కొక్క వినియోగదారుడు స్మార్ట్‌ భారం రూ.13,027 చొప్పున భరించాల్సి వస్తుంది. ఈ పనులు ప్రారంభించిన తర్వాత రెండో దశలో ప్రతిపాదించిన సుమారు 25 లక్షల కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేసే పనులను కూడా అదానీకే అప్పగించాలని డిస్కంలు నిర్ణయించాయి.

ప్రతిపాదనకు పీఎఫ్‌సీ ఆమోదం

అదానీ సంస్థ బిడ్‌లో కోట్‌ చేసిన ధరలు.. సంప్రదింపుల తర్వాత అంగీకరించిన ధరలు.. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) ఆమోదం కోసం డిస్కంలు పంపాయి. వాటిని పరిశీలించి.. అదానీకి ఎల్‌వోఏ జారీ చేయడానికి పీఎఫ్‌సీ నుంచి ఇటీవల ఆమోదం లభించింది. విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్‌వ్యవస్థీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పథకాన్ని ఆ సంస్థ పర్యవేక్షిస్తోంది. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు డిస్కంలు పిలిచిన టెండర్లకు స్పందించి మూడు సంస్థలు బిడ్‌లు వేశాయి. అందులో ఎల్‌1గా నిలిచిన అదానీ సంస్థ గృహ విద్యుత్‌ కనెక్షన్లకు ఒక్కొక్క దానికి నెలకు రూ.130 వంతున, త్రీఫేజ్‌ మీటరు ఒక్కొక్క దానికి నెలకు రూ.205 వంతున కోట్‌ చేసింది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, నిర్వహణ పనులను కడప జిల్లాకు చెందిన షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు అప్పగిస్తూ ఇప్పటికే డిస్కంలు ఎల్‌వోఏ ఇచ్చిన విషయం విదితమే.  దీంతో వ్యవసాయ, గృహ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రజల నుంచి ఎంతగా వ్యతిరేకత వస్తున్నా రూ.వేల కోట్ల భారాన్ని మోపడంపై ముందుకే వెళ్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని