logo

రామనగరలో శివశక్తి ప్రదర్శన

లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్‌ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్‌

Published : 29 Mar 2024 03:39 IST

ప్రచారం షురూ : రామనగరలో కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే సురేశ్‌ నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రసంగం. వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనూ చూడొచ్చు.

బెంగళూరు గ్రామీణ, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్‌ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్‌ నామినేషన్‌ కార్యక్రమానికి రాష్ట్రంలోని అతిరథ, మహారథులను రప్పించి ప్రచారానికీ జోష్‌ తెచ్చారు. ఇటు బెంగళూరు నుంచి కనకపుర, రామనగర వరకు డీకే కుటుంబం సాగించిన యాత్ర మద్దతుదారులందరినీ కూడగట్టుకోవడానికి ఉపకరించింది.

సిద్ధు మాటల తూటాలు

రామనగర: బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్‌ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. వైట్కాలర్‌ అభ్యర్థి డాక్టర్‌ మంజునాథ్‌ కావాలో- సురేశ్‌ కావాలో ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. రామనగరలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడి నుంచి సురేశ్‌ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరోసారి ఆయనకే పార్టీ టికెట్‌ కెటాయించిందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ముందంజలో ఉంటే.. కమలనాథులు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతారని ఆరోపించారు. ఐదు గ్యారంటీ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం చేరువయ్యిందన్నారు. భాజపాకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. కర్ణాటకలో భాజపా అధికారంలో ఉన్నప్పుడు పన్నుల రూపంలో చెల్లించిన మొతాన్ని అభివృద్ధి పనులకు ఉపయోగించలేదన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామనగర అభివృద్ధిని పక్కన పెట్టారని ఆరోపించారు.

భాజపా, దళ్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను విశ్వసించేందుకు ప్రజలు పిచ్చివాళ్లు కాదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. కావేరి నీటిని కాపాడుకునేందుకు, మేకెదాటు ప్రాజెక్టుకు చేసిన పోరాటానికి జనతాదళ్‌ మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు భాజపాతో చేరి, కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడమే లక్ష్యంగా దళపతులు పని చేస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ అభ్యర్థి డీకే సురేశ్‌, మంత్రులు ఎంసీ సుధాకర్‌, మంకాళ వైద్య, ఎమ్మెల్సీ సుదామ దాస్‌, జాతీయ యువ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.


బరిలోకి దూకిన డీకే సురేశ్‌

నామపత్రాన్ని అందిస్తున్న డీకే సురేశ్‌

రామనగర: బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డీకే సురేశ్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. తన అన్నావదినలు డీకే శివకుమార్‌, ఉషతో కలిసి రామనగర చాముండేశ్వరి దేవాలయంలో, అనంతరం కనకపుర కెంకేరమ్మ ఆలయంలో పూజలు చేసుకున్నారు. అన్నావదినల ఆశీర్వాదం తీసుకుని నామపత్రాన్ని అందుకున్నారు. పాత మైసూరు రోడ్డులో మంత్రి రామలింగారెడ్డి, ఎమ్మెల్యేలు ఇక్బాల్‌ హుసేన్‌, బాలకృష్ణ, మాజీ మంత్రి హెచ్‌ఎం రేవణ్ణ, పార్టీ నేతలు ఆనేకల్‌ శివణ్ణ, హెచ్‌డీ రంగనాథ్‌, బీవీ శ్రీనివాస్‌ తదితరులు వెంటరాగా ఓపెన్‌ టాప్‌ వాహనంలో జిల్లాధికారి కార్యాలయం వరకు ఊరేగింపుగా చేరుకున్నారు. బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి దళ్‌-భాజపా ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్‌ మంజునాథ్‌ బరిలో ఉన్నారు.


హాసనలో ప్రజ్వల్‌ జోరు

తాత దేవేగౌడతో ప్రజ్వల్‌

హాసన, న్యూస్‌టుడే : హాసన లోక్‌సభ నియోజకవర్గం భాజపా-దళ్‌ ఉమ్మడి అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణ గురువారం నామపత్రాన్ని దాఖలు చేశారు. జిల్లాధికారి సి.సత్యభామకు నామపత్రాన్ని అందజేశారు. తండ్రి, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, పార్టీ నాయకులు ఎ మంజు, హెచ్‌పీ స్వరూప్‌, సీఎన్‌ బాలకృష్ణలు ప్రజ్వల్‌తో కలిసి జిల్లాధికారి కార్యాలయానికి వెళ్లారు. నామపత్రాన్ని దాఖలు చేసేందుకు ముందుగా హొళెనరసీపుర తాలూకా మావినకెరెలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో పూజ చేసుకున్నారు. హరదనహళ్లిలోని తన తాత, మాజీ ప్రధాని దేవేగౌడను కలిసి ఆశీర్వాదం పొందారు.

  • దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి క్యాప్టెన్‌ బ్రిజేశ్‌ చౌటా నామపత్రాన్ని దాఖలు చేశారు. స్థానిక భాజపా నాయకులు ఆయనకు మద్దతుగా జిల్లాధికారి కార్యాలయం వరకు వెళ్లారు.
  • కర్ణాటకలో మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో పాతిక మంది గురువారం తమ నామపత్రాలను దాఖలు చేశారు. బీఎస్పీ, భాజపా, కాంగ్రెస్‌, జనతాదళ్‌, జనతాదళ్‌ (యు), కర్ణాటక జనతాపక్ష, యంగ్‌ స్టార్‌ ఎంపవర్‌మెంట్ పార్టీల తరఫున తలా ఒక నామపత్రాన్ని దాఖలు చేశారు. ఎస్‌యూసీఐ (కమ్యూనిస్టు) పార్టీ మూడు, కర్ణాటక రాష్ట్ర సమితి ఏడు, స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది మంది బరిలోకి దిగారు. వీరిలో కొందరు రెండు సెట్ల నామపత్రాలను దాఖలు చేయడంతో మొత్తం 29 నామపత్రాలు అందాయని ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని