logo

మృత్యువులోనూ వీడని మైత్రి

ముగ్గురూ ప్రాణ మిత్రులు.. మరో స్నేహితుడి బంధువు వివాహ వేడుకకు ఒకే బైకుపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Updated : 09 Jun 2023 05:41 IST

ముగ్గురు యువకుల్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం

మిత్రబృందం (పాతచిత్రం)

తొండంగి, పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ముగ్గురూ ప్రాణ మిత్రులు.. మరో స్నేహితుడి బంధువు వివాహ వేడుకకు ఒకే బైకుపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తొండంగి ఎస్సై రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన పోలవరపు కిరణ్‌కుమార్‌ (22), కాకర వీరబాబు (21), పసుపులేటి శివ (21) వేమవరంలో ఓ శుభకార్యానికి హాజరై అక్కడ సరదాగా గడిపారు. అనంతరం బీచ్‌ రహదారిలో అన్నవరం వెళ్తున్నారు. మరో 15 కిలోమీటర్ల దూరం వెళ్తే గమ్యం చేరుకునేవారు. తొండంగి మండలంలోని కొత్తముసలయ్యపేట వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్నారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు కొందరు అక్కడకు చేరుకునేసరికి ట్రాక్టర్‌, ద్విచక్రవాహనం ఢీకొని ఉన్నాయి. కిరణ్‌కుమార్‌, వీరబాబు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్ర గాయాలతో ఉన్న శివను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. వేమవరం నుంచి వీరు ముగ్గురూ ద్విచక్ర వాహనంపై సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో గ్రామం నుంచి బీచ్‌ రహదారిపైకి వచ్చిన ట్రాక్టర్‌, వీరి వాహనం బలంగా ఢీకొన్నాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎవరిది తప్పు అనేది చెప్పలేకపోతున్నారు. అర్ధరాత్రి దాటాక గ్రామంలో ట్రాక్టర్‌ ఎందుకు తిరుగుతుందోనని మృతుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పాడైన ఇల్లును కూల్చి ఆ మట్టిని ట్రాక్టర్‌పై తరలిస్తున్నారని, ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనం రెండూ వేగంగా రావడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ టి.దండుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
చేతికి అందొచ్చిన కొడుకు దూరమయ్యాడు: కిరణ్‌కుమార్‌ తల్లి లక్ష్మి, దివ్యాంగురాలైన చెల్లితో కలిసి ఉంటున్నాడు. తండ్రి కుటుంబానికి దూరంగా ఉండేవాడు. దీంతో కిరణ్‌ పెయింటింగ్‌ పనులు చేస్తూ తల్లికి చేదోడుగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందొచ్చిన కొడుకును ప్రమాదంలో కోల్పోవడంతో తమకు దిక్కెవరంటూ లక్ష్మి కన్నీరుమున్నీరైంది.

అత్త దగ్గరే ఉంటూ: శివకు ఐదేళ్ల వయసులోనే తల్లి, తండ్రి మృతి చెందారు. దీంతో మేనత్త రమణమ్మ దగ్గరే ఉంటూ కాంక్రీట్‌ మిక్సర్‌ యంత్రం ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అత్త, మామకు తోడుగా ఉంటూ పేద కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. శివ మృతితో ఆసరా కోల్పోయామని వారు రోదిస్తున్నారు.

తండ్రి, చెల్లికి ఆసరా: మరో యువకుడు వీరబాబు తల్లి ఉపాధి కోసం దుబాయి వెళ్లారు. గ్రామంలోనే తండ్రి దొరబాబు, చెల్లితో కలిసి ఉంటున్నారు. ఈ యువకుడిపై ఆధారపడి తండ్రి, చెల్లి జీవిస్తున్నారు. అతడి మరణ వార్త తెలిసి వీరు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. బాధిత కుటుంబాలను తెదేపా నాయకురాళ్లు చించలపు సన్యాసమ్మ, గుడబంటి శాంతమ్మ పరామర్శించి ఓదార్చారు.

రోదిస్తున్న కిరణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని