logo

మళ్లీ బయోమెట్రిక్‌

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం తిరిగి పట్టాలెక్కనుంది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి బయోమెట్రిక్‌ పద్ధతిని అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Published : 23 Jan 2023 03:27 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నేటి నుంచి అమలు
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం తిరిగి పట్టాలెక్కనుంది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి బయోమెట్రిక్‌ పద్ధతిని అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే ఈ పద్ధతిని కస్తూర్బాగాంధీ బాలికల జూనియర్‌ కళాశాలల్లో పకడ్బందీగా అమలు చేస్తుండటంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.

కరోనాతో మూలకు...

బయోమెట్రిక్‌ విధానం అమలు అంశం 2016-17 విద్యా సంవత్సరంలోనే తెరపైకి వచ్చింది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి అధునాతన హాజరును అప్పుడే ప్రవేశపెట్టారు. కొన్నిచోట్ల యంత్రాలు కొద్దిరోజులకే మొరాయించడం, నిర్వహణలో సాంకేతిక లోపాలు తలెత్తడం వంటివి జరిగాయి. మూడేళ్ల తర్వాత కరోనా వైరస్‌ కారణంగా ప్రత్యక్ష తరగతులు నిలిచిపోయాయి. బయోమెట్రిక్‌ హాజరు మూలకు చేరింది. వినియోగం లేకపోవడం, కాలపరిమితి ముగియడంతో ఆ వ్యవస్థను గతేడాది నుంచి పూర్తిగా పక్కనబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ఉభయ జిల్లాల్లోని 33 కళాశాలల్లో కొత్త యంత్రాలు బిగించారు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించారు. తొలి విడతగా ప్రిన్సిపల్స్‌, బోధన, బోధనేతర సిబ్బంది వేలిముద్రలు నమోదు ఇటీవల పూర్తయింది. నేటి నుంచి వీరంతా బయోమెట్రిక్‌ హాజరు వినియోగించుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి విద్యార్థులకూ అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు.

ఆలస్యానికి చెక్‌

చాలా కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు రాకపోకలు సాగిస్తున్నారు. కొందరు ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు. సమయపాలన పాటించకపోవడంతో తరగతుల నిర్వహణకు ఇబ్బంది కలుగుతోంది. మరికొందరు తరచూ బయటకు వెళ్లడం.. సొంత పనులు చక్కదిద్దుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘బయోమెట్రిక్‌’ విధానం అమలుతో బోధన తీరు క్రమంగా మెరుగుపడుతుందని కళాశాలల నిర్వాహకులు భావిస్తున్నారు.


జూనియర్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేసేలా ఏర్పాట్లు చేశాం. వేలిముద్రలతోనే హాజరు తీసుకోవాలని మండలి నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు కూడా ఈ విధానం అమలు చేస్తాం.’

సులోచనారాణి, డీఐఈవో, భద్రాద్రి కొత్తగూడెం


‘మా కళాశాలలో యంత్రాల ఏర్పాటు పూర్తయింది. నూతన హాజరు విధానంతో విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులకూ అమలు చేస్తే హాజరుశాతం మరింత పెరుగుతుంది. ఉత్తమ వార్షిక ఫలితాలు సాధించేందుకు వీలవుతుందని ఆశిస్తున్నాం.’

కత్తి రమేశ్‌, చుంచుపల్లి కళాశాల  


‘రాష్ట్ర విద్యా మండలి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బయోమెట్రిక్‌తో సిబ్బంది, విద్యార్థిలో క్రమశిక్షణ పెరుగుతుంది. తరగతుల పకడ్బందీగా నిర్వహించవచ్చు. మెరుగైన బోధనకు కొత్త హాజరు విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’.

కేఎస్‌ రామారావు, ఖమ్మం నయాబజార్‌ కళాశాల  


 

జూనియర్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేసేలా ఏర్పాట్లు చేశాం. వేలిముద్రలతోనే హాజరు తీసుకోవాలని మండలి నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు కూడా ఈ విధానం అమలు చేస్తాం.’

సులోచనారాణి, డీఐఈవో, భద్రాద్రి కొత్తగూడెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని