logo

స్వస్థలానికి వెళ్తూ.. కానరాని లోకాలకు

ఆటోలో తన స్వస్థలానికి వెళుతున్న వ్యక్తి మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన దోర్నాల మండలం యడవల్లి సమీపంలో చోటుచేసుకుంది.

Published : 04 Dec 2022 05:23 IST

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: ఆటోలో తన స్వస్థలానికి వెళుతున్న వ్యక్తి మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన దోర్నాల మండలం యడవల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కర్నూలు జిల్లా గార్గేయపురానికి చెందిన షేక్‌ రసూల్‌మియ(64) ముప్పై సంవత్సరాల క్రితమే నంద్యాల జిల్లా సున్నిపెంట వచ్చి నివాసం ఉంటున్నారు. శనివారం స్వగ్రామం వెళ్లేందుకు సున్నిపెంట నుంచి దోర్నాలకు బస్సులో వచ్చారు. అక్కడి నుంచి ఆత్మకూరు వైపు వెళుతున్న ఆటో ఎక్కి డ్రైవర్‌ కుడి పక్కన కూర్చున్నాడు. యడవల్లి సమీపంలో రహదారిలో చిన్న గుంత కనిపించడంతో డ్రైవర్‌ ఆటోను కుడివైపు తిప్పాడు. వెనుక వస్తున్న కారు ఆటోను తగిలింది. దీంతో రసూల్‌మియ కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రసూల్‌మియకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.


మనస్తాపంతో... వివాహిత ఆత్మహత్య

తర్లుపాడు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన తర్లుపాడులో శనివారం  చోటు చేసుకుంది. ఎస్సై ముక్కంటి తెలియజేసిన  వివరాల మేరకు..గ్రామంలోని కోనంకి ఎల్లమ్మ(23)ను నాలుగేళ్ల కిందట మేనమామకు ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. అయితే భార్య భర్తల మధ్య మనస్పర్థలు  రావడంతో వివాహమైన ఆరు నెలలకే ఎల్లమ్మ పుట్టింటికి వచ్చి ఉంటోంది. అయితే గత వారం రోజులుగా ఎల్లమ్మ తల్లిదండ్రులు భర్త వద్దకు వెళ్లమని చెబుతూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. అందుకు ఇష్టం లేకపోవడంతో శనివారం తల్లిదండ్రులు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆమె మృతి చెందింది. కుటుంబసభ్యులను విచారించిన ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని