GST: ఐదు శాతం జీఎస్టీ శ్లాబు ఎత్తివేత?
జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ప్రస్తుతం పరిహారం కింద చెల్లిస్తోంది...
తదుపరి జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
దిల్లీ: జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ప్రస్తుతం పరిహారం కింద చెల్లిస్తోంది. ఈ ప్రక్రియకు జూన్తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఇకపై నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా.. స్వయంసమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో జీఎస్టీ మండలి పలు మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు వచ్చే నెల జరగనున్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.
5% శ్లాబు రెండు భాగాలుగా..
ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్నాయి. దీంట్లో 5 శాతం శ్లాబును పూర్తిగా ఎత్తివేయాలనే ప్రతిపాదనను మండలి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిధిలో ఉండి.. సామాన్య ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న కొన్ని వస్తువులను 3 శాతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. మరికొన్నింటిని 8 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిత్యావసర వస్తువులన్నీ అతి తక్కువ పన్ను శ్లాబైన ఐదు శాతం పరిధిలో ఉన్నాయి. విలాస వస్తువులకు 28 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. కొన్ని అత్యంత విలాసవంతమైన వస్తువులు, ‘సిన్ గూడ్స్’పై అదనంగా సెస్ కూడా విధిస్తున్నారు. ఫలితంగా వచ్చిన ఆదాయాన్ని జీఎస్టీ అమలు వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారంగా అందజేస్తున్నారు.
ప్యాక్ చేయని, బ్రాండెడ్ కాని ఆహార, డైరీ ఉత్పత్తులకు ప్రస్తుతం జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తోంది. అలాగే మరికొన్నింటిపైనా జీఎస్టీ మినహాయింపు కొనసాగుతోంది. అయితే, వీటిలో కొన్నింటిని మూడు శాతం పన్ను శ్లాబులో చేర్చాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు శాతం శ్లాబుని 7 లేదా 8 లేదా 9 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఆదాయం ఎంత పెరుగుతుంది?
5 శాతం శ్లాబుని 8 శాతానికి పెంచడం వల్ల ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జీఎస్టీ లెక్కల ప్రకారం.. అతి తక్కువ పన్ను శ్లాబును 1 శాతం పెంచితే అదనంగా రూ.50 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. మరోవైపు జీఎస్టీ మినహాయింపు వర్తిస్తున్న వస్తువుల సంఖ్యను సైతం తగ్గించే అవకాశం ఉన్నందున ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.
గతేడాదే కమిటీ ఏర్పాటు..
జులై 1, 2017న జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఐదేళ్లు అంటే జూన్, 2022 వరకు జీఎస్టీ అమలు వల్ల ఆదాయాన్ని నష్టపోయిన రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తామని కేంద్రం తెలిపింది. దీనికి 2015-16 నాటి రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ఏటా 14 శాతం వృద్ధిని పరిగణనలోకి తీసుకొని నష్టాన్ని లెక్కిస్తామని తెలిపింది. అయితే గత ఐదేళ్లలో పరిశ్రమ, వ్యాపార వర్గాల డిమాండ్తో పలు వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. దీంతో ఆదాయం తగ్గి రాష్ట్రాలకు లోటు ఏర్పడింది. తొలుత 28 శాతం పరిధిలో ఉన్న వస్తువుల సంఖ్య 228గా ఉండగా.. ఇప్పుడది 35కు తగ్గింది. ఈ నేపథ్యంలో రేట్లను హేతుబద్ధీకరించాలన్న డిమాండ్ పెరిగింది. దీంతో దీనిపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో జీఎస్టీ మండలి గత ఏడాది ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు