logo

ఎయిమ్స్‌లో సీట్లు ఇప్పిస్తానంటూ మోసం

 మంగళగిరి ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తానని ఇద్దరు విద్యార్థినుల నుంచి ప్రేమ్‌కుమార్‌ కాశీ అనే వ్యక్తి రూ.4 లక్షలు కాజేశాడు.

Published : 07 Dec 2022 02:51 IST

విద్యార్థినుల నుంచి రూ.4 లక్షలు కాజేసిన నకిలీ ఐఏఎస్‌

ఈనాడు-అమరావతి:  మంగళగిరి ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తానని ఇద్దరు విద్యార్థినుల నుంచి ప్రేమ్‌కుమార్‌ కాశీ అనే వ్యక్తి రూ.4 లక్షలు కాజేశాడు. మంగళగిరి డైరెక్టర్‌ పేరుతో ఆయన పంపిన మెయిల్‌్్స ఆధారంగా ఎయిమ్స్‌లో చేరేందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి మోసపోయామని తెలిసింది. ఈ వ్యవహారంపై తాడేపల్లి పోలీసులకు మంగళగిరి ఎయిమ్స్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యార్థినికి నీట్‌లో జాతీయ స్థాయిలో 7 లక్షలు, మరో విద్యార్థినికి పెద్ద ర్యాంకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థినికి తెలిసిన వారి ద్వారా పరిచయమైన ప్రేమ్‌కుమార్‌ కాశీ తాను ఐ.ఎ.ఎస్‌. అధికారినని  మంగళగరి ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌లో సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. మంగళగిరి ఎయిమ్స్‌లో సీటు అనేసరికి ఆమె స్నేహితురాలు కూడా తానూ డబ్బు ఇస్తానని చెప్పింది. ఈ మేరకు ఆయన చెప్పిన ఫోన్‌ నంబర్లకు విడతల వారీగా 1,36,500 ఫోన్‌ పే చేశారు. మరో రూ.2,63,500 నేరుగా అందచేశారు. ఈ చెల్లింపులు జరిగిన అనంతరం వీరిరువురికి మంగళగిరి డైరెక్టర్‌ పేరుతో నవంబరు 30న మెయిల్‌ వెళ్లింది. అందులో డిసెంబరు 1 నుంచి 3వ తేదీలోగా వచ్చి చేరాలని ఉంది. ఈ మెయిల్‌ వచ్చినప్పటి నుంచి వారు అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ వచ్చింది. దీంతో వారు ఈ నెల 3న మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లారు. అక్కడి ఉద్యోగులు ఆ మెయిల్‌ను తాము పంపలేదని చెప్పడంతో ఆ విద్యార్థినులు ఎయిమ్స్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. ఈ సంఘటనకు ముందు కర్ణాటకలోని బెంగుళూరు మెడికల్‌ కళాశాల వద్దకు వీరిని తీసుకువెళ్లాడు. అక్కడ కూడా సీటు వచ్చిందని నకిలీ మెయిల్‌ సృష్టించినట్లు బాధిత విద్యార్థులు చెప్పారని ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. కాశీ ఇన్‌స్టాగ్రామ్‌లో పద్మ పురస్కారానికి ఎంపికైనట్లు,  విశాఖ ఎన్సీఈఆర్టీ జోనల్‌ ప్రాజెక్టు డైరెక్టరుగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా ఉన్న వార్తలు (చిన్న పత్రికలోనివి) కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని