logo

సామాజిక వాణి పాలమూరు బాణి

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు ఎంతో హైరానా పడేవారు.. అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ జనాలకూ తెలిసేది కాదు. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది.

Updated : 05 May 2024 06:51 IST

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు ఎంతో హైరానా పడేవారు.. అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ జనాలకూ తెలిసేది కాదు. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. అరచేతిలో చరవాణి ఉన్న ప్రతి ఒక్కరూ అన్నీ తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలో మన పాలమూరులోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు  సామాజిక మాధ్యమాల్లో ఏ మేరకు చురుగ్గా ఉన్నారు? వారిని ఎంతమంది అనుసరిస్తున్నారో తెలుసుకుందాం.

న్యూస్‌టుడే, నారాయణపేట పట్టణం

‘‘ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక మాధ్యమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి..నాయకులు, వారి అనుచరులు ట్విట్టర్‌(ఎక్స్‌) ఖాతాను తెరవడంతోపాటు అభిమాన నేతలను అనుసరిస్తుంటారు. చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఉన్నప్పటికీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ఎక్స్‌లో ఖాతా లేకపోవడంతో గత నెల చివరి వారంలో తెరిచారు..నిమిషాల్లోనే వేలాది మంది ఆయనను అనురించారు..’’

ఒకవైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఈ రెండు,మూడు రోజులుగా జోరందుకుంది. మధ్యాహ్నం కాసేపు విరామం తీసుకుని సాయంత్రం నుంచి మళ్లీ ప్రచారం చేస్తున్నారు..రహదారులు, గల్లీల్లో మైకుల మోత ఒక వైపు మోగుతుంటే, మరోవైపు సామాజిక మాధ్యమాలైన వాట్సాప్‌, ఎక్స్‌(ట్విట్టర్‌), ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర వాటిలో ప్రచారం మోత మోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో అండ్రాయిడ్‌ ఫోన్లు ఉన్నాయి. అంతా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తుంటారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తొందరగా ఓటరును చేరుకోడానికి ఇవి ఆలంబనగా నిలిచాయి. ప్రచారంలో సమయం ఆదాతోపాటు ఖర్చు సైతం తగ్గుతుంది. మ్యానిఫెస్టో వివరించడం, ప్రత్యర్థులకు దీటుగా సమాధానం చెప్పడానికి సామాజిక వేదికలను వినియోగించుకుంటున్నారు. కొందరు అభ్యర్థుల యూట్యూబ్‌ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే వివాదాస్పద వీడియోలు చిత్రాలు వేరేవారికి పంపితే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. గ్రూప్‌ అడ్మిన్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

పల్లెల్లో వాట్సాప్‌ గ్రూపులు: ప్రతి గ్రామంలో వాట్సాప్‌ గ్రూపులు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో సమాచారం చేరవేయడానికి కొత్త గ్రూపులు పుట్టుకొస్తున్నాయి. సమావేశం, ప్రచారం ఉందంటే గ్రూపులో పోస్టు చేస్తున్నారు..నిమిషాల వ్యవధిలో అందరూ ఒకే దగ్గరకు చేరుకుంటున్నారు. పార్టీలకు గ్రూపులతోపాటు ‌్రగ్రామం, మండలం, పట్టణం, జిల్లాల గ్రూపులు ఏర్పాటయ్యాయి. జన సమీకరణతోపాటు అదే సమయానికి కార్నర్‌ మీటింగ్‌, రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారం విజయవంతంగా నిర్వహించడానికి గ్రూపులు దోహదపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని