Crime News: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. హత్య కేసు నిందితుడు కాల్చివేత

హత్య కేసుల్లో నిందితులను (Murder accused) న్యాయస్థానం ముందు హాజరుపరచేందుకు తీసుకువెళ్తున్న పోలీసులపై ఓ ముఠా దాడి చేసింది. వారి కళ్లల్లో కారం కొట్టి (Chilly powder) ఆ నిందితులపై కాల్పులు జరిపి పారిపోయింది.

Published : 12 Jul 2023 15:54 IST

జైపుర్‌: హత్య కేసులో నిందితులను (Murder accused) న్యాయస్థానం ముందు హాజరుపరచేందుకు తీసుకువెళ్తున్న పోలీసులపై ఓ ముఠా దాడి చేసింది. వారి కళ్లల్లో కారం కొట్టి (Chilly powder) ఆ నిందితులపై కాల్పులు జరిపింది. దీంతో ఓ నిందితుడు ప్రాణాలు కోల్పోగా.. మరో హత్య కేసు నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan Murder) చోటుచేసుకుంది.

రాజస్థాన్‌కు చెందిన కుల్దీప్‌ జఘీనా, విజయ్‌పాల్‌ అనే వ్యక్తులు వేర్వేరు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిని భరత్‌పుర్‌లోని కోర్టులో హాజరుపరచేందుకు స్థానిక పోలీసులు రాజస్థాన్‌ రవాణా సంస్థకు చెందిన బస్సులో తీసుకెళ్తున్నారు. హలేనా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న అమోలీ టోల్‌ ప్లాజా వద్దకు చేరుకున్న వెంటనే కొందరు దుండగులు ఈ బస్సును అడ్డగించారు. ఓ కారుతోపాటు రెండు బైకులపై వచ్చిన 12మందికిపైగా దుండగలు.. బస్సులోకి ప్రవేశించారు. ఎస్కార్టుగా ఉన్న పోలీసులపై కారం చల్లి.. ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపి పారిపోయారు.

అనంతరం బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. వీరిలో కుల్దీప్‌ జఘీనా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నిందితుడు విజయ్‌పాల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా ప్రదేశానికి స్థానిక ఎస్పీ మృదుల్‌ కచ్ఛావాతోపాటు సీనియర్‌ అధికారులు చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పూర్తి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని