logo

ఈసురోమని... ఈ-శ్రమ్‌

దేశంలో అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాల సేకరణ, వారి సంక్షేమానికి ఉద్దేశించిన ఈ-శ్రమ్‌ నమోదు జిల్లాలో మందకొడిగా సాగుతోంది. జిల్లాకు చెందిన లక్షల మంది కార్మికులు ఉపాధి పనుల కోసం వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.

Published : 06 Dec 2021 03:18 IST

నమోదులో జాప్యం

చివరి స్థానంలో జిల్లా

ఈ నెలాఖరు వరకే గడువు


రాయచోటిలో ఓ కాలనీలో కార్మికుల పేర్ల నమోదు

అట్లూరు, బద్వేలు, న్యూస్‌టుడే : దేశంలో అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాల సేకరణ, వారి సంక్షేమానికి ఉద్దేశించిన ఈ-శ్రమ్‌ నమోదు జిల్లాలో మందకొడిగా సాగుతోంది. జిల్లాకు చెందిన లక్షల మంది కార్మికులు ఉపాధి పనుల కోసం వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో రవాణా సౌకర్యాలు స్తంభించటంతో లక్షల మంది కార్మికులు కాలినడకన స్వస్థలాలకు తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు సూచనలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. అసంఘటిత కార్మికులను సంఘటితం చేయటానికి కసరత్తు ప్రారంభమైంది. దీనికి ఈ-శ్రమ్‌ పోర్టల్‌ తీసుకువచ్చింది. దీని ద్వారా ఉచితంగా పేర్లను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా కూడా స్వయంగా నమోదు చేసుకోవచ్ఛు సీఎస్‌సీ, గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ నమోదుకు అవకాశం ఉంది. ఈ విధానం కింద నమోదైన కార్మికులు ప్రమాదాల బారినపడితే రూ. 2 లక్షల వరకు బీమా పొందవచ్ఛు ఈ ప్రక్రియ జిల్లాలో నాలుగు నెలలుగా సాగుతోంది. అయినా నత్తనడకన సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఈ-శ్రమ్‌ నమోదులో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. చిట్టచివర (12) స్థానంలో కడప ఉండటం గమనార్హం.

లక్ష్యం 8.45 లక్షల మంది.. జిల్లాలో అసంఘటిత కార్మికులు 8.45 లక్షల మంది ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 60,707 మంది మాత్రమే ఈ-శ్రమ్‌లో నమోదై ఉన్నారు. జిల్లావ్యాప్తంగా సీఎస్‌సీ కేంద్రాల ద్వారానే ఎక్కువగా కార్మికుల నమోదు సాగుతోంది. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, కూరగాయల విక్రేతలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధి కూలీలు ఇలా సుమారు 75 రకాల రంగాల్లో పనులు చేసేవారందరూ అర్హులే. దీనికి ఆధార్‌, బ్యాంకు అకౌంటు, చరవాణి సంఖ్య ఆధారంగా నమోదు చేసుకోవచ్ఛు ఆధార్‌ను పోలిన ఈ-శ్రమ్‌ కార్డు వస్తుంది. జిల్లావ్యాప్తంగా ఈ పథకం నమోదు దశలో ఉంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లించేవారు అనర్హులు. సభ్యత్వం పొందటానికి 18-59 ఏళ్ల వయసున్న అందరూ అర్హులే. సీఎస్‌సీల ద్వారా చేపట్టిన నమోదులో ఎలాంటి రుసుంలు లేవు.l జిల్లాలో 8 లక్షల మందికి పైగా కార్మికులు ఉన్నా నమోదుకు మొగ్గుచూపడం లేదు. పొట్టచేతబట్టి పనుల కోసం జిల్లాలో గ్రామాల నుంచి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై తదితర పట్టణాలకు సుమారు 2 లక్షల మంది పైగా వెళ్లి ఉన్నారు. వీరంతా ఈ-శ్రమ్‌లో నమోదైతే ఉచితంగానే ప్రమాద బీమా పొందే వెసులుబాటు ఉంది. గ్రామ వాలంటీర్లు ఈ-శ్రమ్‌ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించటంలేదన్న విమర్శలు వస్తున్నాయి.

స్వచ్ఛందంగా వస్తున్నారు... - ఆదూరి గణేష్‌ కార్మిక శాఖాధికారి, కడప

ఈ-శ్రమ్‌ నమోదుకు గ్రామాల నుంచి కూడా స్పందన కనిపిస్తోంది. నమోదుకు కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఎన్నికలు, వర్షాల ప్రభావంతో ప్రక్రియలో కాసింత జాప్యం చోటుచేసుకుంటోంది. ప్రొద్దుటూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో నమోదు చురుగ్గా జరుగుతోంది. సీఎస్‌సీ నిర్వాహకుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి నమోదు చేయిస్తున్నాం. కార్మికుల సంక్షేమంపై విధివిధానాలు తొందర్లో రూపొందిస్తారు. గతంలో సాంకేతిక కారణాలు వెంటాడినా ప్రస్తుతం అన్నీ అనుకూలంగా ఉన్నాయి. లక్ష్యాన్ని తప్పనిసరిగా నిర్ణీత సమయంలో చేరుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని