వేటకత్తితో నరికి.. భార్యను చంపిన భర్త
భూస్వాధీనం చేసుకున్న భూమికి పరిహారంగా ప్రభుత్వం అందించిన రూ.2 కోట్లను పుట్టింటికి పంపించిన జయలక్ష్మి (36) అనే మహిళను హత్య చేసిన ఆమె భర్త శ్రీనివాస్ (38)ను దాబస్పేట ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : భూస్వాధీనం చేసుకున్న భూమికి పరిహారంగా ప్రభుత్వం అందించిన రూ.2 కోట్లను పుట్టింటికి పంపించిన జయలక్ష్మి (36) అనే మహిళను హత్య చేసిన ఆమె భర్త శ్రీనివాస్ (38)ను దాబస్పేట ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. నెలమంగల తాలూకా గొట్టిగెరెకు చెందిన శ్రీనివాస్కు దాబస్పేట పారిశ్రామికవాడలో ఎకరం భూమి ఉంది. దాన్ని స్వాధీనపరచుకున్న ప్రభుత్వం ఆయనకు రూ.2 కోట్లకు పైగా పరిహారాన్ని అందించింది. అందులో రూ.2 కోట్లను ఆమె తన పుట్టింటి వారి అవసరాలకు పంపించింది. ఇదే విషయమై దంపతుల మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. భార్యపై దాడి చేసి వేటకత్తితో హత్య చేశాడు. మృతదేహాన్ని ఇంటి వెనుక పెరట్లో పూడ్చి పెట్టేందుకు గుంత తీస్తున్న సమయంలో అతని పిల్లలు చూసి నిలదీశారు. మృతదేహాన్ని వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న జయలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాలించిన పోలీసులు నిందితుడిని శనివారం మధ్యాహ్నం అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.
బాలికను గర్భిణిని చేసిన యువకుడిపై కాల్పులు
హుబ్బళ్లి, న్యూస్టుడే : వివాహం చేసుకుంటానని ఒక బాలిక (17)ను గర్భిణిని చేసి పరారైన సద్దాం హుసేన్ (23) అనే నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపి, అదుపులోకి తీసుకున్నారు. సుతగట్టి సమీపంలో నిందితుడ్ని శుక్రవారం అర్ధరాత్రి అదుపులోనికి తీసుకునేందుకు వెళ్లిన నవనగర ఠాణా పోలీసులపై ఎదురుదాడి చేశాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఓ పోలీస్ అధికారి గాల్లోకి కాల్పులు జరిపి లొంగిపోవాలని హెచ్చరించినా ఆగకపోవడంతో నేరుగా కాల్పులు జరిపి పట్టుకున్నామని నగర పోలీసు కమిషనర్ రేణుకా సుకుమార్ తెలిపారు. నిందితుడు ఈశ్వర నగర నివాసి. అతనితో పాటు దాడిలో గాయపడిన ఒక కానిస్టేబుల్ను చికిత్స కోసం ధార్వాడలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రేమికులను కడతేర్చిన హంతకులకు ఉరి శిక్ష
విజయపుర, న్యూస్టుడే : ముద్దేబిహాళలో బాను బేగం అత్తార్, సాయబణ్ణ కొణ్ణూర అనే వ్యక్తులను హత్య చేసిన నేరారోపణ నేపథ్యంలో ఇబ్రహీం సాబ్, అక్బర్ సాబ్ అనే నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ విజయపుర జిల్లా రెండో అదనపు న్యాయస్థానం తీర్పు చెప్పింది. హత్యకు సహకరించిన రంజాన్ నబి అత్తార, దావలబి జమాదార్, అజ్మా దఖని, జిలాని దఖని, అబ్దుల్ ఖాదర్, దావలబి దన్నూరలకు జీవిత ఖైదు శిక్ష, అందరికీ కలిపి రూ.4.19 లక్షల జరిమానా విధించింది. బాను బేగం అత్తార్, సాయబణ్ణ కొణ్ణూర ఇద్దరూ ప్రేమించి 2017లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని బాను బేగం కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. మాట్లాడదాం రమ్మని దంపతులపై దాడి చేసి ఒంటిపై పెట్రోలు పోసి హత్య చేశారు. తాళికోటె ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయస్థానం శనివారం తీర్పు ఇచ్చింది.
వేదికపైనే కళాకారుడి గుండె ఆగిపోయింది..
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : నాటకం కొనసాగుతున్న సమయంలో శకుని పాత్ర పోషించిన ఎన్.మునికెంపణ్ణ (72) అనే నటుడు గుండెపోటుతో కన్నుమూశారు. యలహంక సమీపంలోని సాతనూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఘటన సంభవించింది. విశ్రాంత ఆచార్యుడైన మునికెంపణ్ణ దేవనహళ్లిలో నిర్వహించిన 28వ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. మునికెంపణ్ణ స్వగ్రామం అరదేశనహళ్లిలో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
మంగళూరు, న్యూస్టుడే : మంగళూరు బజ్పె విమానాశ్రయాన్ని పేల్చి వేస్తామంటూ ఒక నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. విమానాశ్రయానికి సంబంధించిన ఇ-మెయిల్ ఐడీకి నిందితుడు బెదిరింపు సందేశాన్ని పంపించాడు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం ఆవరణలో పోలీసులు, బాంబు నిష్క్రియ దళం సిబ్బంది సోదాలు నిర్వహించి, అది ఉత్తుత్తి బెదిరింపుగా తేల్చారు.
ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
దావణగెరె, న్యూస్టుడే : హొన్నాళి తాలూకా అరకెరె సమీపంలోని సూరనహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో శివమొగ్గకు చెందిన వేదమూర్తి (60), ఆయన తల్లి శారద (79) అనే వారు మరణించారు. వారి కుటుంబానికి చెందిన మరో ముగ్గురు గాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిట్ అదుపులో దేవరాజేగౌడ
[ 18-05-2024]
భాజపా నాయకుడు, న్యాయవాది దేవరాజేగౌడను ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అదుపులోనికి తీసుకుంది. హొళెనరసీపుర ఠాణా పోలీసుల విచారణ పూర్తి కావడంతో ఆయనను న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. దేవరాజేగౌడ నుంచి మరిన్ని వివరాలను రాబట్టాలని సిట్ తరఫు న్యాయవాది కోరడంతో శనివారం వరకు విచారించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. -
అన్నదాతలకు వెన్నుదన్ను
[ 18-05-2024]
కరవు పరిస్థితులతో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ముంగారులో సహకారం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో అధికారులతో సమావేశాలు నిర్వహించడానికి సాధ్యం కావడం లేదు. -
కొత్త చట్టాలకు పదును
[ 18-05-2024]
దేశవ్యాప్తంగా ఐపీసీ, సీఆర్పీసీతో పాటు పలు చట్టాల్లో మార్పులు వచ్చాయని నగర పోలీసు కమిషనర్ వి.దయానంద్ వెల్లడించారు. జులై ఒకటి నుంచి ఆ చట్టాలు అమలులోకి వస్తాయని వివరించారు. రాజధాని నగరంలోని ఆడుగోడి దక్షిణ సీఏఆర్ మైదానంలో సిబ్బంది నుంచి ఆయన శుక్రవారం గౌరవ వందనాన్ని అందుకున్నారు. -
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
[ 18-05-2024]
తన ప్రేమను నిరాకరించిందంటూ హుబ్బళ్లిలో అంజలి (19) అనే యువతిని మూడు రోజుల కిందట హత్య చేసిన నిందితుడు విశ్వ అలియాస్ గిరీశ్ (21) మరో హత్య చేసేందుకు తెగించి.. దొరికిపోయాడు. -
అప్ప విచారణకు చర్యలు?
[ 18-05-2024]
మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరేందుకు కార్ప్స్ ఆఫ్ డిటెక్టివ్ (సీఓడీ) అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
ప్రజ్వల్ ఎక్కడున్నా రప్పిస్తాం..
[ 18-05-2024]
లైంగిక దౌర్జన్య సంఘటనలకు సంబంధించి హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ తెలిపారు. -
కవీంద్రుడి కలల తీరం!
[ 18-05-2024]
అపూర్వం.. అద్భుతం.. అమోఘం.. మహా సుందరం.. అనే పదాలన్నీ అచ్చుగుద్దినట్లు రవీంద్రనాథ్ఠాగూర్ తీరానికి సరిపోతాయి. కార్వార సమీపంలో విస్తరించిన అరేబియా సముద్ర తీరానికి మన కవీంద్రుడి పేరుపెట్టి.. ప్రస్తుతం చక్కగా విస్తరించి పర్యాటకులకు అనువుగా మార్చారు. -
పరిషత్ పోరుకు కూటమి ముందడుగు
[ 18-05-2024]
విధానపరిషత్తు ఎన్నికల్లో భాజపా, జనతాదళ్ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలూ వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ టీఏ శరవణ పిలుపునిచ్చారు. భాజపా, జనతాదళ్ నాయకులతో కలిసి జయనగరలోని ఒక హోటల్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తుమకూరు దిశగా మెట్రో చూపులు
[ 18-05-2024]
రాజధాని నగర నాజూకు ప్రయాణ వ్యవస్థ ‘నమ్మ మెట్రో’ ఉత్తర-దక్షిణ కారిడార్ మార్గం రూపుదాల్చుతోంది. ఈ మార్గం పరిధిలో కీలకమైన నాగసంద్ర- అంతర్జాతీయ వస్తు ప్రదర్శన శాల (బీఐఈసీ) మధ్య 3.7 కిలోమీటర్ల ఉపరితల వంతెనపై జులై ఆఖరు నాటికే రైలు పరుగులు తీయనుందని అధికారులు ప్రకటించారు. -
రౌడీషీటరుపై కాల్పులు
[ 18-05-2024]
పేరొందిన రౌడీషీటరు నరసింహమూర్తి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ మిట్టెపై దొడ్డబళ్లాపుర పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. హేమంత్ కుమార్ గౌడ (27) అనే వ్యక్తిని హత్య సేసి పరారీలో ఉన్న శ్రీనివాస్ యలహంక తాలూకా శ్రీరామనహళ్లి సమీపాన ఉన్నట్లు గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లారు.