logo

అయ్యో.. పాపం!

అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రించాల్సిన ఆడ శిశువును తల్లిదండ్రులు మానవత్వం మరిచి చెట్ల పొదల్లో పారేశారు. పందులు, కుక్కలు సంచరించే ప్రాంతంలో పసికందును విసిరేయడంతో గాయాలైన ఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం రుక్మాపూర్‌లో చోటుచేసుకుంది.

Published : 08 Feb 2023 02:03 IST

శిశువు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్న ఎస్‌ఐ వినయ్‌కుమార్‌, అంగన్‌వాడీ సిబ్బంది

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌ అర్బన్‌), న్యూస్‌టుడే: అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రించాల్సిన ఆడ శిశువును తల్లిదండ్రులు మానవత్వం మరిచి చెట్ల పొదల్లో పారేశారు. పందులు, కుక్కలు సంచరించే ప్రాంతంలో పసికందును విసిరేయడంతో గాయాలైన ఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం రుక్మాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామం మీదుగా సాగే మెటల్‌కుంట- అల్లాదుర్గం దారి పరిసరాల్లో ముళ్లపొదల్లో పసికందు ఏడుపు శబ్దం విన్న స్థానికులు హద్నూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ ఆశా కార్యకర్త కవిత, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సంగీత సాయంతో శిశువును జహీరాబాద్‌ వైద్య విధాన పరిషత్తు ప్రాంతీయ ఆసుపత్రి తరలించారు. పాపను దూరం నుంచి విసిరేయడంతో వీపు, కాళ్లు, చేతులకు ముళ్ల పొదలు, బండ రాళ్ల గాయాలు అయ్యాయి. నవజాత శిశు సంరక్షణ వార్డులో ప్రథమ చికిత్స అందించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో సంగారెడ్డిలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు సీడీపీవో సునీతాబాయి పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల వద్ద నుంచి గర్భిణుల సమాచారం సేకరించి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని